బానిస బతుకు: ఐటీ కంపెనీలపై కోర్టుకు హైదరాబాద్ ఉద్యోగులు, చట్టం ఏం చెబుతోంది?
హైదరాబాద్: సాఫ్టువేర్ కంపెనీలో ఉద్యోగం అంటే నెలకు ఐదంకెల నుంచి ఆరంకెల జీతం... మంచి వర్కింగ్ హవర్స్... వారానికి రెండు రోజులు సెలవు... అవసరమైనప్పుడు లీవ్.. అనుకుంటున్నారా? అయితే మీరు తప్పులో కాలేసినట్లే. అయితే ఇది అన్ని కంపెనీల్లో కాదు.. కొన్ని కంపెనీల్లో పేరుకే సాఫ్టువేర్ ఉద్యోగం.. కానీ ఎక్కువ పని గంటలతో పాటు లీవ్ పాలసీ పైన అసంతృప్తులు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని ఐటీ కంపెనీల్లో పని భారంపై ఉద్యోగులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఉద్యోగాల పేరుతో బానిసల్లా పది నుంచి 12 గంటల పాటు పని చేయించుకుంటున్నారని, సెలవులు కూడా సరిగ్గా ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు.
రూ.200/డే ఇన్వెస్ట్ చేస్తే 15 ఏళ్లలో రూ.21 లక్షలు!!
వివిధ కంపెనీలపై హైకోర్టులో పిల్
ఈ మేరకు పలు కంపెనీలకు చెందిన ముగ్గురు ఉద్యోగులు, ఫోరం అగైనెస్ట్ కరప్షన్ అనే సంస్థ కార్యకర్తలతో కలిసి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై నాలుగు వారాల్లో సమాధానం చెప్పాలని హైకోర్టు సంబంధిత కంపెనీలని ఆదేశించింది. పిల్లో పేర్కొన్న మూడు కంపెనీలు నిర్ణీత సమయంలోగా సమాధానం ఇచ్చేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఐటీ కంపెనీల దోపిడీ నుంచి ఉద్యోగులను కాపాడి, వారి స్థితిగతులను మెరుగుపరిచేందుకే ఈ పిల్ ఫైల్ చేసినట్లు ఫోరం అగైనెస్ట్ కరప్షన్ ప్రెసిడెంట్ విజయ్ గోపాల్ చెప్పారు.
4 వారాల్లో స్పందించాలని ఆదేశం
ఇలా కంపెనీలపై పిల్ దాఖలు చేయడం ఇండియన్ ఐటీ ఇండస్ట్రీలో ఓ ల్యాండ్మార్క్ అంశం. ఎక్కువ వర్కింగ్ హవర్స్, సరిగా లేని సెలవులు, ఇన్సెంటివ్స్ లేకపోవడం వంటి అంశాలపై పిల్ దాఖలు చేసారు. ఈ అంశంపై నాలుగు వారాల్లో స్పందించాలని కోర్టు ఆదేశాలు జారీ చేయడం ఆసక్తికరం. ఈ పిల్ దాఖలు చేసింది హైదరాబాద్ ఐటీ ఉద్యోగులు.
వైట్ కాలర్ స్లేవరీ
ఉద్యోగం పేరుతో పలు టెక్ కంపెనీలు వైట్ కాలర్ స్లేవరీకి పాల్పడుతున్నాయని వారు ఆరోపిస్తున్నారు. ఈ పిల్ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఐటీ ఉద్యోగుల స్థితిగతులు మెరుగుపరిచేందుకు, వారిపై అతి వర్క్ భారం ఉండకుండా చేసే ఉద్దేశ్యంలో భాగంగా దీనిని దాఖలు చేసినట్లు విజయ్ గోపాల్ చెప్పారు.
సెలవులు కూడా ఇవ్వడం లేదు
చాలామంది ఉద్యోగులు ఎలాంటి అదనపు వేతనం లేకుండా 10 గంటల వరకు పని చేస్తున్నారని, ప్రతిరోజు ప్రయాణంలోనే నాలుగైదు గంటలు గడపాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని, సమయానికి సెలవులు కూడా ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు.
కారణం ఇదేనా...
ఖర్చుల తగ్గింపు పేరుతో ఓ స్థానిక ఐటీ కంపెనీ గత నాలుగు నెలల్లో వేలాది మంది ఉద్యోగులను తొలగించింది. దీంతో ఆయా ప్రాజెక్టులపై పని చేసే ఉద్యోగులు రోజుకు పది నుంచి పన్నెండు గంటలు పని చేయాల్సి వస్తోందట. కొంతమంది ఉద్యోగులు రోజుకు పదిహేను గంటలు కూడా పని చేసే వారు ఉన్నారట.
అసలు 'లా' ఏం చెబుతోంది?
తెలంగాణ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1998 ప్రకారం...
- రోజుకు 8 గంటలు లేదా వారానికి 48 గంటల కంటే ఉద్యోగులు ఎక్కువగా పని చేయాలని అడగరాదు.
- వారానికి 6 గంటలు మరియు ఏడాదికి 24 గంటలు మాత్రమే ఓవర్ టైమ్ ఇంపోజ్ చేయవచ్చు.
- ప్రతి ఏడాదిలో ఓ ఉద్యోగికి 15 రోజుల పెయిడ్ లీవ్స్, 12 రోజుల క్యాజువల్ లీవ్స్, 12 రోజుల సిక్ లీవ్స్ ఇవ్వాలి.
- అయితే ఐటీ కంపెనీలను ప్రోత్సహించే ఉద్దేశ్యంతో 2002లో నాటి రాష్ట్ర ప్రభుత్వం ఐటీ కంపెనీలకు ఈ నిబంధనల నుంచి మినహాయింపు ఇచ్చింది. దీంతో కొన్ని ఐటీ కంపెనీలు వీటిని ఉపయోగించుకొని ఉద్యోగుల హక్కులను కాలరాస్తున్నాయని పిటిషనర్లు ఆరోపిస్తున్నారు. దీనిని రద్దు చేయాలని కోరుతున్నారు.
- ఈ ఐటీ చట్టాన్ని 2002 నుంచి పొడిగిస్తూ వస్తున్నారు. చివరిసారి 2019లో మరో రెండేళ్లు పొడిగించారు.
- కొన్ని నిబంధనల విషయంలో ఐటీ కంపెనీలు చట్టాలను బ్రేక్ చేస్తే ప్రభుత్వం రూ.100 ఫైన్ వేయవచ్చు.