భారీగా తగ్గిన బంగారం, ఈ కారణాలతో మళ్ళీ పెరుగుతుందా?
న్యూఢిల్లీ: ఇటీవల బంగారం ధరలు తగ్గుతున్నాయి. శుక్రవారం వరకు వరుసగా ఏడు రోజుల పాటు బంగారం ధరలు తగ్గాయి. వారం రోజుల్లో ధర రూ.2,400 తగ్గింది. వెండి ధర కూడా తగ్గుతూ వస్తోంది. గత శుక్రవారం ఎంసీఎక్స్లో 10 గ్రాముల బంగారం 0.65 శాతం తగ్గి రూ.37,503గా ఉంది. సెప్టెంబర్ 4వ తేదీ రికార్డ్ హై రూ.39,885గా ఉన్న బంగారం ధర.. గత వారాంతానికి రూ.2400 తగ్గింది. ఎంసీఎక్స్లో వెండి ధర 3 శాతం లేదా రూ.1300 తగ్గి రూ.45,830కి పడిపోయింది. అంతకుముందు వారం రికార్డ్ హై రూ.51,489 వద్ద ఉంది. వెండి ధరలు వారంలో 11 శాతం లేదా రూ.5,659 తగ్గింది.
అక్రమాలకు చెక్: కొత్త వారికి ఆధార్ వెరిఫికేషన్ తప్పనిసరి
పసిడి తగ్గుముఖం
అమెరికా - చైనా వాణిజ్య భయాలు, అంతర్జాతీయ మార్కెట్లు, ఫెడ్ రేట్లు, భారత్లో ఆభరణాల వర్తకుల నుంచి డిమాండ్ వంటి వివిధ కారణాల వల్ల కొద్ది నెలలుగా బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. చాలామంది పెట్టుబడుల కోసం పసిడివైపు చూశారు. ధరలు ఆకాశాన్ని అంటాయి. అమెరికా - చైనా వాణిజ్య యుద్ధం చల్లబడుతుండటం పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. వారం రోజులుగా పసిడి ధర తగ్గుముఖం పట్టింది.
మళ్లీ ధరలు పెరిగేనా?
మరోవైపు బుధవారం సెప్టెంబర్ 18న ఫెడ్ రిజర్వ్ నేపథ్యంలో సెంట్రల్ బ్యాంకు వరుసగా రెండోసారి 0.25 శాతం వడ్డీ రేటును కట్ చేస్తుందనే అంచనాలు ఉన్నాయి. అదే సమయంలో భారత్లో పండుగల సీజన్ ప్రారంభమవుతోంది. దసరా, దీపావళికి ఎక్కువ కొనుగోళ్లు ఉంటాయి. ఈ నేపథ్యంలో బంగారం ధరలు తిరిగి పెరగవచ్చుననే అభిప్రాయం ఉంది.
పసిడివైపు మళ్లీ చూస్తారా?
సౌదీ అరేబియన్ ఆయిల్ క్షేత్రాలపై దాడి నేపథ్యంలో ఓ వైపు చమురు ధరలు పెరగడంతో పాటు ఇన్వెస్టర్లు ఈ వారం మళ్లీ పసిడివైపు చూసే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇన్వెస్టర్లకు బంగారం ఎప్పటికీ స్వర్గదామం. అయితే స్వల్పకాలంలో ప్రస్తుత పరిస్థితి వల్ల బంగారం ర్యాలీ ఉండవచ్చునని, మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో యుద్ధ వాతావరణం ఉంటే తప్ప బంగారంపై లాభాలు పరిమితమేననే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే దీర్ఘకాలంలో మాత్రం పెట్టుబడికి మంచిదని భావిస్తారు.
చమురు ధరలపై ప్రభావం
సౌదీ అరేబియా ప్రభుత్వ కంపెనీ ఆరామ్కోకు చెందిన రెండు ప్రధాన చమురు క్షేత్రాలపై యెమన్ తిరుగుబాటుదారులు డ్రోన్లతో దాడి చేసిన విషయం తెలిసిందే. దీంతో దాదాపు సగానికి పైగా ఉత్పత్తి నిలిచిపోయింది. 5.7 మిలియన్ బ్యారెళ్ల చమురు ఉత్పత్తి ఆగిపోయింది. ప్రపంచ చమురు ఎగుమతుల్లో ఇది 5 శాతం. దీంతో చమురు ధరలపై తీవ్ర ప్రభావం పడే అవకాశాలున్నాయి.