మాంద్యంలేదు, ఆటో సేల్స్ తగ్గడానికి ఉబెర్-ఓలా కారణమే!?
న్యూఢిల్లీ: అమెరికా - చైనా వాణిజ్యు యుద్ధం సహా వివిధ కారణాలతో ప్రపంచం మొత్తం ఆర్థికమాంద్యం భయాలు కమ్ముకున్నాయి. ఈ భయం భారత మార్కెట్లకు కూడా పట్టుకున్నాయి. అయితే మిగతా దేశాలతో పోలిస్తే భారత్ పరిస్థితి ఒకింత మేలు అంటున్నారు. మన దేశంలో ఆర్థిక మాంద్యం లేదని, కేవలం కొన్ని రంగాల్లో డిమాండ్ మాత్రమే తగ్గిందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) చైర్మన్ రజనీష్ కుమార్ అన్నారు.
ఫిక్స్డ్ డిపాజిట్స్పై SBI వడ్డీ రేటు తగ్గింపు: FD రేట్లు
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ భాగం
బ్యాంకుల వద్ద అవసరమైన లిక్విడిటీ ఉందని రజనీష్ కుమార్ చెప్పారు. భారత్ కూడా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భాగమని, కాబట్టి అంతర్జాతీయ పరిణామాలు భారత్ పైన ఉంటాయని అభిప్రాయపడ్డారు. ఆ ప్రభావం మనంపై ఉండదనుకోలేమన్నారు. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవార నాడు ఆర్థిక వ్యవస్థ బలోపేతం కోసం 32 మెజర్స్ ప్రకటించారన్నారు. ఇవి ప్రయోజకరమన్నారు.
లిక్విడిటీ సమస్య లేదు
నిర్మలా సీతారామన్ ప్రకటించిన మెజర్స్ బ్యాంకింగ్ వ్యవస్థతో పాటు ట్యాక్స్ పరంగా పెద్ద ఊరట అని రజనీష్ కుమార్ చెప్పారు. ఈ చర్యలు ఎంతో కీలకమైనవిగా భావిస్తున్నట్లు చెప్పారు. క్రెడిట్ ఫ్లో సమస్యలు, సవాళ్లు పరిష్కరిస్తామని, మరిన్ని చర్యలు తీసుకుంటామని ఆర్థికమంత్రి ప్రకటించారన్నారు. ఇవి ఆయా రంగాలకు సంబంధించినవి కావొచ్చని చెప్పారు. ఎస్బీఐ వంటి బ్యాంకులకు లిక్విడిటీ సమస్య లేదన్నారు. క్రెడిట్ ఫ్లో అవసరమని రజనీష్ కుమార్ చెప్పారు.
ఆటో రంగం కుదేలు కావడానికి...
ఆటో రంగం కుదేలవడానికి కూడా రజనీష్ కుమార్ ఓ కారణం చెప్పారు. ప్రస్తుతం అగ్రిగేడర్ మోడల్ ట్రెండ్ నడుస్తోందని చెప్పారు. ప్రజలు కూడా సొంతగా కార్లు, బైక్స్ కొనడానికి బదులు ఓలా, ఉబెర్ వంటి ప్రయాణ సాధనాలను ఉపయోగిస్తున్నారని అభిప్రాయపడ్డారు. కార్లు, వాహనాలు తమకు సొంతగా ఉండాలని కోరుకున్న ప్రజల్లో కొంత మార్పు వస్తున్నట్లుగా ఉందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి అని, భారతదేశం ఇందుకు మినహాయింపు కాదన్నారు.
ఇది ఆర్థిక మాంద్యం కాదు...
పలు పరిశ్రమల కోరికల చిట్టా పరిష్కారమైందని, త్వరలో క్రెడిట్ ప్రవాహం చూస్తామన్నారు. ప్రపంచవ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం భయం కమ్ముకున్నదనే వాదనలు ఉన్నాయి. దీనిపై రజనీష్ కుమార్ స్పందించారు. ప్రస్తుతం మనం చూస్తోందని ఆర్థిక మాంద్యం కాదని, కొన్ని రంగాల్లో సేల్స్ మాత్రమే తగ్గాయని, ఇందులో ఆటోరంగంలో ఎక్కువగా తగ్గిపోయాయని చెప్పారు.
ఆటో సేల్స్ ప్రపంచవ్యాప్తంగా తగ్గిపోయాయి..
ఆటో సెక్టార్ సేల్స్ ప్రపంచవ్యాప్తంగా తగ్గిపోయాయని రజనీష్ కుమార్ చెప్పారు. భారతదేశంలోని యువత ఆకాంక్షల్లో మార్పు లేదన్నారు. మన దేశంలో వృద్ధి బాగుందని, కానీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మనమూ ఓ భాగమని చెప్పారు. గ్లోబల్ ట్రెండ్ ప్రభావం భారత్ పైన ఉంటుందని చెప్పారు. అలాగే, రుతుపవనాలు కూడా సానుకూల ప్రభావాన్ని చూపుతాయని చెప్పారు.
రెండో భాగంలో ఆర్థిక ఉత్సాహం...
ప్రభుత్వ విధానాలు, రానున్న పండుగల నేపథ్యంలో డిమాండ్ పెరుగుతుందని రజనీష్ కుమార్ చెప్పారు. ఈ ఏడాది రెండో భాగం ఆర్థిక వ్యవస్థకు, బ్యాంకింగ్కు సానుకూలమన్నారు. అన్ని పేమెంట్స్ క్లియర్ చేస్తామని ప్రభుత్వం చెప్పిందని, క్రెడిట్ ప్లో పెరుగుతుందన్నారు. ప్రస్తుతం ప్రభుత్వపరంగా ఉత్సాహం కనిపిస్తోందని, అలాగే ప్రైవేటు సెక్టార్ పెట్టుబడులు కూడా పెరుగుతాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. గత ఏడాదితో పోలిస్తే అసోంలో ఎన్పీయేలు పెరిగాయన్నారు.