ధన్తెరాస్: 20 టన్నులు అనుకుంటే 30 టన్నుల బంగారం సేల్స్, కానీ
ధన్తెరాస్, దీపావళి అంటే బంగారం అమ్మకాలు భారీగా ఉంటాయి. కానీ ఈసారి గతంలో కంటే తగ్గిపోయాయి. అదే సమయంలో ట్రేడర్లు ఊహించిన దాని కంటే ఎక్కువ కొనుగోళ్లు జరగడం గమనార్హం. గత రెండు మూడు నెలలుగా బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఏకంగా రూ.33 వేల నుంచి 40 వేల మార్క్ చేరుకొని, ఇప్పుడు 39 వేలకు అటు ఇటుగా ఉన్నాయి. దీంతో బంగారం కొనుగోలుకు కస్టమర్లు పెద్దగా ముందుకు రాని పరిస్థితి. దీంతో ట్రేడర్లు కూడా సేల్స్ భారీగా తగ్గిపోతాయని భావించారు.
గత ఏడాది కంటే సేల్స్ తగ్గినప్పటికీ ట్రేడర్లు ఊహించిన దాని కంటే ఎక్కువ సేల్స్ జరిగాయి. ధన్తెరాస్ రోజు 30 టన్నుల బంగారం కొనుగోళ్లు జరిగాయి. గత కొన్నేళ్లుగా దీపావళి సీజన్లో అమ్మకాలు 40 టన్నులకు చేరుకున్నాయి. కానీ ఈ ఏడాది బంగారం ధరలు రూ.39వేలకు అటు ఇటుగా ఉండటంతో కొనుగోళ్లు కొంత తగ్గాయి.
కేబుల్ ఆపరేటర్లకు హిందూజా వెంచర్స్ అదిరిపోయే దీపావళి బొనాంజా
ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ జాతీయ కార్యదర్శి సురేంద్ర మెహతా మాట్లాడుతూ.. బంగారం ఎక్కువ ధర పలకడంతో మార్కెట్లో వాటికి డిమాండ్ తక్కువగా ఉందని, దీంతో ఈసారి ధన్తెరాస్కి సేల్స్ 20 టన్నుల వద్ద ఆగిపోతాయని అంచనా వేశామన్నారు. కానీ అంచనాలు దాటి 30 టన్నుల బంగారం కొనుగోళ్లు జరిగాయన్నారు.
అమ్మకాల్లో వృద్ధి కనిపించినప్పటికీ గత సంవత్సరంతో పోలిస్తే 25 శాతం క్షీణత ఉందని చెప్పారు. బంగారం రేట్లు పెరగడం వల్ల మార్కెట్లో డిమాండ్ తగ్గిందని చెప్పారు. భారత ప్రభుత్వం విలువైన లోహాలపై దిగుమతి సుంకాన్ని 10 నుంచి 12.5 శాతానికి పెంచడం కూడా బంగారం ధరలు పెరగడానికి ఓ కారణంగా భావిస్తున్నారు.