ఎంతమార్పు... జగన్ వచ్చాక 'అమరావతి' ధర తగ్గిందా, ఏపీ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతుందా?
అమరావతి: అంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మార్పుపై జోరుగా చర్చ సాగింది. పోలవర్ రివర్స్ టెండరింగ్, పీపీఏల ఒప్పందాల సమీక్ష వంటి అంశాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వేడిని రాజేస్తున్నాయి. అధికారంలోకి వచ్చి మూడు నెలలు కూడా గడవకముందే జగన్ ప్రభుత్వం తీరుతో అమరావతి, పోలవరం, పీపీఏలపై ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నాలుగు రోజుల క్రితం మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన రాజధాని వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. ప్రస్తుత పరిస్థితుల్లో రాజధానిని మార్చే ప్రయత్నం చేయరని నిపుణులు అంటున్నారు. బొత్స వ్యాఖ్యలు తీవ్ర ప్రభావం చూపాయి. దీంతో జగన్ ప్రభుత్వం నష్టనివారణ చర్యలు చేపట్టింది. బొత్స వ్యాఖ్యలతో జగన్కు సంబంధం లేదనే అంశాన్ని తెరపైకి తెచ్చాయి. 'రాజధాని'పై బొత్స ప్రకటన వైసీపీని డిఫెన్స్లోకి నెట్టింది. 33వేల ఎకరాలు త్యాగం చేసిన రైతులతో ప్రభుత్వాలు ఆటలాడుకుంటున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి.
అమరావతి కలకలం: జగన్ రాజధానిని మార్చే సాహసం ఎందుకు చేయరు?
భూములిచ్చాం.. రాజధానిని ఎలా మారుస్తారు
బొత్స వ్యాఖ్యలపై వైసీపీ, ప్రభుత్వం నష్టనివారణ చర్యలు చేపడుతోంది. కానీ ఆయన వ్యాఖ్యల కారణంగా అమరావతి ప్రాంతంలో రియల్ ఎస్టేట్ ధరలు భారీగా పడిపోయాయట. రాజధాని కోసమని తాము భూములు ఇచ్చామని, ఇప్పుడు ఎలా మారుస్తారని రైతులు ప్రశ్నిస్తున్నారట. ఏ పార్టీ ప్రభుత్వం వచ్చినా రైతులకు ఇచ్చిన హామీలను మాత్రం మరువరాదని చెబుతున్నారు.
భారీ ధర పలికిన రాజధాని భూములు
రాజధాని కోసం రైతులు 33వేల ఎకరాలు ఇచ్చారు. ఇళ్లు, భూములు కోల్పోయిన వారికి రాజధాని ప్రాంతంలోనే పునరావాసం, నష్టపరిహారం ఇచ్చేందుకు గత ప్రభుత్వం నిర్ణయించింది. అమరావతి పనులు సాగుతున్నాయి. భూముల ధరలు ఏకంగా లక్షల నుంచి కోట్లకు పెరిగింది.
వైసీపీ ప్రభుత్వం వచ్చాక ధరలు తగ్గాయా...
వైసీపీ ప్రభుత్వం వచ్చిన గత నాలుగు నెలల్లో రాజధానిలో భూముల ధరలు తగ్గుతున్నాయని అంటున్నారు. రాజధాని ప్రాంతానికి చెందిన ఓ బిల్డర్ ఓ ఇంగ్లీష్ పత్రికతో మాట్లాడుతూ... 4 నెలలుగా ఇక్కడ ధరలు 40 శాతం నుంచి 50 శాతం పడిపోయాయన్నారు. ఈ తగ్గుదల ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న కన్స్ట్రక్టవిటీని బట్టి ఒక్కో గ్రామంలో ఒక్కో విధంగా ఉందన్నారు. కొన్ని ప్రాంతాల్లో స్క్వేర్ యార్డ్ ధర రూ.25,000 నుంచి రూ.15,000కు పడిపోయిందని చెప్పారు.
రాజధాని మార్చనప్పటికీ...
చంద్రబాబు హయాంలో అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దుతానని ప్రకటించారు. అయితే ఇప్పుడు జగన్ రాజధానిని మార్చే సాహసం చేయలేకపోయినప్పటికీ పూర్తిగా అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తారని, అమరావతిని కేవలం పరిపాలనా రాజధానిగానే చేస్తారని, టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యత ఇవ్వరనే వాదనలు వినిపిస్తున్నాయి. రాజధానిని మార్చనప్పటికీ ప్రభుత్వం ఇచ్చే ప్రాధాన్యత దృష్ట్యా కూడా ధరలు తగ్గే అవకాశాలున్నాయని అంటున్నారు. రాజధానిని మార్చమని జగన్ కూడా ఎన్నికలకు ముందు చెప్పారు.
అమరావతి అభివృద్ధి ప్రధానంగా రాజకీయం
గత టీడీపీ ప్రభుత్వం హయాంలో తీసుకున్న పలు నిర్ణయాలను వైసీపీ ప్రభుత్వం సమీక్షిస్తోంది. మిగతా అంశాల కంటే రాజధాని అంశం చాలా సున్నితమైన, తీవ్రమైన అంశంగా చెబుతున్నారు. పీపీఏలను సమీక్షించడం వంటి నిర్ణయాలు పెట్టుబడులపరంగా ఏపీకి నష్టం చేసేవి అని ఇప్పటికే హెచ్చరికలు వచ్చాయి. 57వేల కోట్ల పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండర్ పైన సస్పెన్స్ కొనసాగుతోంది. గత అయిదేళ్లలో ఏపీ అభివృద్ధి ప్రధానంగా అమరావతి చుట్టూ తిరిగింది.
పెట్టుబడులకు ఇబ్బంది లేదు కానీ...
అమరావతిని మూడు దశల్లో అభివృద్ధి చేయాలని, దీనికి రూ.లక్షల కోట్లు అవసరమని చంద్రబాబు ప్రభుత్వం భావించింది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటన సమయంలో దాదాపు రూ.38వేల కోట్ల పనులు జరుగుతున్నాయి. కొత్త ప్రభుత్వం వచ్చాక గత ప్రభుత్వ నిర్ణయాలపై సమీక్ష నేపథ్యంలో ఇప్పటికిప్పుడు పెట్టుబడులకు వచ్చే ఇబ్బంది ఏమీ లేదని, కానీ ఇన్వెస్టర్లకు ఓ రకమైన ఆందోళన కలిగించే అంశమనే వాదనలు వినిపిస్తున్నాయి. రివర్స్ టెండరింగ్, రాజధానిపై లేనిపోని అపోహలు ఇన్వెస్టర్లు విశ్వాసం కోల్పోయేందుకు కారణం అవుతాయంటున్నారు. ప్రభుత్వం తీరు ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే విధంగా ఉండవద్దని టీడీపీ నేతలు అంటున్నారు.
ఏపీ వృద్ధి రేటుపై...
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ వృద్ధి రేటు 10.5 శాతంతో ముందుకు సాగుతోందని, వైసీపీ ప్రభుత్వం వచ్చాక పనులు నిలిచిపోవడం వల్ల వృద్ధి రేటుపై ప్రభావం పడే అవకాశముందని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఓ ఇంగ్లీష్ పత్రికతో అన్నారు. తాము సరైన నిర్ణయాలు, పారదర్శకంగా తీసుకుంటామని, తాము ఏపీకి ఎక్కువ పెట్టుబడులు ఆకర్షిస్తామని వైసీపీ నేత అంబటి రాంబాబు అన్నారు.