రూ.76 కోట్లు... కాదు కాదు!: రూ.16,000 కోట్లపై పట్టు, కేసీఆర్తో జగన్కు అక్కడ చెడిందా?
హైదరాబాద్/అమరావతి: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి మధ్య ఇటీవలి వరకు సంబంధాలు బాగానే ఉన్నాయని, కానీ కొద్ది రోజులుగా చెడుతున్నాయనే ప్రచారం రాజకీయ వర్గాల్లో సాగుతోంది. కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వవద్దని ఇటీవల ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది. ఇది సంచలనంగా మారింది. ఎన్నికలకు ముందు నాటి చంద్రబాబు ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం మధ్య విభేదాలు కనిపించాయి. జగన్-కేసీఆర్లు దోస్తీ అని అందరూ భావించారు. కానీ ఇప్పుడు వీరి మధ్య కూడా మనస్పర్థలు ఉన్నాయని అంటున్నారు. ఐతే ఇవి తమతమ రాష్ట్ర ప్రయోజనాలకోసం ప్రభుత్వపరమైన విబేధాలే తప్ప మరేదీ కాదని కూడా అంటున్నారు. ఏదేమైనా కేసీఆర్ - జగన్ మధ్య దూరానికి మరో కారణం కూడా ఉందంటున్నారు. అదే ఆర్టీసీ ఆస్తులు.
కాలేజీ విద్యార్థులకు రూ.20వేలు! స్కూల్స్ కోసం మూడేళ్లలో రూ.12,000 కోట్లు
ఆర్టీసీ ఆస్తులు...
ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల మధ్య విభేదాలకు వివిధ అంశాలతో పాటు ఆర్టీసీ ఆస్తులు కీలకమని అంటున్నారు. రాష్ట్ర విభజనకు ముందు ఆర్టీసీ ఆస్తులు ఎక్కువ మొత్తంలో హైదరాబాదులోనే ఉన్నాయి. ఇవి భవనాలు, ఖాళీ స్థలాలు వంటి వివిధ రూపాల్లో ఉన్నాయి. రాష్ట్ర విభజన తర్వాత ఏపీఎస్ఆర్టీసీ ఆస్తుల విభజన జరగలేదు. ఈ నేపథ్యంలో టీఎస్ఆర్టీసీకి గుర్తింపు లేదని ఇటీవల కేంద్రం చెప్పింది. ఇరు రాష్ట్రాలు అవగాహనతో ఆర్టీసీని నడిపిస్తున్నాయి.
హైదరాబాద్లో పెద్ద మొత్తంలో ఆస్తులు
ఆంధ్రప్రదేశ్లోని బస్సు డిపోలు ఏపీఎస్ఆర్టీసీ, తెలంగాణలోని బస్సు డిపోలు టీఎస్ఆర్టీసీ నడిపిస్తున్నాయి. ఆర్టీసీ ఆస్తుల విభజన పూర్తి కాకపోవడంతో టీఆస్ఆర్టీసీకి మాత్రం గుర్తింపు లేదు. సాంకేతికంగా ప్రత్యేక టీఎస్ఆర్టీసీకి గుర్తింపు లేదు. విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇది ప్రధాన అడ్డంకిగా మారిందని కూడా అధికారులు చెబుతున్నారు. హైదరాబాదులో, హైదరాబాద్ చుట్టుపక్కల ఆర్టీసీకి పెద్ద మొత్తంలో ఆస్తులు ఉన్నాయి.
58:42 శాతానికి ఏపీ డిమాండ్
విభజన చట్టం ప్రకారం రెండు రాష్ట్రాలలోని ఆస్తుల విభజన 58:42 ప్రకారం జరగాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. అయితే తెలంగాణ ప్రభుత్వం దీనిని వ్యతిరేకిస్తోంది. ఏపీఎస్ఆర్టీసీకి రూ.16,000 కోట్ల ఆస్తులు రావాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెబుతోంది.
దానిని మాత్రమే ఇచ్చేందుకు తెలంగాణ..
హైదరాబాదులో ఆర్టీసీకి 11 విలువైన ఆస్తులు ఉన్నాయి. ఇవి భవనాల రూపంలో లేదా స్థలాల రూపంలో ఉన్నాయి. ఆర్టీసీ మెయిన్ హెడ్ క్వార్టర్ హైదరాబాదులోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఉంది. ఏపీ అధికారులు రఫ్గా వేసిన అంచనా ప్రకారమే ఆర్టీసీ ఆస్తులు రూ.35,000 కోట్లు. ఇందులో తమకు రూ.16,000 కోట్లు రావాలని చెబుతోంది. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని బస్ భవన్లోని షేర్ను మాత్రమే ఆఫర్ చేస్తోంది. దీనిని నిర్మించినప్పుడు వ్యాల్యూ రూ.76 కోట్లు. మిగతా ఆస్తులను ఇచ్చేందుకు సిద్ధంగా లేదు.