COVID 19: ఇండియా రికవరీ కావాలంటే ఏడాది పడుతుంది! ఈ రంగాలపై భారీ దెబ్బ
కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 53వేల మందికి పైగా మృత్యువాత పడ్డారు. 10 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. ప్రపంచ, భారత ఆర్థిక వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. ప్రపంచ వృద్ధి రేటు భారీగా పడిపోనుందని వివిధ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. భారత జీడీపీపై కూడా భారీగానే ప్రభావం పడనుంది. కరోనాపై వెలాసిటీ ఎంఆర్ సర్వేలో పలు అంశాలు వెల్లడయ్యాయి.
ఈ క్లిష్ట పరిస్థితుల్లో నా మొర ఆలకించండి: సీతారామన్కు మాల్యా, లాక్డౌన్పై ఏమన్నాడంటే
హైదరాబాద్ సహా వివిధ నగరాల్లో సర్వే..
కరోనా వైరస్ గురించి తెలుసుకున్న 94 శాతం మందిలో 75 శాతం మంది ఈ వ్యాధి గురించి ఆందోళన చెందుతున్నారు. అయితే 52 శాతం మందికి మాత్రమే ఇది వ్యాప్తి చెందుతుందనే విషయం తెలుసు. ఈ సర్వేలో దాదాపు 2,100 మంది పాల్గొన్నారు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కోల్కతా, చెన్నై, హైదరాబాద్, పుణే, లక్నో, అహ్మదాబాద్, జైపూర్ తదితర నగరాల్లో సర్వే నిర్వహించారు. మార్చి 19 నుండి 20 మధ్య ఈ ఆన్ లైన్ ద్వారా సర్వే చేశారు.
6 నెలల నుండి ఏడాది సమయం
కరోనా అదుపులోకి వచ్చినా ప్రతికూల ప్రభావాల నుంచి బయటపడేందుకు దాదాపు ఆరు నెలల నుండి ఒక సంవత్సరం పడుతుందని ఈ సర్వేలో పాల్గొన్నవారిలో 84% మంది అభిప్రాయపడ్డారు. ఈ వ్యాధి అత్యంత భయంకరమైన వ్యాధుల జాబితాలోని క్యాన్సర్, ఎయిడ్స్ కంటే ప్రమాదకరమైనదిగా భావిస్తున్నారు. వాటిని దాటేసినకరోనా టాప్ ప్లేస్లో ఉంది.
ఆ ప్రదేశాలకు వెళ్లడం లేదు
వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు ఈ వ్యాధి బారిన పడే అవకాశాలు ఎక్కువని 70 శాతం మందిలో అవగాహన ఉంది. సక్రమంగా పరిశుభ్రత పాటించి, తగు జాగ్రత్తలు తీసుకుంటే వైరస్ వ్యాప్తిని నిరోధించవచ్చునని 63%మంది చెప్పారు. 81% మంది గతంలో కంటే మరింత తరచుగా చేతులు కడుక్కుంటున్నారు. 78% శాతం మంది జనసమ్మర్ధం ఉండే ప్రదేశాలకు వెళ్లడం తగ్గించారు. భవిష్యత్తులోను విదేశాలకు ప్రయాణించేటప్పుడు ఇదే తీరు పాటించాలని చాలామంది భావిస్తున్నారు. జీవనవిధానపరమైన ఈ మార్పులు ఇకపై కూడా కొనసాగే అవకాశాలే కనిపిస్తున్నాయని ఈ వెలాసిటీ ఎంఆర్ ఎండీ తెలిపారు.
వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వలేదు
లాక్ డౌన్, ఆంక్షలు అమలవుతున్నప్పటికీ చాలామంది బయటకు వెళ్లే అలవాటును మానుకోలేకపోతున్నారట. ఉద్యోగ సంబంధ ప్రయాణాలు చేయడం తప్పటం లేదని 46% మంది చెప్పగా, 25% మంది తమకు వర్క్ ఫ్రమ్ హోమ్ వెసులుబాటు లభించలేదని చెప్పారు.
ట్రావెల్, టూరిజం రంగాలు దెబ్బతిన్నాయి
కరోనా వ్యాప్తి నివారణకు కేంద్ర ప్రభుత్వం సరైన చర్యలు తీసుకుంటోందని 87 శాతం మంది అభిప్రాయపడ్డారు. ప్రయాణాలు రద్దు కావడంతో ట్రావెల్, టూరిజం రంగాలు భారీగా దెబ్బతిన్నాయని ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. ఇతర వ్యాపారాలపై తీవ్ర ప్రతికూల ప్రభావమే చూపిందని 92 శాతం ంది అన్నారు. తనకు తెలిసిన వారు ఎదురైనప్పుడు షేక్ హ్యాండ్, కౌగిలించుకోవడం లాంటివి కొంతకాలం ఆగుతాయని 71 శాతం మంది అభిప్రాయపడ్డారు.