చైనా ఎఫెక్ట్, ఆసియా మార్కెట్ ఒకే: అమెరికా సహా అక్కడ పతనం, 5 నెలల కనిష్టానికి చమురు ధర
ఆసియా మార్కెట్లు లాభాల్లో ఉన్నాయ. చైనా ఆర్థిక వ్యవస్థ రికవరీ పుంజుకుంటున్న సంకేతాలు మరింతగా కనిపించడంతో మెజార్టీ ఆసియా మార్కెట్లు లాభాల్లో ఉన్నాయి. భారత మార్కెట్లు దాదాపు స్థిరంగా (అతిస్వల్ప నష్టాలు) ఉన్నాయి. జపాన్ నిక్కీ 1.4 శాతం, సౌత్ కొరియా కోస్పి 1 శాతం, ఆస్ట్రేలియా S&P/ASX 200 0.2 శాతం, హాంగ్కాంగ్ హాంగ్షెంగ్ 0.9 శాతం, సింగపూర్ స్టాక్స్ కూడా లాభాల్లో ఉన్నాయి. షాంఘై కాంపోజిట్ మాత్రం అతి స్వల్పంగా 0.1 శాతం నష్టపోయింద. తైవాన్, ఇండోనేషియా నష్టాల్లో ఉన్నాయి.
ఎన్నికలకు ముందు అమెరికా స్టాక్స్ నష్టాల్లో
అధ్యక్ష ఎన్నికలకు ముందు అమెరికా స్టాక్స్ మాత్రం నష్టాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 40 పాయింట్లు, నాస్డాక్ 274 పాయింట్లు, డౌజోన్స్ 157 పాయింట్లు పాయింట్లు నష్టాల్లో ముగిసింది. దిగ్గజ కంపెనీలు ఫేస్బుక్, ఆపిల్, అమెజాన్ స్టాక్స్ స్టాక్స్ దాదాపు ఆరు శాతం మేర నష్టపోయాయి. నెట్ ఫ్లిక్స్, టెస్లా స్టాక్స్ 5 శాతానికి పైగా నష్టపోయాయి. ట్విట్టర్ స్టాక్ అయితే ఏకంగా 21 శాతానికి పైగా నష్టపోయింది.
క్షీణిస్తున్న చమురు ధరలు
అంతర్జాతీయ మార్కెట్లు నష్టాల్లో ఉండటంతో పాటు చమురు ధరలు కూడా క్షీణిస్తున్నాయి. బ్రెంట్, నైమెక్స్ క్రూడ్ ధర 5 నెలల కనిష్టానికి పడిపోయింది. మూడు రోజుల్లో 13 శాతం వరకు పతనమైంది. న్యూయార్క్ మార్కెట్ నైమెక్స్లో చమురు ధర బ్యారెల్ 35 డాలర్లకు దిగువన ట్రేడ్ అయింది. లండన్ మార్కెట్లో బ్రెంట్ బ్యారెల్ ధర 37డాలర్లకు దిగువన పలికింది. ఐదు నెలల కనిష్టానికి చేరుకుంది.
అందుకే మార్కెట్, చమురు ధరలు డౌన్
అంతర్జాతీయ మార్కెట్లతో పాటు చమురు ధరలు పడిపోవడానికి ప్రధాన కారణంగా వివిధ దేశాల్లో కరోనా కేసులు పెరుగుతుండటం. కరోనా కేసులు పెరగడంతో ఇప్పటికే పలు దేశాలు మరోసారి లాక్ డౌన్ ప్రకటించాయి. మరిన్ని దేశాలు అదే దారిలో నడుస్తున్నాయి. ఇంగ్లాండ్ స్టే-ఎట్ హోం ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు అమెరికా ఎన్నికలు సమీపించాయి. ఇలా వివిధ కారణాలతో అమెరికా మార్కెట్లతో పాటు అంతర్జాతీయ మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి. అలాగే లాక్ డౌన్ నేపథ్యంలో డిమాండ్ పడిపోతుందనే ఆందోళన నేపథ్యంలో చమురు ధరలు క్షీణించాయి.