పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గొచ్చు: ఎక్సైజ్ సుంకం తగ్గించే యోచన
ఇటీవల పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. మార్చి మిడిల్ నుండి మాత్రమే పెరగడం లేదు. పైగా మూడు పర్యాయాలు స్వల్పంగా ధరలు తగ్గాయి. కానీ గత కొద్ది నెలలుగా చమురు ధరలు పెరుగుతుండటంతో ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకున్నాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ లీటర్ ఏకంగా రూ.100 క్రాస్ చేసింది. అన్ని ప్రధాన నగరాల్లో రూ.90 దాటింది. పెరుగుతున్న ధరలు వినియోగదారులను బెంబేలెత్తించాయి. అయితే అంతర్జాతీయ మార్కెట్లో కాస్త ధరలు తగ్గడం, దీనికి తోడు కరోనా కేసులు పెరగడం వల్ల ఇటీవల ధరల్లో మార్పులేదు. అయితే ఇటీవల పెరిగిన ధరలు త్వరలో తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇప్పుడు కాకపోయినా...
పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, ఇంధన శాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్లు పలుమార్లు స్పందించారు. అంతర్జాతీయ మార్కెట్ను బట్టి ఇక్కడ పెరుగుతున్నాయని, ధరలు భారీగా పెరుగుతున్నాయని, తగ్గించడం ఒక్కటే ప్రత్యామ్నాయమని వారు కూడా అభిప్రాయపడ్డారు. తద్వారా ధరల తగ్గుదల అవశ్యకతను కేంద్రమంత్రులు కూడా గుర్తించినట్లయింది. పెట్రోల్, డీజిల్ను జీఎస్టీ పరిధిలోకి తీసుకు వస్తే ధరలు తగ్గుతాయని వినియోగదారులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. కానీ ప్రస్తుతం ఆ ఆశలు కనిపించడం లేదు. ప్రస్తుతం అలాంటి ప్రతిపాదన లేదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. అయితే జీఎస్టీ పరిధిలోకి రాకపోయినప్పటికీ మున్ముందు తగ్గే అవకాశాలు మాత్రం ఉన్నాయని కేంద్రమంత్రులు సహా పలువురి వ్యాఖ్యల ద్వారా తెలుస్తోంది.
సమయం వచ్చినప్పుడు తగ్గింపు
పెట్రోల్, డీజిల్ ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం తగ్గించేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. సమయం వచ్చినప్పుడు పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుకు ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపును కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుందని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్(CBIC) చైర్మన్ అజిత్ కుమార్ తెలిపారు. సమయం వచ్చినప్పుడు తగ్గింపు ఉంటుందన్నారు. రానున్న నెలల్లో ఆదాయంలో బలమైన వృద్ధి నమోదవుతుందనే ఆశాభావంతో ఉన్నట్లు చెప్పారు.
అందుకే పెరిగిన ధరలు
గత ఆర్థిక సంవత్సరంలో పరోక్ష పన్నుల ఆదాయంలో భారీ వృద్ధి నమోదయింది. ఇందుకు ప్రధాన కారణం ఎక్సైజ్, సర్వీస్ ట్యాక్స్ ఆదాయం భారీగా పెరగడమే కారణమని చెబుతున్నారు. గత ఏడాది పెట్రోల్పై లీటర్కు రూ.13, డీజిల్పై లీటర్కు రూ.16 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని పెంచింది ప్రభుత్వం. దీంతో పెట్రోల్పై ఎక్సైజ్ సుంకం రూ.32.90కు చేరుకుంది. విక్రయ ధరలో దాదాపు 39 శాతం ఎక్సైజ్ సుంకం ఉంది. డీజిల్ లీటర్పై మొత్తం ఎక్సైజ్ సుంకం రూ.31.80గా ఉంది. రాష్ట్రాల్లో వ్యాట్, ఇతర పన్నులను కలుపుకుంటే పెట్రోల్, డీజిల్ ధరల్లో పన్నుల వాటా 60 శాతం వరకు ఉంది.