లేచి'పడిన' బిట్ కాయిన్, ప్రాఫిట్ బుకింగ్ ఎఫెక్ట్.. మళ్లీ 40,000 డాలర్ల దిగువకు పోయే ఛాన్స్
క్రిప్టో కరెన్సీ మరోసారి క్షీణించింది. నిన్నటి వరకు వరుసగా లాభపడిన క్రిప్టో నేడు మళ్లీ కిందకు పడిపోతోంది. క్రితం సెషన్లో క్రిప్టో దిగ్గజం బిట్ కాయిన్ 44,000 మార్కును క్రాస్ చేసింది. అయితే నేడు 43,000 డాలర్ల దిగువనే ట్రేడ్ అవుతోంది. బిట్ కాయిన్ సహా క్రిప్టోలు తాజా గరిష్టాలను నమోదు చేశాక, ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్కు మొగ్గు చూపుతున్నట్లుగా కనిపిస్తోంది. ప్రాఫిట్ బుకింగ్ ఇలాగే కొనసాగే అవకాశాలు ఉన్నాయని, అప్పుడు బిట్ కాయిన్ మరోసారి 40,000 డాలర్ల దిగువకు పడిపోయే అవకాశాలు లేకపోలేదని క్రిప్టో నిపుణులు అంచనా వేస్తున్నారు. 40,000 డాలర్ల వద్ద బలమైన పరీక్షను ఎదుర్కొంటుందని చెబుతున్నారు.
ఈ వార్త రాసే సమయానికి బిట్ కాయిన్ 42,483 డాలర్లు, ఎథేరియం 3,237 డాలర్లు, ఎక్స్ఆర్పీ 0.75934 డాలర్లు, స్టెల్లార్ 0.24800 డాలర్లు, లైట్ కాయిన్ 149.28643 డాలర్లు, డీఏఎస్హెచ్ 136.06547 డాలర్లు, షిబా ఇను 0.000029 డాలర్లు, డోజీకాయిన్ 0.168 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఉదయం సెషన్లో బిట్ కాయిన్, ఎథేరియం కూడా లాభపడ్డాయి. అయితే ఆ తర్వాత బిట్ కాయిన్ నష్టపోయింది. కార్డానో అయితే ఏకంగా 12 శాతం ఎగిసిపడింది.
ఫెడ్ రిజర్వ్ 2022లో వడ్డీ రేట్లు పెంచితే పసిడితో పాటు క్రిప్టో కరెన్సీ పైన ప్రభావం పడుతుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే బంగారానికి ప్రత్యామ్నాయంగా క్రిప్టో దిగ్గజం బిట్ కాయిన్ను భావిస్తున్నారు. వచ్చే ఏడాది చివరి నాటికి 100000 డాలర్లకు చేరుకోవచ్చునని భావిస్తున్నారు. అయితే వడ్డీ రేట్లు క్రమంగా పెరిగితే ఈ ప్రభావం మాత్రం బిట్ కాయిన్ సహా క్రిప్టోపై ఉంటుంది.