నిన్న బంగారంపై పెరిగిన టారిఫ్, రేపు..: మోడీ టార్గెట్ అదేనా?
నరేంద్ర మోడీ ప్రభుత్వం కొంతకాలంగా దిగుమతులను తగ్గించడమే లక్ష్యంగా పని చేస్తోంది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే బడ్జెట్లో చైనా నుంచి దిగుమతి అయ్యే 56 మిలియన్ డాలర్ల వస్తువులకు చెక్ పెట్టే ఆలోచన చేస్తోంది. ఇందులో మొబైల్ ఛార్జర్లు, రసాయనాలు, క్యాండిల్స్, వుడ్ ఫర్నీచర్, నగరు, చేతి తయారీ వస్తువులు వంటివి ఉన్నట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
బడ్జెట్లో భారీ షాక్: 50 వస్తువులపై అదనపు భారం, ఎందుకంటే
దిగుమతి సుంకాలు పెంచడమే లక్ష్యంగా..
ప్రభుత్వం వీటిపై దిగుమతి సుంకం పెంచితే మొబైల్ ఛార్జర్లపై, దిగుమతి చేసుకుంటోన్న ఫోన్ల తయారీదార్లపై ప్రభావం పడుతుంది. వీటిపై 5 శాతం నుంచి 10 శాతం మేర దిగుమతి సుంకం విధించాలని కేంద్రం భావిస్తోంది. ఇప్పటికే ఈ మేరకు ఓ ప్యానల్ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. అనవసరమైన వస్తువుల దిగుమతి తగ్గించడమే లక్ష్యంగా కనిపిస్తోంది.
దిగుమతుల కట్టడి వ్యూహం
ఇవన్నీ కూడా చైనా, ఆగ్నేయాసియా, ఇతర దేశాల నుంచి దిగుమతి అవుతున్నాయి. మోడీ ప్రభుత్వం మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మొదలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. రక్షణ రంగంతో సహా వివిధ రంగాల్లోకి పెట్టుబడులు అనుమతిస్తూనే వివిధ రకాల దిగుమతులను కట్టడి చేస్తోంది.
బంగారం, ఆటోమొబైల్స్ పై ఇంపోర్ట్ డ్యూటీ పెంచింది
ఇప్పుడు కూడా దాదాపు 130రకాల వస్తువులను కట్టడి చేయాలని భావించింది. చివరికి వాటిని 50కి కుదించింది. గత ఏడాది మోడీ ప్రభుత్వం బంగారం, ఆటోమొబైల్ ఉత్పత్తులతో సహా దాదాపు 75 రకాల వస్తువులపై ఇంపోర్ట్ డ్యూటీ పెంచింది. ఇప్పుడు దిగుమతుల నాణ్యతను బట్టి కూడా సుంకాలు తగ్గించే అవకాశముంది. భారత భద్రత, ఆరోగ్య, వాతావరణ ప్రమాణాలను బట్టి వీటిని నిర్ణయిస్తారు.
దిగుమతులు తగ్గుతున్నాయా?
గత కొన్నేళ్లుగా పెరుగుతూ వస్తోన్న దిగుమతులు గత ఏడాది 8.90 శాతం మేర తగ్గాయి. అదే సమయంలో ఎగుమతులు కూడా 2 శాతం పతనమయ్యాయి. దీంతో వాణిజ్య లోటు 118 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇది అంతకుముందు ఏడాది 18 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇతర ప్రాంతాల నుంచి దిగుమతులను కట్టడి చేస్తే ఆ మిగిలే లోటును అమెరికాతో వాణిజ్యంతో భర్తీ చేసుకోవచ్చు. ఇప్పటికే భారత్ మరో ఆరు బిలియన్ డాలర్ల వరకు అదనంగా అమెరికా నుంచి ఎగుమతులు పెంచుకోవాల్సిన పరిస్థితి.