Adani Wilmar IPO: గౌతమ్ అదాని కీలక నిర్ణయం: రిటైల్ ఇన్వెస్టర్లల్లో..!
ముంబై: గుజరాత్కు చెందిన దేశీయ పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదాని సారథ్యంలోని అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీస్కు చెందిన మరో సంస్థ ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ను జారీ చేయడానికి సమాయాత్తమైంది. అదాని విల్మార్ లిమిటెడ్ త్వరలోనే పబ్లిక్ ఇష్యూకు రాబోతోంది. ఈ కంపెనీ చివరి నిమిషంలో ఐపీఓ ప్రతిపాదనల్లో కీలక మార్పులు చేసింది. ఐపీఓ సైజ్ను భారీగా తగ్గించింది. ఏకంగా 900 కోట్ల రూపాయల మేర సైజును కుదించడం రిటైల్ ఇన్వెస్టర్లల్లో గందరగోళానికి దారి తీయొచ్చనే అనుమానాలు తలెత్తుతున్నాయి.
నిజానికి- అదాని విల్మార్ కంపెనీ.. 4,500 కోట్ల రూపాయలను మార్కెట్ నుంచి మొబిలైజ్ చేయడానికి పబ్లిక్ ఇష్యూను జారీ చేయాలని తొలు నిర్ణయం తీసుకుంది. టాప్ సెల్లింగ్ వంటనూనె బ్రాండ్ ఫార్చూన్ను ఉత్పత్తి చేస్తోంది ఈ కంపెనీయే. అదాని ఎంటర్ప్రైజెస్, ఆసియన్ అగ్రి బిజినెస్ విల్మార్ ఇంటర్నేషనల్తో జాయింట్ వెంచర్గా ఏర్పడిందీ కంపెనీ. 2027 నాటికి దేశంలో లార్జెస్ట్ ఫుడ్ కంపెనీగా ఆవిర్భవించాలనేది అదాని విల్మార్ లక్ష్యంగా నిర్దేశించుకుంది.
పబ్లిక్ ఇష్యూకి వచ్చిన అనంతరం- అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీల నుంచి లిస్టెడ్ అయిన ఏడో కంపెనీగా గుర్తింపు పొందుతుంది. అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీల నుంచి ఇప్పటికే ఆరు సంస్థలు బోంబే స్టాక్ ఎక్స్ఛేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్లల్లో లిస్టింగ్ అయ్యాయి. రేపోమాపో పబ్లిక్ ఇష్యూ తేదీని ప్రకటించే సమయంలో అదానీ విల్మార్ లిమిటెడ్ తన ఐపీఓ సైజును తగ్గించుకోవడం పట్ల మార్కెట్ వర్గాలు ఆశ్చర్యపోతోన్నాయి.
ముందుగా అనుకున్న ప్రకారం.. 4,500 కోట్ల రూపాయలకు బదులుగా 3,600 కోట్ల రూపాయల మేర ఐపీఓను జారీ చేయాలని నిర్ణయించింది. ఈ కంపెనీలో అదానీ గ్రూప్, సింగపూర్కు చెందిన విల్మార్ గ్రూప్ జాయింట్ వెంచర్కు 50 శాతం చొప్పున వాటాలు ఉన్నాయి. 3,600 కోట్ల రూపాయల విలువైన ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. ఐపీఓ ద్వారా సమీకరించిన మొత్తంలో 1,900 కోట్ల రూపాయలను క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం, 1,100 కోట్ల రూపాయలను రుణాల చెల్లింపునకు వినియోగిస్తుంది. మిగిలిన 500 కోట్ల రూపాయలను వ్యూహాత్మక పెట్టుబడులకు వినియోగించాలని తాజాగా తన ప్రణాళికను రూపొందించుకుంది.
1,100 కోట్ల రూపాయల మేర దీర్ఘకాలిక రుణాలను ఏకకాలంలో చెల్లించడం వల్ల వడ్డీల వ్యయం తగ్గుతుందని భావిస్తోంది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం కొత్త రుణాలకు వెళ్లే పరిస్థితి ఉండదని భావిస్తోంది. సొంతంగా ఈక్విటీ ద్వారా నిధులు సమకూర్చుకునే వెసలుబాటు లభించడం వల్ల కంపెనీ లిక్విడిటీ మరింత మెరుగు పడుతుందని అంచనా వేస్తోంది. అదాని ఎంటర్ప్రైజెస్, అదానీ ట్రాన్స్మిషన్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ పవర్, అదానీ టోటల్ గ్యాస్, అదానీ పోర్ట్స్ స్పెషల్ ఎకనామిక్ జోన్ ఉన్నాయి.