అమరావతి కోసం ఆంధ్రప్రదేశ్ రూ.1 లక్ష కోట్లు పెట్టే పరిస్థితి ఉందా?: ఇదీ జగన్ లెక్క
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. శుక్రవారం ఏపీ రాజధానిపై కేబినెట్ ఓ నిర్ణయం తీసుకుంటుందని భావించారు. కానీ తెరపైకి హైపవర్ కమిటీ వచ్చింది. ఇప్పటికే జీఎన్ రావు కమిటీ నివేదిక ఇచ్చింది. బోస్టన్ కన్సల్టెన్సీ జనవరి 3 నివేదిక ఇవ్వనుంది. ఈ రెండు నివేదికలపై మంత్రులు, సీనియర్ ఐఏఎస్ అధికారులతో కూడిన హైపవర్ కమిటీ అధ్యనయం చేసి జనవరి 18 నాటికి నివేదిక ఇస్తుంది. శుక్రవారం జరిగిన కేబినెట్లో రాజధాని ఖర్చు అంశం ప్రధానంగా చర్చకు వచ్చింది.
ఇప్పటికే సగం ప్రాజెక్టులు..: అమరావతిపై జగన్ నిర్ణయం! రియల్ ఎస్టేట్ వ్యాపారుల టెన్షన్
రూ.1 లక్ష కోట్లు పెట్టే పరిస్థితి ఏపీకి లేదా?
గత చంద్రబాబు ప్రభుత్వం అయిదేళ్లలో రాజధాని అమరావతి కోసం రూ.5 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని, ఇప్పుడు ఇక్కడ రూ.1 లక్ష కోట్లకు పైగా పెట్టే పరిస్థితి ఉందా అని జగన్ కేబినెట్ భేటీ సందర్భంగా అన్నారు. రాజధాని నిర్మాణానికి రూ.లక్షల కోట్లు కావాలని చంద్రబాబు గతంలో చెప్పారు. ఇప్పుడు లక్ష కోట్లకు పైగా ఖర్చు పెట్టే పరిస్థితి ఏపీకి లేదని జగన్ అభిప్రాయపడుతున్నారు.
ఇదీ జగన్ ప్రశ్న.. ఈ లెక్కన రాజధాని ఎప్పుడు పూర్తవుతుంది?
చంద్రబాబు హయాంలో అయిదేళ్ళకు రూ.5 వేల కోట్లు ఖర్చు చేశారు. ఇలా ఖర్చు చేసుకుంటూ వెళ్తే రూ.లక్ష కోట్లు ఎన్ని ఏళ్లు పెట్టగలమని, అప్పుడు రాజధాని ఎప్పటికి అభివృద్ధి చెందుతుందనేది జగన్ ప్రశ్నగా ఉంది. ఇప్పుడు రూ.5వేల కోట్లతో పనులు ప్రారంభించినా గతంలో చేసిన పనులు ఎందుకు పనికి రావడం లేదని అభిప్రాయపడ్డారు. ప్రతి అయిదేళ్లకు తిరిగి చూసుకుంటే కట్టిన భవనాలు కుంగిపోతాయని చెప్పారు. అలా అయితే రాజధాని కోసం ఖర్చు పెట్టడం పక్కన పెడితే అది ఎప్పటికి పూర్తవుతుందని అంటున్నారు. దశాబ్దాలు గడిచినా చేయలేమని అంటున్నారు.
ఇదీ చంద్రబాబు లెక్కే..
రాజధాని నగర నిర్మాణం కావాలంటే ఎకరాకు రూ.2 కోట్లు ఖర్చవుతుందని చంద్రబాబు చెప్పారని జగన్ గుర్తు చేస్తున్నారు. అంటే 53వేల ఎకరాలకు రూ.1 లక్ష ఆరువేల కోట్లు అవసరం. కానీ గత అయిదేళ్లలోనే రూ.5800 కోట్లు ఖర్చు అయింది. రాజధాని అభివృద్ధి కోసం రూ.1,10,000 కోట్లు కావాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీకి అంత డబ్బు ఖర్చు చేయలేదనేది ఆయన అభిప్రాయం.
10 శాతం ఖర్చుతో అద్భుత రాజధాని
అమరావతిని రాజధానిగా నిర్మించేందుకు రూ.1 లక్ష కోట్లకు పైగా అవసరం. కానీ ఇందులో 10 శాతం వెచ్చిస్తే విశాఖపట్నంలో రోడ్ల విస్తరణ, మెట్రో, మౌలిక వసతులు కల్పించి అభివృద్ధి చేస్తే వేగంగా అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నారు. కనీసం పదేళ్లలో హైదరాబాదుతో పోటీ పడే స్థాయికి చేరుకుంటుందని చెబుతున్నారు.
పెట్టుబడులు వస్తాయి..
విశాఖపట్నం పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉంటుందని, దీంతో ఇన్వెస్టర్లను ఆకర్షించవచ్చునని చెబుతున్నారు. పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తే ఏపీ వారికి ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. ఇదిలా ఉండగా, రాజధానిపై తుది నిర్ణయం వెల్లడించే ముందు జగన్ ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి పరిస్థితిని వివరించనున్నారని తెలుస్తోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, రాజధానిని అభివృద్ధి చేసుకోవాల్సిన అవశ్యకతను వారి దృష్టికి తీసుకెళ్లి వారి మద్దతు పొందనున్నారని అంటున్నారు.
విశాఖలో నిర్మించి ఉంటే...
విశాఖలో సచివాలయం, అసెంబ్లీ, భవనాలు నిర్మించి, మెట్రో రైలును ఏర్పాటు చేస్తే హైదరాబాద్, ముంబై, బెంగళూరు, చెన్నై వంటి నగరాలతో పోటీ పడేవాళ్లమని జగన్ అభిప్రాయపడ్డారు. అమరావతి కంటే విశాఖలో ఉంటే వేగంగా అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు.