Budget 2020: పడిపోయిన తలసరి, మందగమనానికి ఎన్నికలూ కారణమని తెలుసా?
ఫిబ్రవరి 1న నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో వినియోగం, డిమాండ్ పెంచే అంశాలపై దృష్టి సారించవచ్చునని అంటున్నారు. అయితే వినియోగం భారీగా పడిపోయిన నేపథ్యంలో డిమాండ్ పెంచే చర్యలు చేపట్టడం సులువేమీ కాదని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆర్థికమంత్రి తీసుకునే నిర్ణయాలపై అందరి దృష్టి ఉంది. మందగమనం, వృద్ధి రేటు భారీగా పడిపోవడం, నిరుద్యోగం పెరుగుతుండటం, ఉత్పాదక రంగాలు దిగజారిపోవడం.. ఇవన్నీ ఆందోళన కలిగిస్తున్నాయి.
వీరందరికీ బడ్జెట్లో ఊరట
వినియోగం, డిమాండ్ తగ్గిన నేపథ్యంలో నిరుద్యోగులకు, శాలరైడ్కు, రైతులకు, పారిశ్రామికవేత్తలకు, ఇన్వెస్టర్లకు, వ్యాపారులకు.. ఇలా ప్రతి ఒక్కరికి ఈసారి ఊరటనిచ్చే అంశాలు ఉంటాయని భావిస్తున్నారు. ప్రస్తుత మందగమనానికి ప్రపంచ మందగమనం ప్రభావంతో పాటు నోట్ల రద్దు, జీఎస్టీ ప్రభావం కూడా ఉందనేది ఆర్థిక నిపుణుల మాట. పుష్కర కాలంలో వృద్ధి రేటు 5 శాతానికి పడిపోవడం ఇదే మొదటిసారి. 2018-19లో 8 శాతం వృద్ధి రేటుతో దూసుకుపోయింది.
పడిపోయిన సేల్స్
రియల్ ఎస్టేట్ నిస్తేజం, ఆటోమొబైల్ సేల్స్ భారీగా తగ్గిపోవడం, పారిశ్రామిక ఉత్పత్తి పడిపోవడం వంటివి మందగమనానికి అద్దం పడుతున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వ పన్ను వసూళ్లు లక్ష్యానికి చేరుకోలేని పరిస్థితి.
భారీగా తగ్గిన తలసరి
ఓ సర్వే ప్రకారం తలసరి కుటుంబ నెలవారీ వ్యయం గత 8 ఏళ్లలో పడిపోయింది. 2011-12లో రూ.1,501గా ఉండగా, నోట్ల రద్దు, జీఎస్టీ తర్వాత 2017-18లో రూ.1,446గా ఉంది. గ్రామీణ భారతంలో ఖర్చు 8.8 శాతం పెరిగింది. పట్టణాల్లో 2 శాతం పెరిగింది.
ఇప్పటికీ జీఎస్టీ, నోట్ల రద్దు కష్టాలు
నోట్ల రద్దు, జీఎస్టీ పరిణామాలు దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని అంటున్నారు. ఆ కష్టాలు నేటికీ కొనసాగుతున్నాయనేది ఆర్థిక నిపుణుల మాట. జీఎస్టీలోని కొన్ని లోపాలు, అమలులో ఇబ్బందులతో చిన్న వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బడ్జెట్లో వీరి ఇబ్బందులు తొలగించాల్సి ఉంది.
మందగమనానికి ఎన్నికలూ కారణం!
మందగమనానికి మరిన్ని ఆసక్తికర కోణాలు ఉన్నాయని చెబుతున్నారు. ప్రభుత్వ ఆదాయం తగ్గడంతో ఖర్చుల్లో కోతలు ఉంటున్నాయి. ఆర్బీఐ అంచనా ప్రకారం 2017-18లో ప్రభుత్వం చేసిన తగ్గించిన ఖర్చు కారణంగా దేశ ఆర్థికరంగం 11 శాతం పెరిగింది. గత ఆర్థిక సంవత్సరంలో పలు అసెంబ్లీలకు, లోకసభకు ఎన్నికలు జరిగాయి. దీంతో అభివృద్ధిపై ప్రభుత్వాలు చేసే ఖర్చు తగ్గింది. దీంతో ప్రజల చేతికి డబ్బులు అందక కూడా మందగమనానికి కారణమైందని అంటున్నారు.
వ్యవసాయానికి ఊతం
2002 నుంచి 2011 మధ్య వ్యవసాయ వృద్ధి రేటు 4.4 శాతంగా ఉండగా ఇప్పుడు అది 3.1 శాతానికి పడిపోయింది. రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో వారికి అనుకూలంగా బడ్జెట్ ఉండే అవకాశముంది.
వీటిపైనా దృష్టి సారించాలి
ఆహార ద్రవ్యోల్భణం ఆరేళ్ల గరిష్టానికి చేరుకుంది. నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వినియోగదారుడు తిండి కోసమే తప్ప ఇతర అంశాలపై దృష్టి పెట్టడం తగ్గించే పరిస్థితి. ఉద్యోగం నాలుగున్నర దశాబ్దాల గరిష్టానికి చేరుకుంది. ఈ అంశాలపై దృష్టి సారించాల్సి ఉంది. ద్రవ్యలోటు ఆందోళన కలిగిస్తోంది.