చైనాకు చెక్: మూసివేత దిశగా చైనా వార్తల ఆప్ యూసీ న్యూస్
ఇండియా లో పెట్టుబడులు కుమ్మరిస్తూ... ఒక్కొక్క రంగంలోనే పాగా వేస్తూ పోయిన చైనా కు ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. స్టార్టుప్ కంపెనీల్లో పెట్టుబడులతో మన మార్కెట్ లో పైచేయి సాధించేందుకు ప్రయత్నించిన డ్రాగన్... స్థానిక వార్తల ప్రచురణ లోకీ అడుగుపెట్టింది. అయితే ప్రింట్ మాధ్యమం కాకుండా... డిజిటల్ రూపంలో కార్యకలాపాలు మొదలు పెట్టింది. సరిగ్గా నాలుగేళ్ళ క్రితం యూ సి న్యూస్ పేరుతొ ఇండియా లో చైనా కు చెందిన అలీబాబా గ్రూప్ అనుబంధ సంస్థ స్థానిక వార్తలను ప్రచురించటం మొదలు పెట్టింది.
చైనా లో తయారైన లేదా ఆ దేశానికి చెందిన మొబైల్ ఫోన్ల లో తప్పనిసరిగా యూ సీ బ్రౌసర్ ఉంటుంది. ఈ యూ సీ బ్రౌసర్ ఆధారంగానే యూ సీ న్యూస్ ను కూడా ప్రారంభించారు. తొలుత ఈ ఆప్ కు పాఠకుల తాకిడి మెరుగ్గానే ఉన్నప్పటికీ... క్రమంగా భారతీయుల నుంచి ఆసక్తి తగ్గిపోయింది. దీంతో యూ సీ న్యూస్ కు ఇక ఇక్కడ ఎలాంటి భవిష్యత్ లేదని తేలిపోవటంతో దాని మాతృ సంస్థ అలీబాబా గ్రూప్ ఇండియా లో దాని కార్యకలాపాలు నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు: రాధాకిషన్ ధమాని ఎఫెక్ట్, 17% ఎగిసిన ఆంధ్రా పేపర్స్
అంతకు ముందే...
ఇండియా లో డేటా చౌర్యానికి పాల్పడుతూ భద్రతకు పెనుముప్పు కలిగిస్తున్నాయని నిన్ననే భారత ప్రభుత్వం చైనా కు చెందిన 59 మొబైల్ ఆప్స్ పై నిషేధం విధించింది. అందులో చైనా అలీబాబా కు చెందిన యూ సీ బ్రౌసర్ కూడా ఉంది. అయితే, యూ సీ న్యూస్ ను ఇండియా లో నిలిపివేయాలని మాత్రం అంతకు ముందే అలీబాబా నిర్ణయం తీసుకోవటం విశేషం. ఎందుకంటే నాలుగేళ్లలో ఈ వార్తా సంస్థకు ఎటువంటి ఆదరణ రాకపోగా... రాను రాను పాఠకుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. ప్రారంభించిన తొలినాళ్లలో యూ సి న్యూస్ కు సుమారు 8 కోట్ల మంది యూజర్లు ఉండేవారు.
ఆ సంఖ్య కొన్ని రోజుల తర్వాత 13 కోట్లకు పెరిగిపోయింది. కానీ, ప్రస్తుతం కేవలం 5 లక్షల మంది యూజర్లు మాత్రమే ఈ ఆప్ లో వార్తలు చదువుతున్నారు. దీంతో ఆర్థికంగా ఎటువంటి ప్రయోజనం లేదని గ్రహించిన యూ సీ న్యూస్ మాతృ సంస్థ అలీబాబా దానిని పూర్తిగా మూసివేయటమే సరైన చర్యగా భావించిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
డైలీ హంట్ దెబ్బ...
ఇండియా లో డిజిటల్ వార్తల్లో డైలీ హంట్ హవా కొనసాగుతోంది. కోట్ల మంది భారతీయులకు తాజాగా వార్తలను తమకు నచ్చిన రీతిలో అందిస్తూ ఎంతో ఆకర్షణీయమైన రీతిలో వృద్ధిని నమోదు చేస్తోంది. అదే సమయంలో యూ సీ న్యూస్ మాత్రం ఎటువంటి వ్యూహం, ప్రత్యేకమైన అభిరుచి లేకుండా ముందుకు సాగిపోయింది. దీంతో ఇండియా లో పుట్టిన ఇండియన్ ప్రొడెక్టు ఐన డైలీ హంట్ నే భారతీయులు అక్కున చేర్చుకున్నారు.
పక్కలో బల్లెం లా ఉండే చైనా దేశానికి చెందిన యూ సీ న్యూస్ ను తిరస్కరించారు. ఈ పరిణామం ఇండియా - చైనా ల మధ్య ఉద్రిక్తతలు మొదలవక ముందే జరగటం విశేషం. ఇండియా కు ఏం కావాలో ఒక ఇండియన్ మాత్రమే తెలుస్తుంది. కాబట్టి, ఆర్థికంగా ఎంత బలంగా ఉన్నప్పటికీ ... చైనా కు చెందిన యూ సీ న్యూస్ కు ఇక్కడ భంగపాటు తప్పలేదు. దాంతో 2019 ద్వితీయార్థం నుంచే క్రమంగా కార్యకలాపాలు తగ్గిస్తూ వచ్చింది.
మూతపడుతున్న మూడో సంస్థ...
చైనా దేశానికి చెందిన చాలా మొబైల్ ఆప్ లు ఇండియా లో కూడా ప్రాచుర్యం పొందాయి. ఉదాహరణకు టిక్ టాక్ ఒక సంచలనమే అయింది. కానీ, అది అన్నిటికి వర్తించలేదు. బైట్ డాన్స్ అనే సంస్థ కు చెందిన షార్ట్ వీడియో షేరింగ్ ఆప్ విగో కూడా ఇండియా ఆపరేషన్స్ నిలిపివేస్తున్నట్లు ప్రకటించగా... మరో మొబైల్ ఆప్ కేవాయి కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకుంది.
ప్రస్తుతం యూ సీ న్యూస్ మూసివేతతో ఇండియా లో ఇటీవల అతి స్వల్ప కాలంలో మూసివేతకు గురి అవుతున్న మూడో సంస్థగా నిలుస్తోంది. తాజాగా ఇండియా తీసుకున్న నిర్ణయంతో ఈ జాబితాలో మరిన్ని ఆప్ లు చేరిపోయే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా... ప్రారంభించిన తొలినాళ్లలో దేశంలో డిజిటల్ న్యూస్ రంగంలో 58% వాటాను సాధించిన యూ సీ న్యూస్ లో సుమారు రూ 200 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు అలీబాబా ప్రకటించటం గమనార్హం. కానీ నాలుగేళ్ళ లోనే పరిస్థితులు తలకిందులయ్యాయి. ఏది ఏమైనా ఇండియా ఇండియానే... చైనా చైనానే!