గూగుల్ బాటలోనే.. ఉద్యోగుల ఆరోగ్యం కోసం అమెజాన్ కీలక నిర్ణయం
కరోనా మహమ్మారి నేపథ్యంలో వివిధ కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చాయి. గూగుల్ వంటి కంపెనీలు ఇంటి నుండి పని చేసే విధానాన్ని ఏడాది వరకు పొడిగించాయి. తాజాగా ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ కూడా తన ఉద్యోగులకు గుడ్న్యూస్ చెప్పింది! ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాప్తి ఇంకా అదుపులోకి రాలేదు. దీంతో ఉద్యోగులకు కంపెనీ వెసులుబాటు కల్పించింది. ప్రపంచవ్యాప్తంగా ఐటీ కంపెనీలు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ పొడిగిస్తూ వస్తున్నాయి.
ప్రపంచ దేశాల్లో అదుర్స్, అందుకే వేగంగా పుంజుకుంటోన్న చైనా
అందుకే ఈ నిర్ణయం
అమెరికా వ్యాప్తంగా కరోనా కేసులు తిరిగి పెరుగుతున్నాయి. ఇది కలకలం రేపుతోంది. దీంతో ఉద్యోగుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెజాన్ తెలిపింది. వర్క్ ఫ్రమ్ హోంకు అవకాశం ఉన్నవారు జూన్ 30, 2021 వరకు దీనిని వినియోగించుకోవాలని అమెజాన్ తన ప్రకటనలో తెలిపింది. ప్రభుత్వం మార్గదర్శకాలను పాటిస్తామని, ఉద్యోగుల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. అమెరికాలో అమెజాన్ కంపెనీకి చెందిన 19,000 మంది ఉద్యోగులకు కరోనా సోకింది. దీంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అంతకుముందు 2021 ప్రారంభం వరకు ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారని తెలిపింది.
ఆఫీస్కు వస్తే అన్ని జాగ్రత్తలు
గూగుల్ మాతృసంస్థ అల్ఫాబెట్ చాలా రోజుల క్రితమే తమ ఉద్యోగులకు జూలై 2021 వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రకటించింది. సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్, ట్విట్టర్, స్క్వేర్ వంటి టెక్నాలజీ సంస్థలు కూడా ఉద్యోగులకు చాలా కాలం వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చాయి. కొన్ని కంపెనీలుశాశ్వతంగా వర్క్ ఫ్రమ్ హోమ్ వెసులుబాటుకు అవకాశమిచ్చాయి.
కార్యాలయానికి వచ్చే ఉద్యోగుల కోసం కూడా అమెజాన్ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటోంది. కార్యాలయానికి వచ్చే ఉద్యోగులకు సంబంధించి సామాజిక దూరం, ఎప్పటికప్పుడు క్లీనింగ్, టెంపరేచర్ చెక్, హ్యాండ్ శానిటైజర్ అందుబాటులో ఉంచడం చేస్తున్నట్లు అమెజాన్ ప్రతినిధి తెలిపారు. వీటి కోసం ప్రత్యేకంగా నిధులను కేటాయించినట్లు తెలిపారు.
గతంలో విమర్శలు..
అమెజాన్లో ఎక్కువగా బ్లూ కాలర్ వేర్హౌస్ ఉద్యోగులు ఉన్నారు. అయితే కొంతమంది ఉద్యోగులు వేర్ హౌస్ల వద్ద భద్రతా చర్యలపై ఆందోళనలు వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. కరోనా సమయంలో వేర్ హౌస్లు ఓపెన్ చేసి, ఉద్యోగులను ప్రమాదంలోకి నెట్టిందని విమర్శలు వెల్లువెత్తాయి.