రూ.1.70 లక్షల కోట్ల తర్వాత.. కేంద్రం నుండి మరో ప్యాకేజీ, ఈసారి ఎందుకంటే?
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా నిన్న (ఏప్రిల్ 5) ఒక్కరోజే మూడున్నర వేలమంది ఈ వైరస్ వల్ల మృత్యువాత పడ్డారు. అమెరికాలో అత్యధికంగా నేడు 874 మంది, స్పెయిన్లో 471, ఇటలీలో 525 మంది, యూకేలో 621 మంది చనిపోయారు. సోమవారం నాటికి ప్రపంచవ్యాప్తంగా 12,73,709 కేసులు నమోదు కాగా, 69,456 మంది మృత్యువాత పడ్డారు. మన దేశంలోను కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. తబ్లిగీ కారణంగా దేశంలో వారం రోజులుగా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. కరోనా వ్యాప్తి నిరోధానికి కేంద్రప్రభుత్వం మూడు వారాల లాక్ డౌన్కు పిలుపునిచ్చింది. మరో ఎనిమిది రోజులు మిగిలి ఉంది.
80% వేతనం ఇచ్చి 28,000 మంది ఉద్యోగులు తాత్కాలిక తొలగింపు
మరో ప్యాకేజీపై కసరత్తు?
లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజా జీవనం స్తంభించిపోతుంది. ఉత్పత్తులు, పనులు నిలిచిపోతాయి. దీంతో రూ.1.70 లక్షల కోట్ల ప్యాకేజీని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఉచిత బియ్యం లేదా గోదుమలు, పప్పు, ఉచిత గ్యాస్ సిలిండర్, జన్ ధన్ అకౌంట్లో రూ.500 క్రెడిట్.. మూడు నెలల పాటు ఉంటుందని ప్రకటించారు. తద్వారా ప్రజలకు భారీ ఊరట కల్పించారు. అదే సమయంలో ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కూడా మరో ప్యాకేజీని ప్రకటించే అంశంపై చర్చ సాగుతోందని తెలుస్తోంది.
వినియోగాన్ని పెంచేందుకు..
లాక్ డౌన్ ప్రభావాన్ని సాధ్యమైనంత మేరకు తగ్గించి, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఓ ప్యాకేజీని ప్రకటిస్తే ఎలా ఉంటుందని కేంద్రం పరిశీలిస్తోందట. దీనిపై ఓ నిర్ణయానికి మాత్రం రాలేదని వార్తలు వస్తున్నాయి. వినియోగాన్ని పెంచేందుకు అవసరమైన చర్యలను ప్యాకేజీలో చేర్చేందుకు చర్చలు జరుగుతున్నాయట. అయితే ప్రకటిస్తారా.. ఎంత ప్రకటిస్తారు, ఏ తేదీన ప్రకటిస్తారనే అంశాలు తెలియాల్సి ఉంది.
లాక్ డౌన్ తర్వాత...
లాక్ డౌన్ అనంతరం పరిస్థితులు దారుణంగా ఉంటాయనే వాదనలు ఉన్నాయి. ఆ తర్వాత మరికొంత కాలం సామాజిక దూరం, ప్రజలు ఎక్కువగా బయటకు రాకపోవడం వంటి వివిధ కారణాలతో వినియోగం తగ్గే అవకాశముంది. దీనిని పెంచేందుకు ఏం చేయాలనే అంశంపై చర్చలు జరుగుతున్నాయట.
కొన్ని పథకాల్లో మార్పులు..
లాక్ డౌన్ అనంతర పరిణామాలకు తగినట్లుగా కొన్ని పథకాల్లో మార్పులు తీసుకురావడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. అలాగే, రాష్ట్రాల మధ్య ఒక్కో రాష్ట్రం లోపల నిత్యావసర వస్తువుల రవాణా సజావుగా సాగేందుకు ట్రక్ డ్రైవర్లు, కార్మికులకు కావాల్సిన ఏర్పాట్లు చేయాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది.