ఆంధ్రా బ్యాంక్ గోల్డ్ బాండ్ స్కీం: వారికి రూ.50 తక్కువ
హైదరాబాద్: సావరీన్ గోల్డ్ బాండ్లను విడుదల చేస్తున్నట్లు ఆంధ్రా బ్యాంక్ శనివారం తెలిపింది. దేశవ్యాప్తంగా ఈ నెల 21వ తేదీ నుంచి 25వ తేదీ లోపు జారీచేసే ఈ బాండ్ల ధరను గ్రాముకు రూ.3,835గా నిర్ణయించింది. డిజిటల్లో సబ్స్క్రైబ్ చేసే వారికి గ్రాముకు రూ.50 రాయితీని ప్రకటించింది.
ఒక్కో వ్యక్తి ఒక్క గ్రాము అయినా పెట్టుబడిగా పెట్టవచ్చని తెలిపింది. గరిష్ఠంగా నాలుగు కిలోల వరకు కొనుగోలు చేయవచ్చునని తెలిపింది. బాండ్లను జారీ చేసిన ఎనిమిదేళ్ల తర్వాత సొమ్ము చెల్లిస్తామని, అంతకంటే ముందే సొమ్ము కావాలనుకుంటే అయిదేళ్ల తర్వాత తీసుకోవచ్చని స్పష్టం చేసింది.
ఆంధ్రా బ్యాంకు 2019-20 సంవత్సరంలో సిరీస్ VI గోల్డ్ సావరీన్ బాండ్ స్కీంను ప్రారంభిస్తోంది. ఆంధ్రా బ్యాంకు కస్టమర్లు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. భారతదేశంలో నివసించే వారు ఈ బాండ్స్ కొనుగోలు చేయవచ్చు. మైనర్ పిల్లల తరఫున ఇండివిడ్యువల్స్ కొనుగోలు చేయవచ్చు. జాయింట్గా కూడా కొనుగోలు చేయవచ్చు.
బంగారంపై పెరుగుతున్న పెట్టుబడి
ఆభరణాల కోసమే కాకుండా పెట్టుబడుల కోసం బంగారానికి ప్రాధాన్యం గణనీయంగా పెరుగుతోంది. బంగారాన్ని ఎప్పుడంటే అప్పుడు నగదులోకి మార్చుకోవచ్చు. భద్రత ఎక్కువ ఉంటుంది. పెరుగుతున్న ద్రవ్యోల్భణాన్ని ఎదుర్కొనే సామర్థ్యం కూడా ఉంటుంది. అత్యవసర సమయాల్లో ఆదుకొనడంలో బంగారం ముందుంటుంది. అందుకే బంగారాన్ని కొనుగోలు చేసే విషయంలో సందేహాలు ఉండవు. దీన్ని విభిన్న రూపాల్లో కొనుగోలు చేసే అవకాశం ఉంది. కాబట్టి ఆర్ధిక సామర్థ్యం ను బట్టి చేయవచ్చు.
బంగారంలో పెట్టుబడి పెట్టాలంటే ఈ చిట్కాలు తెలుసుకోవాల్సిందే..
బంగారాన్ని కాయిన్ల రూపంలో, ఆభరణాలుగా, కడ్డీలుగా కొనుగోలు చేయవచ్చు. వీటిని భౌతిక బంగారంగా చెప్పుకోవచ్చు. వీటిని ఆభరణాల దుకాణాల్లో కొనుగోలు చేయవచ్చు. అంతేకాకుండా గోల్డ్ ఎక్స్చేంజి ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్), సావరిన్ గోల్డ్ బాండ్స్ రూపంలోనూ బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు. గోల్డ్ ఈటీఎఫ్ లను స్టాక్ మార్కెట్ ఎక్స్చేంజి ల ద్వారా, సవరిన్ గోల్డ్ బాండ్లను బ్యాంకులు, పోస్టాఫీసులు, ఇతర అధీకృత ఆర్ధిక సంస్థల ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ బంగారాన్ని పేపర్ గోల్డ్ గా వ్యవహరిస్తారు. కొన్ని ఈ-కామర్స్ వెబ్ సైట్లు కూడా బంగారాన్ని విక్రయిస్తున్నాయి. నాణ్యతను బట్టి బంగారం ధర ఆధారపడి ఉంటుంది. మేలిమి బంగారం 24 క్యారెట్లు ఉంటుంది.