హాంకాంగ్లో భారీ ఐపీవోకు.. సిద్ధమైన ‘అలీబాబా’!
చైనాకు చెందిన అతిపెద్ద ఈ-కామర్స్ కంపెనీ 'అలీబాబా' హాంకాంగ్ స్టాక్మార్కెట్లో లిస్ట్ అవడానికి సిద్ధమైంది. భారీ ఐపీవో ద్వారా 13 బిలియన్ డాలర్లు (మన డబ్బులో రూ.93,256 కోట్లు) సమీకరించే ప్రణాళికతో సాగుతోంది. ఐపీవోలో భాగంగా 'అలీబాబా' 50 కోట్ల షేర్లను ఆఫర్ చేస్తోంది. ఒక్కో షేరు ధరను 188 హాంకాంగ్ డాలర్లు ( మన డబ్బులో రూ.1,724)గా కంపెనీ నిర్ణయించింది.
ఈ భారీ ఐపీవో ద్వారా 'అలీబాబా' హాంకాంగ్ స్టాక్ మార్కెట్లోనూ సంచలనం సృష్టించనుంది. దశాబ్ద కాలంలో హాంకాంగ్లో వచ్చిన ఐపీవోలలో ఆవి ఒక అతి పెద్ద ఐపీవోగా అవతరించనుంది. గతంలో 2010లో బీమా కంపెనీ ఏఐఏ.. ఇలాగే ఐపీవో ద్వారా 20.5 బిలియన్ డాలర్ల నిధులు సేకరించింది.
నిజానికి ఈ ఏడాది వేసవిలోనే 'అలీబాబా' హాంకాంగ్ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవ్వాలని భావించింది. కానీ ఒకవైపు చైనా-అమెరికా వాణిజ్య యుద్ధం, మరోవైపు చాలాకాలంగా సాగుతోన్న ప్రో డెమొక్రసీ ఆందోళన.. వీటి కారణంగా అలీబాబా హాంకాంగ్ మార్కెట్ ఎంట్రీ కాస్త ఆలస్యమైంది.
'అలీబాబా' 2014లోనే ఐపీవోకు వెళ్లింది. ఈ కంపెనీ షేర్లు ఇప్పటికే న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజీలో ట్రేడ్ అవుతున్నాయి. ఇప్పుడు హాంకాంగ్ స్టాక్ ఎక్స్ఛేంజీలో కూడా లిస్ట్ అయితే 'అలీబాబా'కు ఇది రెండో లిస్టింగ్ అవుతుంది.