జగన్ ప్రభుత్వం టార్గెట్ మిస్! రూ.500 కోట్ల ఆదాయం కట్
న్యూఢిల్లీ/అమరావతి: గత ఆర్థికసంవత్సరంలో వస్తు, సేవల పన్ను (GST) వసూళ్లలో రాష్ట్రం 28 శాతం వృద్ధి సాధించింది. ఇప్పుడు అందుకు భిన్నంగా ఉంది. వాణిజ్య పన్నుల విభాగం (CT) 2019-20 ఆర్థిక సంవత్సరంలో అనుకున్న లక్ష్యాలను సాధించలేకపోయింది. ప్రతి నెల రూ.1,892 కోట్ల టార్గెట్ పెట్టుకోగా, మే, జూలై నెలల్లో రూ.1,650 కోట్లు దాటలేదు. రావాల్సిన కలెక్షన్లు రూ.7,568 కోట్లు కాగా ఏప్రిల్ నుంచి జూలై వరకు జీఎస్టీ కలెక్షన్లు రూ.7,345 మాత్రమే.
రూ.10,000 సాయం పొందేందుకు అర్హతలు ఇవే...
టార్గెట్కు సమీపంలో నిలిచిన జీఎస్టీ కలెక్షన్లు
సమాచారం మేరకు, జీఎస్టీ వసూళ్లు రూ.2,113.54 కోట్లు తాకినందున ఈ ఆర్థిక సంవత్సరం సానుకూలంగానే ప్రారంభమైనట్లుగా భావిస్తున్నారు. కానీ రెండు నెలల్లో తగ్గుదల కనిపించింది. మే నెలలో జీఎస్టీ వసూళ్లు రూ.1,624.61 కోట్లు, జూన్ నెలలో రూ.1,644.77 కోట్లు. జూలై నెలలో మాత్రం రూ.1,962.77 కోట్లుగా ఉంది. మొత్తం జీఎస్టీ కలెక్షన్లు రూ.7,568.96 కోట్లు రావాల్సి ఉండగా రూ.7,345.69 కోట్లు వచ్చాయి.
ఏపీకి పరిహారం తీసుకోవాల్సిన పరిస్థితి...
ఆర్థిక వ్యవస్థ మందగమనంతో ఆంధ్రప్రదేశ్ జీఎస్టీ ఆదాయం భారీగా తగ్గిపోయింది. జీఎస్టీకి సంబంధించి ఇప్పటి వరకు పరిహారం అవసరం లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉంది. కానీ ఇప్పుడు కేంద్రం నుంచి పరిహారం తీసుకోవాల్సిన పరిస్థితులు. నిర్దేశించిన ఆదాయం లేకపోడవడమే ఇందుకు కారణం. జీస్టీ విధానం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ప్రతి నెల రాష్ట్ర జీఎస్టీ కేంద్రం నిర్ణయించిన టార్గెట్ దాటుతోంది. ఇప్పటి వరకు ఈ పరిహారం అవసరం రాలేదు.
రూ.500 కోట్లకు పైగా తగ్గుదల
ఏపీ జీఎస్టీ టార్గెట్ తగ్గితే ఆ మొత్తాన్ని కేంద్రం రెండు నెలలకోసారి ఇస్తుంది. ఇటీవల రెండు నెలల్లో జీఎస్టీ వసూళ్లు గణనీయంగా పడిపోయాయి. ఆ నెలలో వసూలు కావాల్సిన మొత్తం తగ్గింది. రూ.500 కోట్లకు పైగా తగ్గింది. అయితే ఆగస్ట్ ముగిసే సమయానికి కూడా ఏపీకి ఆ పరిహారం రాలేదు. కేంద్ర ప్రభుత్వ జీఎస్టీ ఆదాయం కూడా భారీగా క్షీణించడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. ఈ నెల 20న జీఎస్టీ కౌన్సెల్ సమావేశం అనంతరం పరిహారం రావొచ్చునని తెలుస్తోంది.
వసూళ్లు తగ్గడానికి కారణాలివే..
ప్రధానంగా ఆటోమొబైల్ రంగంలో తిరోగమనం కారణంగా వసూళ్లు తగ్గాయని, నిర్మాణ రంగం కూడా మందకోడిగా ఉందన్నారు. ఉక్కు, సిమెంట్ ధరల తగ్గుదల కనిపించినా జీఎస్టీ పెరుగుదలకు ఉపయోగపడలేదని చెబుతున్నారు. ఏపీలో ఇసుక సరఫరాను ఇప్పుడు పునరుద్ధరిస్తున్నందున నిర్మాణ పనులు ఊపందుకొని సిమెంట్, ఉక్కు అమ్మకాలు పెరుగుతాయని ఇది దోహదపడుతుందని చెబుతున్నారు. వ్యవసాయ కార్యకలాపాలు పెరిగితే ఆటోమొబైల్ అమ్మకాలు పెరుగుతాయని చెబుతున్నారు.
ఈ ఏడాది టార్గెట్ రూ.22,715 కోట్లు
ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం రూ.22,715.88 కోట్ల వసూళ్లను టార్గెట్గా పెట్టుకుంది. పరిస్థితి ఇలాగే ఉంటే టార్గెట్ రీచ్ కావడం కష్టమని భావిస్తున్నారు. మరోవైపు, పెట్రోల్, డీజిల్ లీటర్ పైన వ్యాట్ కోల్పోవడంతో ఏడాదికి రూ.1000 నుంచి రూ.1100 కోట్లు, వినియోగం తగ్గడంతో మరో రూ.600 నుంచి 800 కోట్ల ఆదాయం తగ్గుతోందని తెలుస్తోంది.