IRCTC IPO అదుర్స్: రూ.645 కోట్ల అనుకుంటే రూ.72,000 కోట్ల రాక
ముంబై: ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్ (IRCTC) పబ్లిక్ ఇష్యూకు మంచి స్పందన వచ్చింది. జారీ చేసిన షేర్లకు 112 రెట్లు అదనంగా దరఖాస్తులు వచ్చాయి. తొలి పబ్లిక్ ఆఫర్ (IPO)లో భాగంగా 2 కోట్ల షేర్లు జారీ చేయగా 225 కోట్ల షేర్లకు బిడ్స్ వచ్చాయి. సెప్టెంబర్ 30వ తేదీన ప్రారంభమైన ఇష్యూ అక్టోబర్ 3వ తేదీతో ముగిసింది. సమాచారం మేరకు అర్హులైన సంస్థాగత మదుపర్ల విభాగంలో (క్యూఐబీ) 108.89 రెట్లు, సంస్థాగతేతర మదుపర్ల విభాగంలో (ఎన్ఐఐ) 354.52 రెట్లు, చిన్న మదుపర్ల విభాగంలో 14.65 రెట్లు అధిక బిడ్స్ దాఖలయ్యాయి.
ప్రస్తుతం మందగమనం ఉన్నప్పటికీ కంపెనీపై అంచనాలు ఉండటంతో అనూహ్య స్పందన లభించిందని చెబుతున్నారు. ఈ ఐపీవోలో భాగంగా 12.6 శాతానికి సమానమైన 2 కోట్ల షేర్లను కేంద్ర ప్రభుత్వం ఆఫర్ ఫర్ సేల్ ద్వారా విక్రయించింది. రూ.317-320 ప్రైస్ బ్రాండుతో ఈ ఐపీవో ద్వారా కేంద్రానికి రూ.645 కోట్లు వస్తుందని అంచనా. ఈ నెల 14వ తేదీన షేర్లు స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవుతాయి. రూ.150 నుంచి రూ.200 మధ్య లిస్టింగ్ లాభాలు ఉండవచ్చునని అంచనా.
IRCTC IPO: రైల్వే నుంచి షేర్ ధర... తెలుసుకోవాల్సిన ముఖ్యవిషయాలు
2 కోట్ల షేర్లకు గాను 225 కోట్ల షేర్లకు దరఖాస్తులు రాగా, నిధుల సమీకరణ రూ.645 కోట్లు. అంటే దాదాపు రూ.72,000 కోట్ల విలువైన దరఖాస్తులు వచ్చాయి. క్యూఐబీకి కేటాయించిన వాటా 109 రెట్లు ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. సంస్థాగతేతర ఇన్వెస్టర్ల వాటా 355 రెట్లు కాగా, రిటైల్ ఇన్వెస్టర్ల వాటా 14.65 రెట్లు ఓవర్ సబ్స్క్రైబ్ అయింది.
ఈ ఆర్థిక సంవత్సరంలో స్టాక్ మార్కెట్లో లిస్ట్ కాబోతున్న రెండో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఐఆర్సీటీసీ. గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో అత్యంత విజయవంతమైన ఐపీఓ ఇదే కావడం గమనార్హం. సంస్థాగత, సంస్థాగతేతర ఇన్వెస్టర్లతో పాటు ఉద్యోగుల వాటాలకు అత్యధిక బిడ్స్ వచ్చాయి.
IRCTC అకౌంట్ ద్వారా నెలలో 12 టిక్కెట్లు బుక్ చేసుకోవడం ఎలా?
1999 సెప్టెంబర్ 27న ప్రారంభమైన ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజమ్ కార్పోరేషన్ (IRCTC) 2002 నుంచి సేవలు అందిస్తోంది. ఇది భారతీయ రైల్వేకు అనుబంధ సంస్థ. ఇది ఆన్లైన్ ద్వారా రైలు టిక్కెట్ బుక్ చేసుకునే సౌకర్యం కల్పిస్తోంది. నిమిషంలో పదిహేను వేల టిక్కెట్లు, ఒకేసారి మూడు లక్షల మంది బుక్ చేసుకునే సామర్థ్యం ఈ వెబ్ సైట్కు ఉంది. ప్రపంచంలోనే అత్యధిక రద్దీ కలిగిన రెండో వెబ్ సైట్ ఇది. లైఫ్ లైన్ ఆఫ్ ది నేషన్ దీని ట్యాగ్. ప్రతి రోజు ఆరు లక్షల మంది వరకు ఈ వెబై సైట్ ద్వారా టిక్కెట్ తీసుకుంటారు. మినీరత్న అయిన ఐఆర్సీటీసీలో వాటా విక్రయం ద్వారా రూ.645 కోట్లు సమీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది.
30 సెప్టెంబర్ 2019, సోమవారంనుంచి IRCTC పబ్లిక్ ఇష్యూ ప్రారంభమైంది. రూ.645 కోట్ల నిధుల సమీకరణ లక్ష్యం. అక్టోబర్ 3వ తేదీన ఐపీవో ముగిసింది. రూ.10 ముఖ విలువ కలిగిన 2.1 కోట్ల ఈక్విటీ షేర్లను (2,01,60,000) ఆఫర్ ఫర్ సేల్ పద్ధతిలో విక్రయించారు. ఈ ఐపీవోకు రూ.315 నుండి రూ.320 మధ్య ధరల్ని నిర్ణయించారు. రిటైల్ ఇన్వెస్టర్లు, ఉద్యోగులకు షేరు పైన రూ.10 రాయితీ ఇస్తున్నారు.