కరోనా దెబ్బ: అందరి చూపు ఆర్బీఐ వైపు!
మొత్తం ప్రపంచాన్ని భయపెడుతోన్న కరోనా వైరస్... భారత్ ను కూడా వణికిస్తోంది. రోజు రోజుకూ పెరుగున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా లాక్ డౌన్ ప్రకటించాయి. అది కూడా ఏప్రిల్ 14 వరకు పొడిగించటంతో ఇక అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే ఆర్థిక మందగమనంతో దేశం ఇబ్బంది పడుతున్న సందర్భంలోనే కరోనా రూపంలో మరో పిడుగు పడింది. అన్ని రకాల సంస్థలు మూసివేయటంతో పాటు వర్క్ ఫ్రొం హోమ్ చేయమని అడుగుతున్న సందర్భాలు పెరిగిపోయాయి. తయారీ రంగం మొదలు కొని, సేవల రంగం వరకు అన్ని రంగాలు ప్రస్తుత లాక్ డౌన్ తో తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయి. దీంతో, సమయానికి ఇంటి అద్దెల చెల్లింపులు, బ్యాంకుల్లో తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించటం లేదా ఇతరత్రా చెల్లింపులు కష్టతరం కానున్నాయి. పూర్తి స్థాయిలో కర్ఫ్యూ తరహా వాతావరణం నెలకొనటంతో అత్యవసర సేవలు మినహా ఇంకేమి అందుబాటులో లేకుండా పోతున్నాయి. జనాలు ఇంటికే పరిమితం ఐతే వారి జీవన విధానంపై భారీ ప్రభావం పడుతుంది. సమయానికి ఈఎంఐ లు చెల్లించకపోతే ఇండివిడ్యుల్స్ కు క్రెడిట్ రేటింగ్ తగ్గిపోతుంది. దీంతో భవిష్యత్ లో రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు వెనకడుతాయి. ఇప్పుడిదే అతి పెద్ద సమస్యగా తయారైంది.
ఆర్బీఐ ప్రకటన కోసం ఎదురు చూపులు...
ప్రస్తుత పరిణామాలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ పన్ను చెల్లింపుదారులకు, కంపెనీలకు కొన్ని మినహాయింపులు ప్రకటించారు. ఈ నెల 31 తో ముగియనున్న అన్ని రకాల గడువులను జూన్ 30 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. అలాగే, చిన్న కంపెనీలు అంటే రూ 5 కోట్ల లోపు టర్నోవర్ కలిగిన కంపెనీలు జీఎస్టీ రిటర్న్స్ ఆలస్యంగా ఫైల్ చేసినా కూడా అపరాధ రుసుము చెల్లించనక్కరలేదు. దీంతో చాలా మందికి వెసులుబాటు లభించింది. కానీ, ఇప్పుడు అంతకంటే అధికంగా గృహ రుణాలు, వాహన రుణాలు, వ్యక్తిగత రుణాలు తీసుకున్న కోట్ల మంది వినియోగదారులు తమ తమ ఈఎంఐ ల చెల్లింపుల గడువు పొడిగిస్తే బాగుంటుందని ఆశిస్తున్నారు. ఈ మేరకు ఆర్బీఐ నుండి ఎప్పుడు ప్రకటన వస్తుందా అని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.
నో డిఫాల్ట్....
వరుసగా 3 వాయిదాలు చెల్లించక పొతే సదరు రుణ గ్రహీతను డిఫాల్టర్ గా ప్రకటిస్తారు. దీంతో మొత్తం ఋణం చెల్లించాలని ఒత్తిడి పెంచుతారు. లేదంటే తనఖాలో ఉన్న ఆస్తులను జప్తు చేసుకుని ఆక్షన్ లో విక్రయిస్తామని బెదిరిస్తారు. అందుకే 90 రోజుల్లో ఒక్క ఈఎంఐ కూడా చెల్లించలేని వ్యక్తులకు ప్రస్తుత పరిణామాలు తీవ్ర ఇబ్బందులను కొని తెచ్చేలా ఉన్నాయి. ఇప్పటికే అనేక కారణాలతో ఒకటో రెండో వాయిదాలు చెల్లించని వ్యక్తులకు ప్రస్తుత పరిస్థితుల్లో వాటిని చెల్లించేందుకు అవకాశం ఉండదు. దాంతో వారు డిఫాల్టర్ జాబితాలోకి వెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి, ప్రస్తుతం కేంద్ర ఆర్థిక శాఖ తీసుకున్న నిర్ణయం లాగానే, ఆర్బీఐ కూడా కనీసం 3 నెలల పాటు ఏ రకమైన వాయిదాలు చెల్లించలేక పోయినా... కూడా వారిని డిఫాల్టర్ గా పేర్కొన కూడదని ఆదేశాలు జారీ చేస్తే మంచిదని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
రూ 80 లక్షల కోట్లు...
భారత్ లో మొత్తం 18 ప్రభుత్వ రంగ బ్యాంకులు, 22 ప్రైవేట్ బ్యాంకులు ఉన్నాయి. మరో 46 విదీశీ బ్యాంకులు కూడా ఇక్కడ కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఇవి కాకుండా 1,542 అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంకులు, 94,384 గ్రామీణ బ్యాంకులు పని చేస్తున్నాయి. ఈ అన్ని రకాల బ్యాంకులు కలిసి ఇండియా లో డిసెంబర్ 2019 వరకు సుమారు రూ 80 లక్షల కోట్లకు పైగా రుణాలను మంజూరు చేశాయి. ఇవి వ్యవసాయ రుణాలు మొదలు కొని, గృహ, వాహన, కార్పొరేట్, పర్సనల్ లోన్స్ వంటి రిటైల్ లోన్ల వరకు ఉండటం విశేషం. కొన్ని కోట్ల మంది రుణ గ్రహీతలు ప్రస్తుతం వారి వాయిదాలు సరైన సమయంలో చెల్లించలేని పరిస్థితుల నేపథ్యంలో ఆర్బీఐ వారందరికీ కొంత ఊరట కల్పించాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. లేదంటే దేశంలో నిరర్థక ఆస్తులు పెరిగిపోయి, బ్యాంకింగ్ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోవడం ఖాయమని హెచ్చరిస్తున్నారు.