ప్రభుత్వరంగ బ్యాంకులు అదుర్స్, రూ.లక్ష కోట్లకు పైగా లాభాలు
కరోనా వైరస్ కారణంగా గత ఏడాదికి పైగా ప్రపంచ దేశాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉద్యోగులు, వ్యాపారులు సహా అంతా నష్టపోయారు. ఎన్నో కంపెనీలు మూతబడ్డాయి. కరోనా సమయంలో ఎన్నో రంగాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ బ్యాంకులు మాత్రం అదిరిపోయే లాభాలు ఆర్జించాయి. కరోనా సమయంలో అంటే 2020-21 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకులు లక్ష కోట్ల రూపాయలకు పైగా లాభాలను ఆర్జించాయి. FY19 సంవత్సరంలో రూ.5వేల కోట్ల మేర నష్టపోయాయి.
బ్యాంకుల లాభాలు ఇలా
గత ఆర్థిక సంవత్సరంలో దేశంలోని బ్యాంకులు రూ.1,02,252 కోట్ల లాభాలను ఆర్జించాయి. ఈ మొత్తంలో 50 శాతం HDFC, SBI వాటా ఉంది. HDFC బ్యాంకు లాభాలు రూ.31,116 కోట్లు కాగా, అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ఇది 18 శాతం అధికం. SBI లాభాలు రూ.20,410 కోట్లుగా ఉంది. ఐసీఐసీఐ బ్యాంకు రూ.16,192 కోట్ల లాభాలతో మూడో స్థానంలో ఉంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఐసీఐసీఐ బ్యాంకు లాభాలు రెట్టింపు నమోదయ్యాయి.
ప్రభుత్వరంగ బ్యాంకులు అదుర్స్
రుణ వితరణలో ప్రభుత్వరంగ బ్యాంకులు నెమ్మదించడంతో గతంలో ప్రయివేటు బ్యాంకులు మార్కెట్ వాటాను మరింత పెంచుకున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో మాత్రం ప్రభుత్వరంగ బ్యాంకులు వృద్ధి సాధించాయి. గత అయిదు ఆర్థిక సంవత్సరాల్లో తొలిసారిగా ప్రభుత్వ బ్యాంకింగ్ రంగం లాభాలను నమోదు చేసింది. దేశంలోని డజను ప్రభుత్వరంగ బ్యాంకుల్లో పది లాభాలు ఆర్జించగా, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నష్టాలను నమోదు చేశాయి.
అందుకే లాభాలు
ప్రభుత్వరంగ బ్యాంకులతో పోలిస్తే ప్రయివేటురంగ బ్యాంకులు మంచి లాభాలు నమోదు చేశాయి. అయిదేళ్లలో తొలిసారి పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు సమష్టి నికర లాభాలను ఆర్జంచాయి. ప్రయివేటు రంగ బ్యాంకుల్లో యస్ బ్యాంకు రూ.3,500 కోట్ల వరకు నష్టాలను నమోదు చేసింది. ఇదిలా ఉండగా, కరోనా నేపథ్యంలో రుణాలు తీసుకున్న వారు తమ రుణాలను రీషెడ్యూల్ చేసుకోవడానికి ఆర్బీఐ అనుమతించడంతో బ్యాంకుల బ్యాలెన్స్ షీట్లపై ప్రతిబింబించలేదు. అందుకే లాభాలు కనిపించాయని చెప్పవచ్చు.