అదానీ గ్రూప్ కంపెనీల విస్తరణ.. 2 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్న అబుదాబీ సంస్థ
బిలియనీర్ గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ సంస్థల్లో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు అబుదాబి సంస్థ ముందుకు వచ్చింది . ప్రముఖ అంతర్జాతీయ సంస్థ ఇంటర్నేషనల్ హోల్డింగ్ కంపెనీ తమ సంస్థలో సుమారు 2 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైనట్లు అదానీ గ్రూప్ వెల్లడించింది. ఈ నిధులను కంపెనీ వ్యాపార విస్తరణ, బ్యాలెన్స్ షీట్లను బలోపేతం, జనరల్ కార్పొరేట్ అవసరాలకు ఉపయోగించనున్నట్లు తెలిపింది.
అదానీ ట్రాన్స్ మిషన్ లిమిటెడ్ లో రూ. 3,850 కోట్లు, అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిడెట్ లో 3,850 కోట్లు, అదానీ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ లో రూ.7,700 కోట్లు ఇంటర్నేషనల్ హోల్డింగ్ కంపెనీ పెట్టుబుడులు పెట్టనుంది. వ్యాపార నిబంధనలకు అనుగుణంగా ఒప్పందం కుదుర్చుకున్నట్లు అదానీ గ్రూప్ తెలిపింది. ఈమేరకు ఏటీఎల్, ఏజీఎల్, ఏఈఎల్ బోర్డులు కూడా ఆమోదం తెలిపినట్లు వెల్లడించింది. నెలరోజుల్లో లావాదేవీల ప్రక్రియ పూర్తవుతుందని భావిస్తున్నట్లు చెప్పింది.
అయితే ఆయా సంస్థల్లో పెట్టుబడులు పెడుతున్న ఇంటర్నేషనల్ హోల్డింగ్ కి ఎంత శాతం వాటా వెళ్లనుందో అదానీ వెల్లడించలేదు. అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి రంగంలో పనిచేస్తోంది. యూఏఈ నుంచి భారత్ మరిన్ని పెట్టుబడులు ఆకర్షిస్తోందని ఏజీఈఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాగర్ అదానీ తెలిపారు. ఇరు సంస్థల మధ్య సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయని పేర్కొన్నారు. ఇది ఒక మైలురాయిగా నిలుస్తోందన్నారు. గ్రీన్ ఎనర్జీలో అదానీ కంపెనీలు గణనీయమైన పాత్ర పోషిస్తాయమని తాము విశ్వసిస్తుట్లు ఆశాభావం వ్యక్తం చేశారు..