భారత సంతతి ఆర్థికవేత్తకు నోబెల్ బహుమతి, ఏం చేశారంటే?
2019 సంవత్సరానికి గాను సోమవారం నాడు ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి విజేతలను ప్రకటించారు. ఎకనమిక్స్లో నోబెల్ అందుకున్న వారిలో ఇండియన్ అమెరికన్ అభిజిత్ బెనర్జీ కూడా ఉన్నారు. ఆర్థిక శాస్త్రంలో మొత్తం ముగ్గురికి దగ్గింది. ఇందులో భారతీయ అమెరికన్ అభిజిత్ బెనర్జీ, ఎస్తేర్ డుఫ్లో, మైఖేల్ క్రీమర్ ఉన్నారు. ఈ ముగ్గురికి సంయుక్తంగా అవార్డు ఇస్తున్నట్లు స్టాక్హోమ్ రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ సోమవారం తెలిపింది. అభిజిత్, ఎస్తేర్ డుఫ్లోలు భార్యాభర్తలు కావడం గమనార్హం. నోబుల్ బహుమతి అందుకున్న ఆరో జంట వీరిది.
ప్రపంచంలోని పేదరికాన్ని నిర్మూలించేందుకు వీరి ప్రయోగాలు ఉపయోగపడతాయని ఈ సందర్భంగా రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్స్స్ తెలిపింది. 2019లో ఎకనమిక్ సైన్సెస్ గ్రహీతలు నిర్వహించిన పరిశోధనలు ప్రపంచానికి పేదరికంతో పోరాడే సామర్థ్యాన్ని గణనీయంగా పెంచిందని పేర్కొన్నారు. కేవలం రెండు దశాబ్దాల్లో వారి సరికొత్త ప్రయోగ ఆధారిత విధానాలు ఎకనమిక్స్ డెవలప్మెంట్ను మార్చి వేశాయని పేర్కొన్నారు. పేదరికాన్ని తగ్గించేందుకు వీరు చేసిన సేవలకు గాను నోబెల్ బహుమతిని గెలుచుకున్నారు.
700 మిలియన్లకు పైగా ప్రజల ఆదాయం ఇప్పటికీ ఎంతో తక్కువగా ఉంది. ప్రతి ఏటా ఐదు మిలియన్ల మంది చిన్నారులు వారి అయిదో పుట్టిన రోజుకు ముందే మృతి చెందుతున్నారు. తక్కువగా ఖర్చు అయ్యే లేదా సరళమైన చికిత్సలతో నివారించగల లేదా నయం చేయగల వ్యాధుల భారిన పడి మృతి చెందడం బాధాకరం.
ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు నోబెల్ ప్రైజ్ పొందినవారు ప్రపంచం... పేదరికంతో పోరాడేందుకు సరైన సమాధానాలు వచ్చేలా ఉత్తమ మార్గాలను కనిపెట్టారు. ఈ విధానం ఎంతో ప్రయోజనకరం. ఉదాహరణకు పిల్లల ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు వారి కొత్త విధానాలు అత్యంత ప్రభావం చూపుతాయని నోబెల్ కమిటీ పేర్కొంది. ప్రపంచ పేదరికం అనే అంశంపై వారు చేసిన పరిశోధనలు, ప్రతిపాదనలకు ఈ పురస్కారం లభించినట్లు నోబెల్ పురస్కార కమిటి తెలిపింది. ఆర్థిక శాస్త్రంలో నోబెల్ పొందిన వారిలో ఇండియన్ అమెరికన్ అభిజిత్ బెనర్జీ ఒకరు.