ఏడాది కింద రూ.393 నేడు రూ.56: యస్ బ్యాంక్ షేర్ పతనానికి కారణాలు
యస్ బ్యాంకు షేర్లు తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాయి. ఇటీవల ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కి అన్న చందంగా కనిపిస్తోంది. ఈ బ్యాంకు చాలా వేగంగా ఎదిగింది. అ క్రమంలో షేర్ ధర దూసుకెళ్లింది. కానీ బ్యాంకులో అంతర్గతంగా చోటు చేసుకున్న పరిణామాలతో 14 నెలల నుంచి దీని షేర్లు ముందుకు కదలడం లేదు. మూడు రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం కార్పోరేట్ ట్యాక్స్ను తగ్గించిన తర్వాత అన్ని పైనాన్షియల్ సంస్థల షేర్లు దూసుకెళ్తున్నాయి. అలాగే యస్ బ్యాంకు షేర్లు కూడా భారీగా లాభపడ్డాయి. కానీ అ తర్వాత మళ్లీ పడిపోయాయి.
2018 ఆగస్ట్ నెల మధ్యలో యస్ బ్యాంకు షేర్ రూ.393 వద్ద ట్రేడ్ అయింది. ఏడాది తర్వాత ఆగస్ట్ మధ్యలో షేర్ ధర దాదాపు రూ.80కి పడిపోయింది. ఇప్పుడు రూ.56 వద్ద ట్రేడ్ అవుతోంది.
ఒక్క నిర్ణయంతో రూ.72,000 కోట్లు, ఇన్వెస్ట్ చేస్తే భారీ లాభాలు!
యస్ బ్యాంకు ప్రధాన వ్యాపారం ఇదే..
ఈ బ్యాంకును 2004లో రాణా కపూర్, అశోక్ కపూర్లు ప్రారంభించారు. అంతకుముందు NBFCని నిర్వహించి ఆ తర్వాత ఆర్బీఐ బ్యాంకింగ్ లైసెన్స్ తెచ్చుకొని దీనిని ప్రారంభించారు. యస్ బ్యాంకు ప్రధాన వ్యాపారం కార్పోరేట్ సంస్థలకు రుణాలు ఇవ్వడం, సిండికేట్ రుణాలు ఇప్పించడం. అలాగే, రిటైల్ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ మార్కెటింగ్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ సేవలను అందిస్తుంది.
ప్రమోటర్ల వివాదం...
2008లో ముంబై ఉగ్రదాడుల్లో ఈ బ్యాంకు సహ వ్యవస్థాపకులు అశోక్ను ఉగ్రవాదులు హత్య చేసిన తర్వాత ఈ వాటాలు భార్య మధుకపూర్కు వచ్చాయి. ఆ తర్వాత ఆమె బోర్డులోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేయగా, ఆర్బీఐ నిబంధనల ప్రకారం కుదరదని బోర్డు పేర్కొంది. 12 శాతం షేర్లు ఆమెకు ఉండగా, 2011లో బ్యాంకు ముద్రించిన పెద్ద వాటాదారుల షేర్ల జాబితాలో ఆమె పేరు లేదు. మరో సహ వ్యవస్థాపకులు రాణా కపూర్కు 13.72 శాతం వాటాలు ఉన్నాయి.
బోర్డులోకి కూతురు కూడా నో
మరుసటి ఏడాది రాణాకపూర్ తన సన్నిహితులను బ్యాంకు డైరెక్టర్లుగా నియమించారనే పేరు ఉంది. ఈ నియామకంపై మధుకపూర్ను సంప్రదించలేదని అంటారు. తన కూతురును బోర్డులోకి తీసుకోవాలని మధుకపూర్ కోరగా, నో చెప్పడంతో ఇది హైకోర్టుకు చేరుకుంది. ఆమెకు అనుకూలంగా మూడేళ్ల తర్వాత తీర్పు వచ్చింది. ప్రమోటర్ల మధ్య వివాదం ఇబ్బందిగా మారింది.
NPA ఎఫెక్ట్
మరోవైపు, 2015లో బ్యాంకు చూపిన NPAల కంటే ఆర్బీఐ గుర్తించిన NPAల విలువ రూ.150 కోట్ల వరకు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. రెండేళ్ల తర్వాత NPAల లెక్కలు బ్యాంకు, ఆర్బీఐ చూపిన లెక్కల్లో రూ.6వేల కోట్లకు పైగా వ్యత్యాసం ఉంది. ఆ తర్వాత అన్ని బ్యాంకుల్లో మాదిరి.. యస్ బ్యాంకులోను NPAలు భారీగా పెరిగాయి.
ఇన్వెస్టర్ల ఆందోళన
2019 జనవరిలో ఆర్బీఐ ఆదేశాల నేపథ్యంలో యస్ బ్యాంకు ప్రమోటర్ అయిన రాణా కపూర్ ఎండీ బాధ్యతల నుంచి తొలగి రవనీత్ గిల్కు అప్పగించారు. ఈ బ్యాంక్ NPAలు 8 శాతానికి పైగా ఉన్నాయట. ఈ NPAలు రద్దైతే లాభాలు మొత్తం కోల్పోతాయని ఇన్వెస్టర్లలో ఆందోళనలు ఉన్నాయి.