ఊరట: భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు, ఈ కారణాలతో దూకుడు సరే.. అస్థిరత కొట్టిపారేయలేం?
స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. ప్రపవంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో కరోనా కేసులు, మరణాలు తగ్గడం లేదా స్థిరంగా ఉండటంతో ప్రపంచ మార్కెట్లు సోమవారం కాస్త పుంజుకున్నాయి. ఈ ప్రభావం మన దేశం పైన కనిపించింది. దీంతో మార్కెట్లు ఉదయం గం.9.19 సమయానికి సెన్సెక్స్ 1,224.05 పాయింట్లు (4.44%) లాభపడి 28,815.00 వద్ద, నిఫ్టీ 338.90 పాయింట్లు (4.19%) లాభపడి 8,422.70 వద్ద ప్రారంభమైంది. 766 షేర్లు లాభాల్లో, 93 షేర్లు నష్టాల్లో ఉండగా, 35 షేర్లలో మార్పు లేదు.
గోద్రోజ్ ప్రాపర్టీస్ షేర్లు ఉదయం 10 శాతం జంప్ అయ్యాయి. వరుసగా నాలుగో క్వార్టర్లోను 100 శాతం వృద్ధి రేటు నమోదు చేసింది. దీంతో షేర్ల దూకుడు పెరిగింది. దాదాపు అన్ని రంగాల షేర్లు కూడా లాభాల్లోనే ట్రేడ్ అయ్యాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు దాదాపు 3 శాతం పెరిగాయి.
లాభాల్లోకి ప్రపంచ మార్కెట్లు, కారణాలివే.. భారత్పై ప్రభావం
లాభాలే.. కానీ అస్థిరత కొట్టిపారేయలేం
అంతర్జాతీయ, ఆసియా, భారత మార్కెట్లు లాభాల్లో ఉండటం శుభవార్తే అయినప్పటికీ కరోనా మహమ్మారి వ్యాప్తిపై ఇది ఆధారపడి ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఈ వైరస్ ప్రభావాన్ని పెట్టుబడిదారులు అంచనా వేస్తున్నారని, కాబట్టి దాని ఆధారంగా అస్థిరతను తోసిపుచ్చలేమని చెబుతున్నారు. దేశంలో 21 రోజుల లాక్ డౌన్ 14 రోజులకు చేరుకుంది.
ప్యాకేజీల వైపు మొగ్గు..
ఫ్రాన్స్, ఇటలీ సహా యూరోపియన్ దేశాలలో వైరస్ మరణాల సంఖ్య తగ్గుముఖం పట్టడం మార్కెట్ల లాభాలకు ప్రధాన కారణం. అలాగే, భారత్ 1.70 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ, అమెరికా, జపాన్ తదితర దేశాలు ప్యాకేజీ వైపు మొగ్గు చూపడం కూడా పెట్టుబడిదారులకు కాస్త ఊరట కలిగించే అంశం. ఆర్థిక ఉత్పత్తిలో 20 శాతానికి సమానమైన ఉద్దీపనలు ప్రకటిస్తామని జపాన్ ప్రధాని షింజో అబే ప్రకటించారు.
అంతర్జాతీయ మార్కెట్ దూకుడు కూడా కారణం
వివిధ దేశాలు లాక్ డౌన్ ప్రకటించడం వంటి వివిధ కారణాలతో కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుతుందని ఐరోపా దేశాల నుండి వచ్చిన సానుకూల వార్తలు అంతర్జాతీయ మార్కెట్లకు ఊరటనిచ్చాయి. రెండు వారాలుగా మరణాలు తగ్గాయని ఇటలీ, వరుసగా మూడో రోజు మరణాల సంఖ్య తగ్గిందని స్పెయిన్ వెల్లడించింది. వారం రోజులుగా తక్కువ మరణాలు సంభవించాయని ఫ్రాన్స్ ప్రకటించింది. ప్రపంచంలోనే అతి ఎక్కువ కేసులు నమోదయింది అమెరికాలో. ఇక్కడ ఇటీవలి కాలంలో మరణాలు భారీగా పెరిగాయి. అయితే కేసులు సంఖ్యలో స్థిరీకరణ లేదా తగ్గుదల సంకేతాలు వచ్చాయి. ఇన్నాళ్లు లాక్ డౌన్ ఉన్న నేపథ్యంలో దీనిని ఎత్తివేయాలని వివిధ దేశాలు భావిస్తున్నాయి. ఇవన్నీ మార్కెట్లకు సానుకూల సంకేతాలు పంపించాయి.