డ్రోన్ల పని అయిపోయిందా? మూతపడుతున్న స్టార్టప్ కంపెనీలు
డ్రోన్లు .... ఇటీవలి కాలంలో పెను సంచనలం. టెక్నాలిజీ లో మరో కొత్త తరంగం. రక్షణ, మిలిటరీ, ఫోటోగ్రఫీ, డెలివరీ, వ్యవసాయం, ఏరియల్ సర్వేలన్సు, సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ లో విరివిగా వాడుతున్న డ్రోన్లు ... ఇకపై అన్ని రంగాల్లోనూ వాడుకలోకి వస్తాయని భావిస్తున్నారు. ముఖ్యంగా పరిశ్రమల్లో వీటి వినియోగం అధికం అవుతుందని అంచనా వేశారు. కానీ ఏడాది కాలంగా డ్రోన్లు వేదికగా ఏర్పాటైన స్టార్టుప్ కంపెనీలు భారీ సంఖ్యలో మూత పడుతున్నాయి. ఈ ట్రెండ్ అమెరికా లో అధికంగా కనిపిస్తోందని ప్రముఖ వార్త సంస్థ బ్లూమ్ బెర్గ్ పేర్కొంది. రెండేళ్ల కాలంలో ఏకంగా వంద వరకు స్టార్టుప్ కంపెనీలు మూత పడటం లేదా... వేరే కంపెనీలకు విక్రయించడం జరిగిందట. దాదాపు అన్ని కంపెనీలు నష్టాల్లోనే ఉండటం ఈ రంగాన్ని ఆందోళనకు గురి చేస్తోందట. ఇప్పటి వరకు వెంచర్ కాపిటల్ సంస్థల నుంచి భారీగా నిధులను రాబట్టిన కంపెనీలు సైతం చేతులెత్తేసి షెట్టర్లు క్లోజ్ చేస్తున్నాయట.
3 బిలియన్ డాలర్ల పెట్టుబడులు...
ప్రపంచం లోనే డ్రోన్ టెక్నాలజీ లో అమెరికా ముందు ఉంది. అటు డ్రోన్ హార్డ్ వేర్, ఇటు డ్రోన్ సాఫ్ట్ వేర్ రంగాల్లోనో యూఎస్ టాప్. డేటా అనలిటిక్స్ వంటి కొత్త పరిజ్ఞానం జోడించి రైతుల నుంచి పరిశ్రమల వరకు అందరినీ ఆకర్షించిన డ్రోన్ కంపెనీలు.... ఆదాయం సముపార్జించుకోవటం లో మాత్రం చతికిల పడుతున్నాయి. లాభాలు అన్న మాటే ఎరుగటం లేదని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. అందుకే, ఈ రంగం లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రైవేట్ ఈక్విటీ, వెంచర్ కాపిటల్ సంస్థలు ముందుకు రావటం లేదు. దశాబ్ద కాలంలో ఒక్క అమెరికా లోని డ్రోన్ కంపెనీల్లోకి సుమారు 3 బిలియన్ డాలర్లు (దాదాపు రూ 21,000 కోట్లు ) పెట్టుబడులు సమకూరాయట. కానీ ఏ ఒక్క కంపెనీ కూడా ఆకర్షణీయంగా లేకపోవటం పెట్టుబడిదారులను భయాందోళనకు గురిచేస్తోంది. అందుకే ఇటువైపు చూసేందుకు పెట్టుబడిదారులు ఇష్టపడటం లేదట.
ఎందుకు ఇలా జరుగుతోంది....
ప్రపంచాన్ని అబ్బురపరిచేలా కనిపించిన డ్రోన్ టెక్నాలజీ .... ఎందుకు నిలదొక్కుకోలేక పోతోందని విశ్లేషకులు పరిశోధన చేస్తున్నారు. అయితే, ఇందులో మార్కెట్ పరిమాణం పెరగక ముందే ఎక్కువ సంఖ్యలో కంపెనీలు కార్యకలాపాలు ప్రారంభించటమే మొదటి ఇబ్బందిగా గుర్తించారు. పైగా ప్రభుత్వ నిబంధనలు కూడా కఠినంగా ఉండటం మరో కారణంగా కనిపిస్తోంది. ఏ రంగంలోనూ పూర్తి స్థాయిలో డ్రోన్ లను అనుమతించటం లేదు. కాబట్టి బంగారు భవిష్యత్ ఉందని భావించి ఇందులోకి ప్రవేశించిన కంపెనీలకు సరైన మార్కెట్ లభించటం లేదు. అందుకే లాభాల మాట అటుంచి... అసలు ఆదాయం సమకూరటమే పెద్ద సవాలుగా మారిపోయింది. అందుకే పెద్ద సంఖ్యలో కంపెనీలు మూత పడుతున్నాయి. లేదా భారీగా ఉద్యోగులను తొలగించేస్తున్నై.
పెద్ద వాళ్ళకే మేలు...
ఇదిలా ఉండగా... డ్రోన్ టెక్నాలజీ లో పెద్ద కంపెనీలకు మాత్రం ఎలాంటి ఇబ్బందీ లేదట. వెరిజోన్, డ్యూపాంట్ వంటి పరిశోధన కంపెనీలు అధిక పెట్టుబడులు పెట్టగలవు. అలాగే లాభాలు వచ్చేంత వరకు ఓపిగ్గా వేచిచూడగలవు అని నిపుణులు చెబుతున్నారు. అందుకే, బడా కంపెనీలు డ్రోన్ టెక్నాలజీ కంపెనీలను కొనుగోలు చేస్తున్నాయట. ముందు ముందు వచ్చే అవకాశాలను ఈ పెద్ద కంపెనీలు తమకు అనుకూలంగా మార్చుకోగలవని అంటున్నారు.
భారత్ లో పరిస్థితి ఏమిటి?
నిజానికి భారత్ లో డ్రోన్లను కేవలం సినిమా షూటింగులు, పెళ్లిళ్లు, పేరంటాల ఫోటోగ్రఫీ కోసం అధికంగా వినియోగిస్తున్నారు. మన దేశం లో సివిల్ ఏవియేషన్ శాఖ చాలా రంగాల్లో డ్రోన్ల వాడకంపై పరిమితులను విధించింది. కాబట్టి చాల రంగాల్లో ప్రస్తుతం డ్రోన్ల ను శిక్షణ కోసం మాత్రమే వాడుతున్నారు. కొన్ని పరిశ్రమల్లో అతి తక్కువ మోతాదు లో సొంత అవసరాల కోసం వినియోగిస్తున్నారు. కేవలం డ్రోన్ టెక్నాలజీ ఆధారిత స్టార్టుప్ కంపెనీల సంఖ్య మన దగ్గర చాల తక్కువే. అందునా... ఈ రంగంలో ఏంజెల్ ఇన్వెస్ట్మెంట్లు, ప్రైవేట్ ఈక్విటీ, వెంచర్ కాపిటల్ పెట్టుబడులు వచ్చిన దాఖలా లేవు. అందుకని దీని ప్రభావం మనపై స్వల్పం అని చెప్పవచ్చు. కానీ భవిష్యత్లో అన్ని రంగాల్లోనూ డ్రోన్ లను వినియోగించాల్సి వస్తే... మనం ఇతర దేశాలపైన, విదేశీ కంపెనీలపై ఆధారపడాల్సి వస్తుంది. దాంతో మేలు కంటే కీడే ఎక్కువ జరగొచ్చు అని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఏం జరుగుతుందో చూద్దాం!