ముఖేష్ అంబానీకి మరింత తగ్గరగా, భారీగా పెరిగిన అదానీ సంపద
అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ సంపద ఈ ఏడాది భారీగా ఎగిసింది. అదానీ గ్రూప్ సంస్థల్లోని వివిధ కంపెనీల షేర్లు భారీగా లాభపడటంతో ఆయన సంపద కూడా అదే విధంగా పెరిగింది. ఆసియా కుబేరుడు, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ తర్వాత భారత్లో అత్యంత సంపద కలిగిన రెండో భారతీయుడిగా అదానీ ఉన్నారు. భారత్లోనే కాదు ఏషియాలోనే ఆయన సెకండ్ రిచ్చెస్ట్ పర్సన్. ఇటీవలి కాలంలో అదానీ అదానీ గ్రూప్ స్టాక్స్ పెరుగుతున్నా కొద్ది ముఖేష్ అంబానీ-గౌతమ్ అదానీ మధ్య ఆదాయ అంతరం తగ్గుతోంది.
వేగంగా పెరుగుతోన్న అదానీ ఆదాయం
ముఖేష్ అంబానీ వ్యక్తిగత నికర సంపద 84 బిలియన్ల డాలర్లు. మన కరెన్సీలో రూ.6.13 లక్షల కోట్లు. ప్రపంచంలో పన్నెండో సంపన్నుడు. అలాగే ఆసియా కుబేరుడు ముఖేష్. గౌతం ఆదానీ నికర సంపద 78 బిలియన్ డాలర్లు. మన కరెన్సీలో రూ.5.69 లక్షల కోట్లు. పక్షం రోజుల క్రితం అంబానీ, అదానీ మధ్య ఆదాయ వ్యత్యాసం రూ.75వేల కోట్లు కాగా, రెండు వారాల్లో ఇది 46వేల కోట్లకు తగ్గింది. అంటే అదానీ ఆదాయం వేగంగా పెరుగుతోంది.
ఈ స్టాక్స్ జంప్
గౌతమ్ అదానీ నేతృత్వంలోని ఆదానీ గ్రూప్కు చెందిన 6 లిస్టెడ్ కంపెనీలు గత పదిహేనే రోజుల్లో వేగంగా దూసుకెళ్లాయి. అంతకుముందు ఏడాది కాలంగా కూడా భారీ రిటర్న్స్ ఇచ్చాయి. ఇటీవల మరింత వేగం అందుకున్నాయి. ఆదానీ ట్రాన్స్మిషన్ షేర్ 20 శాతానికి పైగా, ఆదానీ టోటల్ గ్యాస్ 35 శాతం పెరిగాయి. గత 3 రోజుల్లో ఆదానీ పవర్ 45 శాతానికి పైగా పెరిగింది. ఆదానీ ఎంటర్ప్రైజెస్, ఆదానీ పోర్ట్ మిగతా వాటి కంటే ఎగిశాయి. దీంతో గౌతమ్ ఆదానీ వ్యక్తిగత సంపద పెరిగింది. గతవారం రిలయన్స్ షేర్ కూడా 10 శాతం పెరిగింది.
పబ్లిక్ ఇష్యూకు అదానీ పోర్ట్స్
ఇదిలా ఉండగా, గౌతమ్ అదానీకి చెందిన అదానీ ఎయిర్పోర్ట్స్ హోల్డింగ్స్ రూ.25,500 నుండి 29,200 కోట్ల పబ్లిక్ ఇష్యూకు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి సన్నాహాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయని వార్తలు వస్తున్నాయి. గ్రూప్ హోల్డింగ్ కంపెనీ నుండి విమానాశ్రయాల వ్యాపారాన్ని విడదీసి ఐపీఓకు వచ్చేందుకు గౌతమ్ అదానీ ప్రణాళిక సిద్ధం చేశారని అంటున్నారు.