ఎయిరిండియా బిడ్ రేసులో అదానీ గ్రూప్ ఉంటుందా?
పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.2.1 లక్షల కోట్లు సమీకరించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ లక్ష్యం కోసం ఉన్న ప్రధాన వనరుల్లో ఎయిరిండియా డిస్ఇన్వెస్ట్మెంట్ కీలకం. ఎయిరిండియా కొనుగోలు కోసం వివిధ కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి. బిడ్స్ దాఖలు చేసే వారిలో అదానీ గ్రూప్ కూడా ఉండవచ్చునని వార్తలు వస్తున్నాయి.
సొంత విమానాలు, బ్రాండ్, అప్పులు... ఎయిరిండియా కొనుగోలుతో బయ్యర్కు వచ్చేవేమిటి?
ఇంగ్లీష్ మీడియాలో వస్తున్న వార్తల మేరకు ఎయిరిండియా కొనుగోలుపై అదానీ గ్రూప్లో అంతర్గతంగా చర్చలు జరిగాయి. ఈ చర్చలు కూడా ప్రాథమిక దశలోనే ఉన్నాయి. ఈ కంపెనీకి ఎడిబుల్ ఆయిల్, ఫుడ్ నుండి మైనింగ్, మినరల్స్ వరకు ఉన్నాయి. ఎయిరిండియాను కొనుగోలు చేస్తే మరో రంగంలోకి అడుగు పెట్టినట్లు అవుతుంది.
ఇది ఇప్పటికే విమానాశ్రయ కార్యకలాపాలు, నిర్వహణ వ్యాపారంలోకి ప్రవేశించింది. 2019లో అహ్మదాబాద్, లక్నో, జైపూర్, గౌహతి, తిరువనంతపురం, మంగళూరు.. ఈ ఆరు విమానాశ్రయాలకు ప్రయివేటీకరణ కోసం బిడ్స్ సమర్పించింది. అయితే ఎయిరిండియా అంశంపై కంపెనీ స్పందించాల్సి ఉంది.
కాగా, ఎయిరిండియాలో 100% పెట్టుబడుల ఉపసంహరణకు కేంద్రం మరోసారి ప్రయత్నిస్తోంది. 2018లో 76% వాటా విక్రయం కోసం ప్రయత్నించి విఫలమైంది. ఇప్పుడు కొన్ని విధానపరమైన మార్పులతో మొత్తం విక్రయిస్తోంది. ఎయిరిండియాతో పాటు అనుబంధ ఎయిరిండియా ఎక్స్ప్రెస్లో 100%, సింగపూర్ ఎయిర్లైన్స్తో కలిసి నిర్వహిస్తోన్న గ్రౌండ్ హ్యాండ్లింగ్ సేవల సంయుక్త సంస్థ ఏఐఎస్ఏటీఎస్లోని 50% వాటాలను విక్రయించనుంది.
ఎయిరిండియాకు 2019 నవంబర్ నాటికి 121 ఎయిర్ క్రాఫ్ట్స్ ఉండగా ఇందులో 65 సొంతం. ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్ప్రెస్లు కలిపి ప్రస్తుతం 146 విమానాలు రన్ చేస్తున్నాయి. ఇందులో 82 సొంతవి. ఇవి రూపొంది ఎనిమిదేళ్లే. 27 బోయింగ్ 787 విమానాలు అయిదేళ్ల లోపువి. 27 ఎయిర్బస్ 320 నియో విమానాలు రెండేళ్ల లోపువి. అంతర్జాతీయ సర్వీసులకు సంబంధించి దేశీయ సంస్థల్లో ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్ప్రెస్లకు 51 శాతం వాటా ఉంది. విదేశీ సంస్థలతో కలిపి చూస్తే 18 శాతం.
56 జాతీయ, 42 అంతర్జాతీయ గమ్యస్థానాలకు ఎయిరిండియా విమానాలు నడుపుతోంది. ఈ రెండు సంస్థల ఆదాయం రూ.2018-19లో రూ.30,632 కోట్లు. దేశీయ విమాన సంస్థల్లో అత్యధిక ఆదాయం ఎయిరిండియాదే. ఆదాయంలో ఉద్యోగుల ఖర్చు 11 శాతం. ఉద్యోగుల ఖర్చు శాతం మిగిలిన దేశీయ సంస్థలతో పోలిస్తే సమానంగా ఉంది. అంతర్జాతీయ సంస్థలతో పోలిస్తే తక్కువ. 2012 నుండి ఎయిరిండియా పునరుద్ధరణకు రూ.30వేల కోట్లు సమకూర్చారు. ప్రతి ఏటా నష్టాలు పెరుగుతున్నాయి. ఈ నష్టాలు రూ.60వేల కోట్లు దాటాయి. ఎయిరిండియా రుణాన్ని రూ.23,286 కోట్లకు ప్రభుత్వం పరిమితం చేస్తుంది. కొత్త పెట్టుబడిదారు ఈ భారం మాత్రమే భరించాలి.