Petrol price: 6వ రోజు పెరిగిన పెట్రోల్ ధర, శుభవార్త చెప్పిన కేంద్రమంత్రి
పెట్రోల్, డీజిల్ ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. సౌదీ అరేబియాలోని ఆరామ్కో చమురు క్షేత్రాలపై డ్రోన్ దాడి అనంతరం వరుసగా ఆరో రోజు మన దేశంలో ధరలు పెరిగాయి. పెట్రోల్ ధర రూ.1.59 పైసలు, డీజిల్ ధర రూ.1.31 పైసలు పెరిగింది. 2017 నుంచి పెట్రోల్, డీజిల్ ధరలను ప్రతి రోజు సమీక్షిస్తున్నారు. నేడు (సెప్టెంబర్ 22) ఢిల్లీ మార్కెట్లో పెట్రోల్ ధర 27 పైసలు, డీజిల్ ధర 18 పైసలు పెరిగింది.
జాగ్రత్తపడండి!: 67 శాతం పెరిగిన ఉల్లి ధర, 2 నెలల వరకు ఇంతే
పెట్రోల్ ధరలు పెరిగాయి కానీ...
సెప్టెంబర్ 17వ తేదీ నుంచి పెట్రోల్ ధరలు ప్రతి రోజు పెరుగుతున్నాయి. సౌదీలోని చమురు క్షేత్రాలపై డ్రోన్ దాడి నేపథ్యంలో ప్రపంచానికి సరఫరా అయ్యే చమురులో 5 శాతం నష్టపోయింది. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ధరలు పెరుగుతున్నాయి. మన దేశంలో సెప్టెంబర్ 17వ తేదీ నుంచి ధరలు పెరిగినా అంతగా లేవు. కానీ ముందు ముందు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మరింత పెరుగుదల తప్పదా?
మరోవైపు, పెట్రోల్ డీజిల్ ధరలు మరో రూ.6 పెంచక తప్పదని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన సంకేతాలు ఇచ్చినట్లుగా చెబుతున్నారు. మరోవైపు, పెట్రో ఉత్పత్తులపై సుంకాల భారాన్ని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టపడటం లేదని ప్రధాన్ చెప్పారు.
తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా...
ఆదివారం హైదరాబాదులో పెట్రోల్ ధర 29 పైసలు పెరిగి రూ.78.26కు, డీజిల్ ధర 23 పైసలు పెరిగి రూ.72.75కు చేరుకుంది. అమరావతిలో పెట్రోల్ 27 పైసలు పెరిగి రూ.77.94, డీజిల్ 22 పైసలు పెరిగి రూ.72.10కి పెరిగింది. విజయవాడలో పెట్రోల్ ధర 28 పైసలు పెరిగి రూ.75.58, డీజిల్ ధర 22 పైసలు పెరిగి రూ.71.76గా ఉంది. దాదాపు అన్ని నగరాల్లోను అటు ఇటుగా ఇంతే పెరిగింది.
ఇతర నగరాల్లో...
ఢిల్లీలో పెట్రోల్ ధర 27 పైసలు పెరిగి రూ.73.62గా, డీజిల్ ధర 21 పైసలు పెరిగి రూ.66.74గా, ముంబైలో పెట్రోల్ ధర 27 పైసలు పెరిగి రూ.79.29గా, డీజిల్ ధర కూడా 22 పైసలు పెరిగి రూ.70.01గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో శుక్రవారం బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారెల్కు 0.21 శాతం తగ్గుదలతో 63.20 డాలర్లగా, డబ్ల్యూఐటీ క్రూడాయిల్ 0.17 శాతం తగ్గి 58.09 డాలర్లుగా ఉంది.
శుభవార్త చెప్పిన ధర్మేంద్ర ప్రధాన్
ఓ వైపు అంతర్జాతీయస్థాయిలో చమురు విషయంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్ని సమయంలో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఓ శుభవార్త చెప్పారు. భారత్ ఫండింగ్ సహకారంతో నిర్మిస్తున్న మంగోలియాలోని ఆయిల్ రిఫైనరీ 2022 డిసెంబర్ నాటికి పూర్తవుతుందని చెప్పారు. మంగోలియాలోని నాలుగింట మూడింట చమురు వసతుల్ని ఇది తీరుస్తుందన్నారు. 2015లో ప్రధాని మోడీ అక్కడ పర్యటించారని, ఇది భారత్ - మంగోలియా స్నేహాన్ని మరింతగా చాటి చెప్పిందని, భారత్ సహకారంతో 1.5 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో 1 బిలియన్ డాలర్ల చమురు శుద్ధి కర్మాగారం నిర్మాణమే మన రెండు దేశాల మధ్య స్నేహం ప్రకాశవంతమవుతోందని చెప్పేందుకు ఉదాహరణ అన్నారు.