అమెజాన్ ఉద్యోగులకు గుడ్న్యూస్, వారికి మాత్రమే వర్క్ ఫ్రమ్హోం, ఆఫీస్లు తెరిచే ఉంటాయ్
కరోనా మహమ్మారి సమయంలో అమెజాన్ ఉద్యోగులకు కంపెనీ గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే ఫేస్బుక్, గూగుల్, ఆపిల్ వంటి దిగ్గజ కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రకటించాయి. కరోనా వ్యాప్తి వేగంగా సాగుతున్న నేపథ్యంలో అమెజాన్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ ఉద్యోగుల సంక్షేమం కోసం వర్క్ ఫ్రమ్ హోమ్ పాలసీని వచ్చే ఏడాది (2021) జనవరి 8వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు తెలిపింది.
గంటలో రూ.50,000 కోట్లు: ఇన్వెస్టర్ల పంట పండింది, రాకెట్లా ఇన్ఫోసిస్ షేర్
వర్క్ ప్రమ్ హోమ్... ఆఫీస్లు తెరిచే ఉంటాయి
ఇంటి నుండి సమర్థవంతంగా పని చేయగలిగే వారికి కాలపరిమితిని విస్తరిస్తున్నామని అమెజాన్ తెలిపింది. అయితే కార్యాలయాలు మాత్రం ఎప్పుడూ తెరిచి ఉంటాయని పేర్కొంది. ఆఫీస్లోకి అనుమతించే ముందు టెంపరేచర్ చెక్ చేస్తున్నట్లు తెలిపింది. ఎప్పటికప్పుడు శానిటైజేషన్ చేస్తూ తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది. ఇంతకుముందు మే నెలలో అమెజాన్ అక్టోబర్ 2వ తేదీ వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చింది. ఇప్పుడు దానిని వచ్చే జనవరి వరకు పొడిగించింది.
ఆఫీస్లో కరోనా జాగ్రత్తల కోసం నిధులు
ఉద్యోగుల భద్రత తమకు తొలి ప్రాధాన్యం ఇస్తున్నామని అమెజాన్ తెలిపింది. అందుకే కార్యాలయంలో సామాజిక దూరం పాటించేలా చేస్తున్నట్లు తెలిపింది. కరోనా అప్రమత్తత కోసం తగు జాగ్రత్తలు ఎప్పటికప్పుడు సూచిస్తున్నామని వెల్లడించింది. టెంపరేచర్ చెక్ చేస్తున్నామని, కార్యాలయానికి వచ్చే వారికి హ్యాండ్ శానిటైజర్లు అందుబాటులో ఉంచినట్లు తెలిపింది. కార్యాలయంలో ఇలాంటి జాగ్రత్తల కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించామని చెప్పింది.
వైట్ కాలర్ ఉద్యోగులకు..
ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ వైట్ కాలర్ వర్క్ ఫోర్స్కు వర్తిస్తుందని అమెజాన్ స్పష్టం చేసింది. వేర్ హోస్ వర్కర్లు, ఇతర హవర్లీ,కాంట్రాక్ట్ వర్కర్లకు వెసులుబాటు లేదని పేర్కొంది. గిడ్డంగుల్లో కరోనా జాగ్రత్తలు తీసుకోలేదనే విమర్శలు వెల్లువెత్తాయి. గత నెలలో కొంతమంది ఉద్యోగులు తమను, తమ కుటుంబాన్ని కరోనా సంక్రమణ కూపంలోకి నెడుతున్నారంటూ లాసూట్ ఫైల్ చేశారు. ఆ తర్వాత అమెజాన్ భద్రతా చర్యలు చేపట్టింది.