Gold loan: భారీగా పెరిగిన బంగారు రుణాల బకాయిలు
జూన్ త్రైమాసికంలో రుణదాతల గోల్డ్ లోన్స్ బకాయిలు పెరిగిపోయాయి. గత త్రైమాసికంలో గోల్డ్ లోన్ బకాయిల ఒత్తిడి కనిపించినట్లు బ్యాంకులకు ప్రారంభ హెచ్చరికలు వచ్చాయి. కరోనా సెకండ్ వేవ్ వల్ల వ్యక్తులు/కుటుంబాల ఆర్థిక పరిస్థితిపై ప్రభావం పడింది. ఈ ప్రభావం గోల్డ్ లోన్స్ బకాయిలపై పడింది. ఐసీఐసీఐ బ్యాంకు, ఫెడరల్ బ్యాంకు, కాథలిక్ సిరియన్ బ్యాంకుల్లో ఈ బంగారు రుణ బకాయిలు తడిసి మోపెడంత అయ్యాయి. రుణాలు తీసుకున్న వారు బంగారాన్ని విడిపించుకోలేకపోతున్నారు. కొన్ని బ్యాంకులు బంగారాన్ని విడిపించుకోవడానికి ఎక్కువ సమయం కూడా ఇచ్చాయి.
ఐసీఐసీఐ బ్యాంకు...
ఐసీఐసీఐ బ్యాంకు బంగారం బకాయిలు అంచనాలకు మించి రూ.7200 కోట్లుగా నమోదయ్యాయి. ఇందులో రూ.1100 కోట్లు బంగారు రుణాలు కావడం గమనార్హం. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఈ బ్యాంకు తమ ఖాతాదారుల చెల్లింపులకు మరింత సమయం ఇచ్చింది. బంగారు రుణాలు క్రమంగా తిరిగి వస్తున్నాయని, అయితే ఏప్రిల్- మే నెలల్లో రికవరీ పడిపోయిందని, జూన్ నెల కాస్త బెట్టర్గా ఉందని, జూలై నెల మరింత బాగుంటుందని ఆశిస్తున్నట్లు ఐసీఐసీఐ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సందీప్ బాత్రా అన్నారు.
ఫెడరల్ బ్యాంకు నిరర్థక ఆస్తులు
ఫెడరల్ బ్యాంకు నిరర్థక ఆస్తులు జూన్ త్రైమాసికంలో రూ.640 కోట్లకు పెరిగాయి. అంతకుముందు త్రైమాసికంలో ఇది రూ.598 కోట్లు. ఇందులో రూ.35 కోట్లు బంగారు రుణ బకాయిలు ఉన్నాయి. బ్యాంకు రూ.200 కోట్ల బంగారు రుణాల రీస్ట్రక్చర్ చేసింది.
కేరళకు చెందిన సీఎస్బీ బ్యాంకు బంగారు రుణాల ఎన్పీఏలు జూన్ త్రైమాసికంలో రూ.435 కోట్లుగా ఉన్నాయి. అంతకుముందు త్రైమాసికంలో ఇది రూ.337 కోట్లుగా ఉన్నాయి. ఈ బ్యాంక్ బంగారు రుణాల బకాయిల కోసం ప్రత్యేక రికవరీ బృందాన్ని కూడా ఏర్పాటు చేసింది. 2021 మొదటి అర్ధబాగంలో బంగారు రుణ విభాగం నుండి మొండి బకాయిదారులను ఒత్తిడి పెంచడానికి బంగారం వేలం కూడా జరిగింది.
బంగారం ధర పెరగడం..
బ్యాంకుల బంగారు రుణ విభాగంలో మరో రెండు త్రైమాసికాల వరకు ఒత్తిడి ఉం
టుందని, గత ఏడాది ఇచ్చిన రుణాల్లో ఎక్కువ భాగం మెచ్యూరిటి కోసం వస్తుందని చెబుతున్నారు. బంగారం ధరలు పెరగడంతో బ్యాంకర్లు ధీమాగా ఉన్నప్పటికీ రుణ చెల్లింపులు వేగం పెరగాలని ఆశిస్తున్నారు. ప్రజలు తమ స్వల్పకాలిక అవసరాలకు లేదా వ్యాపార కార్యకలాపాల కొనసాగింపు కోసం ఈ రుణాలు తీసుకున్నారు.