మారుతున్న Nykaa, Paytm షేర్ హోల్డర్ల తలరాత.. మీరూ షేర్స్ కొన్నట్లయితే..
Nykaa-Paytm : ప్రస్తుతం దేశంలోని మార్కెట్ పరిస్థితులు, ద్రవ్యోల్బణం కారణంగా చాలా స్టార్టప్ కంపెనీలు తమ ఐపీవో ప్రణాళికలను వాయిదా వేసుకున్నాయి. సరైన ఫండింగ్ లేక ఉన్న వాటిలో ఉద్యోగుల తొలగింపుల సంక్షోభం మెుదలైంది. ఈ క్రమంలో గత సంవత్సరం మార్కెట్లోకి వచ్చిన నైకా, పేటీఎం షేర్ల విషయంలో పెద్ద మార్పు జరిగింది. ఇది ఇన్వెస్టర్లను తీవ్రంగా ప్రభావితం చేయనుంది.
నైకా షేర్లు..
బ్యూటీ రంగంలోని కాస్మెటిక్స్ ఫ్యాషన్ రీటైలర్ నైకా షేర్లను దిగ్గజాలు బ్లాక్ డీల్ ద్వారా విక్రయించాయి. ఈ క్రమంలో సిటీ గ్రూప్ గురువారం నైకాకు చెందిన 5.4 కోట్ల షేర్లను విక్రయించింది. వీటిని టీపీజీ గ్రూప్ తరఫున బ్యాంక్ విక్రయించింది. ఈ షేర్ల విలువ దాదాపూ రూ.1,000 కోట్లు. ఈ మెగా డీల్ తర్వాత కంపెనీ షేర్లు ఏకంగా 4 శాతం లాభపడి.. ఒక్కో షేరు రూ.192.75 ధరకు పెరిగింది. దీంతో షేర్ హోల్డర్లు ఆనందంలో ఉన్నారు.
లాక్ ఇన్ పిరియడ్..
ఈ నెల 9న స్టాక్ లాక్ ఇన్ పిరియడ్ ముగియటంతో చాలా మంది ఇన్వెస్టర్లు తమ షేర్లను కంపెనీలో విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో Narotam S Sekhsari, Mala Gaonkar వంటి ప్రముఖ ఇన్వెస్టర్లతో పాటు మరిన్ని ఫండ్ హౌసెస్ నైకాలో తమ వాటాలను క్రమంగా విక్రయిస్తున్నాయి. ఈ క్రమంలో ఈ నెల 11న టీపీజీ గ్రోత్ దాదాపు కోటి షేర్లను మెుదటి దశలో విక్రయించింది. వీటి ఒక్కో షేర్ ధర రూ.186.4 చొప్పున అప్పట్లో విక్రయం జరిగింది. కానీ షేర్ల విక్రయం తర్వాత కూడా పెట్టుబడిదారులకు మంచి లాభాలను స్టాక్ తెచ్చిపెడుతోంది.
పేటీఎం షేర్..
గత ఏడాది నవంబర్లో మార్కెట్లో Paytm లిస్ట్ అయింది. అప్పట్లో ఇన్వెస్ట్ చేసిన ప్రీ-ఆఫర్ ఇన్వెస్టర్లకు లాక్-ఇన్ పీరియడ్ ఈ నెల ప్రారంభంలో ముగిసింది. ఈ క్రమంలో సాఫ్ట్బ్యాంక్ తన 4.5% వాటాను దాదాపు రూ.1,631 కోట్లకు విక్రయిస్తోంది. ఒక్కో షేరును సగటున రూ.555.67కు విక్రయించినట్లు సమాచారం. కంపెనీలో మెుత్తం 17.45 శాతం వాటాతో సాఫ్ట్ బ్యాంక్ రెండవ అతిపెద్ద షేర్ హోల్డర్ గా పేటీఎం కంపెనీలో ఉంది. ఇదే సమయంలో ఓపెన్ మార్కెట్ ఆఫర్ ద్వారా అంతర్జాతీయ పెట్టుబడి సంస్థలు పేటీఎంలో వాటాలను కొనుగోలు చేయటం విశేషం.