బంగారం రూ.41,000, వెండి రూ.50,000: నేడు స్వల్పంగా తగ్గిన ధర
న్యూఢిల్లీ: బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. అమెరికాతో చర్చలకు సిద్ధమని చైనా ప్రకటన చేయడం, అంతర్జాతీయంగా మార్కెట్లు కాస్త కోలుకుంటుండటంతో పసిడి ధరల్లో తగ్గుదల కొద్దిగా కనిపించింది. అంతర్జాతీయంగా స్పాట్ గోల్డ్ 0.5 శాతం తగ్గింది. స్పాట్ గోల్డ్ ఔన్స్కు 1,544.66 డాలర్లుగా ఉంది. బుధవారం ఈ ధర 1,557 డాలర్లుగా ఉంది. 2013 నుంచి అత్యధికం ఇదే కావడం గమనార్హం.
'ఆంధ్రా బ్యాంకు'పై జగన్ కీలక నిర్ణయం, డ్రైవర్లకు గుడ్న్యూస్
బంగారం, వెండి తగ్గుముఖం
భారత్లోను బంగారం, వెండి ధరలు అతి స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. అహ్మదాబాద్లో స్పాట్ బంగారం పది గ్రాముల ధర రూ.39011, గోల్డ్ ఫ్యూచర్ ధర రూ.39496గా ఉంది. గురువారం ఉదయం గం.11.30 సమయంలో ఎంసీఎక్స్లో బంగారం ధర రూ.39,470గా ఉంది. కాగా, బుధవారం కిలో వెండి ధర రూ.51,489కు చేరుకున్న విషయం తెలిసిందే.
తెలుగు రాష్ట్రాల్లో ఎంత తగ్గిందంటే
హైదరాబాదులో 10 గ్రాముల 24 గ్యారెట్లు (99.9 శాతం స్వచ్ఛత) కలిగిన బంగారం రూ.40,920గా ఉంది. విజయవాడలో రూ. 40,920, చెన్నైలో రూ.40,920, ముంబైలో రూ.39,200, ఢిల్లీలో రూ.39,450, బెంగళూరులో రూ.40,150గా ఉంది. కొన్ని నగరాల్లో రూ.41వేలకు సమీపంలో ఉంది. నిన్నటి వరకు భారీగా పెరిగిన ధరలు.. నేడు అతి స్వల్పంగా మాత్రమే తగ్గాయి. ఉదాహరణకు హైదరాబాదులో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం నిన్న రూ.41,070గా ఉంటే నేడు రూ.40,920వద్ద ఉంది. విజయవాడలోను అంతే తగ్గింది.
సురక్షిత పెట్టుబడులు
బంగారం, వెండి ధరలు నిన్నటి వరకు పరుగులు పెట్టాయి. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఛాయలు, అమెరికా - చైనా ట్రేడ్ వార్ భయాలు, స్టాక్ మార్కెట్లు నష్టాల నేపథ్యంలో అందరూ సేఫ్ సైడ్గా బంగారం వైపు పెట్టుబడులు తరలించారు. బంగారం వంటి లోహాలను సురక్షిత పెట్టుబడులుగా భావిస్తారు. బంగారంతో పాటు వెండి ధర కూడా భారీగా పెరిగింది.
భారీగా పెరిగిన వెండి
బుధవారం దేశ రాజధాని ఢిల్లీలో వెండి ధర ఏకంగా రూ.2,070 పెరిగింది. దీంతో కిలో వెండి ధర రూ.50,125కి చేరుకుంది. మంగళవారం ఇది రూ.48,055గా ఉంది. గత రెండు నెలల కాలంలో బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయి. ఈ కాలంలో వెండి ధర రూ.12 వేల నుంచి రూ.15 వేల వరకు పెరిగింది. న్యూయార్క్లో ఔన్స్ వెండి విలువ 19.27 డాలర్లుగా నమోదైంది.