ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై దాని సృష్టికర్త షాకింగ్ కామెంట్స్.. 'I,Robot' మూవీ నిజం కానుందా..?
ఇవాళ టెక్ రంగంలో విపరీతంగా వినిపిస్తున్న పదం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI). ChatGPTకి ముందు ఆ తరువాత అనే స్థాయిలో మనిషి జీవితంపై AI ప్రభావం చూపుతోంది అనడంలో సందేహం లేదు. ఈ సాంకేతికత వల్ల పలు ఉపయోగాలు ఉన్నాయని వాదించేవారు కొందరైతే, మానవ మనుగడకు ప్రతిబంధకంగా మారుతుందని ఆందోళన చెందేవారు మరికొందరు.
వాతావరణ మార్పుల కంటే కృత్రిమ మేధస్సు (AI) మానవాళికి గొప్ప ముప్పుగా పరిణమిస్తుందని.. "AI గాడ్ఫాదర్స్"లో ఒకరైన జియోఫ్రీ హింటన్ హెచ్చరించారు. ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈమేరకు వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలను అభివృద్ధి చేయడంలో కీలకమైన పరిశోధనలు చేసి, 2018లో ట్యూరింగ్ అవార్డు పొందిన వ్యక్తే ఈ విధంగా మాట్లాడటం భయాందోళకు కారణమవుతోంది.
మానవుల కంటే అధిక మేధస్సును యంత్రాలే సొంతం చేసుకుని, మొత్తం భూ గ్రహం మీద నియంత్రణ సాధించే వంటి ప్రమాదం AI వల్ల లేకపోలేదని హింటన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఓ అస్తిత్వ ప్రమాదమని వెల్లడించారు. దానికి ప్రతిగా ఏమి చేయగలమో గుర్తించేందుకు కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. AI సాంకేతికత వల్ల అందరూ ప్రభావితం కానుండటంతో, ఈ ప్రక్రియలో రాజకీయ నాయకులను సైతం భాగం చేయాలని అభిప్రాయపడ్డారు.
"వాతావరణ మార్పుల విలువను తగ్గించడం నాకు ఇష్టం లేదు. కానీ AI దానికన్నా చాలా పెద్ద ప్రమాదం" అని హింటన్ తెలిపారు. క్లైమేట్ ఛేంజ్ కోసం కర్బన ఉద్గారాలు తగ్గించాలని సిఫారసు చేయవచ్చు కానీ కృత్రిమ మేధ విషయంలో పూర్తి క్లారిటీ లేదని వెల్లడించారు. వాతావరణ మార్పుల కంటే ఇది అత్యవసరమని భావిస్తున్నట్లు చెప్పారు.
GPT-4 కంటే శక్తివంతమైన సిస్టమ్స్ అభివృద్ధి చేయడానికి 6 నెలల విరామం ప్రకటించాలంటూ ఎలాన్ మస్క్ సహా పలువురు ఇటీవల ఓ బహిరంగ లేఖపై సంతకం చేయడం తెలిసిందే. ఇందుకు మద్ధతుగా సాంకేతికత భవిష్యత్తుపై ప్రపంచ శిఖరాగ్ర సమావేశాన్ని ఏర్పాటు చేయాలని US అధ్యక్షుడు జో బైడెన్ ను యూరోపియన్ యూనియన్ చట్టసభ సభ్యుల కమిటీ కోరింది. అయితే ఇప్పుడు AI గాడ్ ఫాదర్స్ లో ఒకరిగా భావిస్తున్న వ్యక్తి ఆందోళన వ్యక్తం చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.