కంపెనీలు, బ్యాంకులకు కొత్త తలనొప్పి.. ఖాతాదారులు, ఇన్వెస్టర్లలో ఆందోళన
దేశంలోని దిగ్గజ కంపెనీలు, బ్యాంకులకు కొత్త తలనొప్పి తయారయింది. దీన్ని ఈ విధంగా ఎదుర్కొవాలో తెలియక తలపట్టుకుంటున్నాయి. తమ సంస్థకు సంబంధించిన జరుగుతున్న అసత్య ప్రచారమే కంపెనీలను కునుకు లేకుండా చేస్తోంది. అంతేకాకుండా తీవ్ర నష్టాల పాలు చేస్తోంది. అసత్య ప్రచారాల వల్ల తమ కస్టమర్లు, ఇన్వెస్టర్లు, ఇతర వర్గాల్లో విశ్వాసం సన్నగిల్లుతోందని, ఇది కంపెనీల మనుగడను ప్రశ్నార్థకంగా చేస్తోందని సంస్థలు ఆందోళన చెబుతున్నాయి.
రుణం తిగిగి చెల్లించలేకపోతున్నారా? మీకూ ఈ హక్కులుంటాయ్
సామాజిక మాధ్యమాల ద్వారా..
బ్యాంకులు, కొన్ని కంపెనీలకు సంబంధించి వాట్సాప్, పేస్ బుక్ ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా అసత్య వార్తలు పెద్ద ఎత్తున వ్యాప్తి చెందుతున్నాయి. ఇలాంటి వార్తలను సృష్టించే వారిని పట్టుకోవడం చాలా కష్టంగా మారుతోంది. తప్పుడు వార్తలు చాలా తక్కువ సమయంలోనే అనేక మందికి చేరిపోతున్నాయి. ఈ వార్తల్లో ఎంత వరకు వాస్తవం ఉందో తెలుసుకోకుండానే చాలా మంది మరి కొందరికి వాటిని షేర్ చేస్తున్నారు. ఫలితంగా చాలా కొద్దీ సమయంలోనే సంస్థలకు ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురవుతోంది. కొన్ని బ్యాంకులను మూసివేస్తున్నారని, కొన్ని కంపెనీల ఆర్ధిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉందని, మరికొన్ని కంపెనీలు నష్టాల పాలు అవుతున్నాయని, ఇంకొన్ని కంపెనీలు విలీనం అవుతున్నాయని.. ఇలా ఎన్నో రకాల అసత్య వార్తలు సోషల్ మీడియా వేదికగా ప్రచారం అవుతున్నాయి. ఫలితంగా కంపెనీలు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోంది.
దేశవ్యాప్తంగా కార్యకలాపాలు నిర్వహించే కంపెనీలు, స్టాక్ మార్కెట్లలో నమోదైన కంపెనీల పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. తప్పుడు వార్తల వల్ల స్టాక్ మార్కెట్లో నమోదైన కంపెనీల షేర్ల ధరలు కూడా ప్రభావితం అవుతున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
ఫిర్యాదుల వెల్లువ
* సోషల్ మీడియా ద్వారా తప్పుడు వార్తలు చలామణి అవుతున్నాయని ఇటీవలే యెస్ బ్యాంక్, పిరామల్ ఎంటర్ ప్రైజెస్ లు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. తప్పుడు వార్తల ద్వారా తమ బ్యాంకు ఆర్ధిక పరిస్థితి గురించి ప్రచారం చేస్తూ డిపాజిటర్లలో ఆందోళన కలిగేలా చేస్తున్నట్టు యెస్ బ్యాంకు తన ఫిర్యాదులో పేర్కొంది. తప్పు దారి పట్టించే విధంగా ఉన్న పుకార్ల గురించి ఈ బ్యాంకు క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటర్ సెబీకి కూడా ఫిర్యాదు చేసింది.
* దేశంలో అతిపెద్ద జీవిత బీమా కంపెనీ అయినా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అఫ్ ఇండియా కు కూడా నకిలీ వార్తల బెడద తప్పలేదు. ఎల్ ఐ సి అనేక కంపెనీల్లో పెట్టుబడులు పెట్టింది. అయితే ఈ సంస్థకు భారీ స్థాయిలో నష్టాలు వస్తున్నాయంటూ సోషల్ మీడియాలో పుకార్లు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో సంస్థ ప్రస్తుత పరిస్థితి గురించి ఎల్ ఐ సి ప్రకటన చేయాల్సి వచ్చింది. ఇలాంటి తప్పుడు వార్తలను పట్టించుకోవద్దని, సంస్థ బలోపేతంగా ఉందని గణాంకాలతో సహితంగా ఎల్ ఐ సి ప్రకటన చేసింది.
* బ్యాంకు ఆర్ధిక పరిస్థితి బాగోలేదని, కొన్ని శాఖలు, ఏటీఎం లను మూసివేస్తున్నారంటూ సోషల్ మీడియా ద్వారా కొంతమంది ప్రచారం చేస్తున్నారంటూ ఇటీవలే మూడు పేస్ బుక్ ఖాతాలపై లక్ష్మి విలాస్ బ్యాంక్ ఫిర్యాదు చేసింది.
* బ్యాంక్ అఫ్ మహారాష్ట్ర కూడా తమ బ్యాంకుపై వస్తున్నా తప్పుడు వార్తలపై ఫిర్యాదు చేసింది.
కారణం ఏమిటంటే...
* బ్యాంకింగ్ రంగంలో మొండి పద్దులు భారీ స్థాయిలో ఉన్నాయి. కొంత మంది బ్యాంకుల నుంచి అప్పులు తీసుకొని తిరిగి చెల్లించక పోవడమే ఇందుకు ప్రధానమైన కారణం. ఇటీవలి కాలంలో కొన్ని బ్యాంకుల్లో కుంభకోణాలు వెలుగు చూస్తున్నాయి. ఫలితముగా ఆయా బ్యాంకులపై భారత రిజర్వు బ్యాంకు ఆంక్షలు విధిస్తోంది. దీనివల్ల బ్యాంకు కస్టమర్లు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోంది. కొన్ని కంపెనీల అప్పులు పెరిగిపోయి ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో చాలా మంది తమకు తోచిన విధంగా, తమకు తెలిసిన లేదా ఎవరైనా తమకు పంపిన సమాచారాన్ని మరొకరికి వాట్సాప్ లేదా పేస్ బుక్ ద్వారా పంపుతున్నారు. దీనివల్ల కొంతమందిలో ఆందోళన ఎక్కువ అవుతోంది. తప్పుడు వార్తల ప్రచారానికి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే చర్యలు ప్రారంభించింది. అయితే ఇందుకు మరింత సమయం, అన్ని వర్గాలవారి సహకారం అవసరం ఉంటుంది.
ఏం చేయాలి?
* తమకు వాట్సప్ ద్వారా వచ్చిన లేదా పేస్ బుక్ ద్వారా అందిన సమాచారాన్ని మరొకరితో పంచుకునే ముందు ఆ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందొ ఒక్కసారి తెలుసుకోవడం మంచిది. అలా తెలుసుకోలేని సందర్భంలో ఆ సమాచారాన్ని మరొకరికి పంపకపోవడం మేలు. మీకు అందిన సమాచారం మీకు సంభందం ఉన్న కంపెనీ లేదా బ్యాంకుకు సంభందించినది అయితే ఆ సంస్థకు ఫోన్ చేసి తగిన సమాచారం తెలుసుకోవచ్చు.