మరో రూ.1 లక్ష కోట్లు టార్గెట్, వస్తువుల ధరలు పెరిగే ఛాన్స్: నేరుగా కాకుండా...
రాబోయే జీఎస్టీ మండలి సమావేశంలో పన్ను రేట్ల పెంపుకు అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. జీఎస్టీ అమలులోకి వచ్చిన తర్వాత... ఇటీవలి కాలంలో మందగమనం కారణంగా గత కొన్నాళ్లుగా రెవెన్యూ తగ్గుతోంది. పైగా ఎక్కువ జీఎస్టీ స్లాబ్లలో ఉన్న వస్తువులు తక్కువ స్లాబ్లోకి వచ్చాయి. దీంతో ఆదాయానికి గండి పడుతోంది. ఈ నేపథ్యంలో వస్తు, సేవల పన్నులను పెంచాలని మోడీ ప్రభుత్వం యోచిస్తోంది.
నేరుగా కాకుండా ముడి సరుకులపై పెంపు
జీఎస్టీ ఆదాయాన్ని దాదాపు మరో రూ.లక్ష కోట్లు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. స్లాబ్స్ మార్చి, పన్ను రేట్లను పెంచి, కొత్త పన్నులను విధించడం ద్వారా ఆ లక్ష్యాన్ని చేరుకోవచ్చని భావిస్తోంది. 18 శాతం శ్లాబులోకి కనీసం 243 వస్తువులు చేర్చే అవకాశాలున్నాయి. దీంతో వినియోగదారులపై కొద్దిగా భారం పడనుంది. అయితే ఖజానాకు రాబడి పెరుగుతుంది. ఆయా వస్తువులపై నేరుగా కాకుండా వాటి ముడి సరుకులపై పన్నులు పెంచాలని కూడా యోచిస్తోంది.
ప్రజల నుంచి ఆందోళనలు
గత రెండేళ్లుగా ప్రజలపై జీఎస్టీ భారం తగ్గిస్తూ వచ్చిన మోడీ ప్రభుత్వం.. సామాన్యులకు ఎంతో ఊరట కల్పించింది. అయితే ఇప్పుడు పెంచడం ద్వారా ప్రజల్లో ఆందోళనలు వస్తాయనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇన్నాళ్లు సామాన్యులపై భారం తగ్గిస్తూ వచ్చి, ఇప్పుడు మళ్లీ పెంచితే నిరసనలు వ్యక్తం కావొచ్చునని అంటున్నారు. ఈ నేపథ్యంలో తొలుత లగ్జరీ ఉత్పత్తులపై పన్ను పెంచాలని, ఆ తర్వాతే ఇతర వస్తువుల వైపు వెళ్లాలని భావిస్తోంది కేంద్రం. ఇందులో భాగంగా స్లాబ్స్ మార్చవచ్చునని అంటున్నారు. 5 శాతం స్లాబ్ 6 శాతానికి పెరగవచ్చునని భావిస్తున్నారు.
జీఎస్టీ సేవలు.. మినహాయింపులు
ఒకే దేశం, ఒకే పన్ను, ఒకే మార్కెట్ నినాదంతో రెండున్నరేళ్ల క్రితం క్రితం కేంద్రం జీఎస్టీని తీసుకు వచ్చింది. అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రాల్లో ఉన్న డజనుకు పైగా పన్నులను ఏకం చేసింది. జీఎస్టీ పరిధిలో 500కు పైగా సేవలు, 1,3000కు పైగా వస్తువులు ఉన్నాయి. 0, 5, 12, 18, 28 శాతాల్లో ఆయా జీఎస్టీ పన్నులు విధించారు. బంగారంపై ప్రత్యేకంగా 3% పన్ను వేయగా, విలువైన ముడి రత్నాలు, రాళ్లపై కనిష్ఠంగా 0.25% పన్ను నిర్ణయించారు. పెట్రో ఉత్పత్తులను జీఎస్టీలో చేర్చలేదు. విద్య, వైద్యం, తాజా కూరగాయలు తదితరాలకు ఈ పన్ను నుంచి మినహాయింపు ఇచ్చింది.