ఏ ధర ఉన్నా, ఏమైనా పర్లేదు బంగారం కొనండి, ఎందుకంటే...
న్యూఢిల్లీ: బంగారం ధరలు పెరుగుతున్నాయి. దేశ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.38,770కి చేరుకుంది. అంతర్జాతీయ పరిణామాలు, చైనా - అమెరికా ట్రేడ్ వార్, రూపాయి బలహీనపడటం, నగల వ్యాపారుల నుంచి డిమాండ్ నేపథ్యంలో బంగారం మంగళవారం రూ.200 పెరిగి ఆల్ టైమ్ రికార్డ్ హైకి చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం ఔన్స్ బంగారం ధర 1,500 డాలర్ల వద్ద ఉంది. మరోవైపు, వెండి ధర రూ.1,100 తగ్గి రూ.43,900కు చేరుకుంది.
రూ.5 బిస్కట్ పాకెట్ కూడా కొనలేకపోతున్నారు
పైపైకి.. బంగారం
భారతదేశంలో ఆభరణాల కోసం బంగారం వినియోగం ఎక్కువ, అలాగే ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో పెట్టుబడుల కోసం కూడా పసిడి వైపే చూస్తున్నారు. దీంతో దీని ధర రోజు రోజుకు పెరుగుతోంది. ఇన్వెస్ట్మెంట్ గురు మార్క్ మోబియస్ కూడా ఏమైనా ఫరవాలేదు... బంగారం కొనుగోలు చేయండని కూడా సూచించడం గమనార్హం. భవిష్యత్తులోను దీని ధర పెరుగుతుందని, ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు మోనిటరీ పాలసీలను సడలిస్తుండటం, క్రిప్టో కరెన్సీల సంఖ్య పెరుగుతుండటం వంటివి బంగారం ధరను పెంచుతున్నాయని తెలిపారు.
దీర్ఘకాలంలో ఢోకా లేదు
బంగారం ఏ స్థాయిలో ఉన్న కొనుగోలు చేయవచ్చునని మార్క్ మోబియస్ సూచించారు. మొత్తం ఇన్వెస్ట్మెంట్లలో 10% పసిడిపై పెట్టాలని సూచించారు. దీర్ఘకాలంలో బంగారంపై పెట్టుబడి పెడితే ఎలాంటి ఢోకా లేదని, దీని ధర పెరుగుతూనే ఉంటుందని పేర్కొన్నారు. దీర్ఘకాల పెట్టుబడిగా బంగారాన్ని కొనుగోలు చేయవచ్చునని, ఎలాంటి ఆందోళన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. మోబియస్ క్యాపిటల్ పార్ట్నర్ వ్యవస్థాపకులు మోబియస్. ఫ్రాంక్లిన్ టెంపుట్టన్ ఇన్వెస్ట్మెంట్స్ లో మూడు దశాబ్దాల పాటు పని చేసిన తర్వాత కంపెనీని ఏర్పాటు చేశారు.
కేంద్ర బ్యాంకులు పాలసీ.. బంగారాన్ని కూడబెట్టడమే మంచిది
ఇప్పటికే ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు దశాబ్ద కాలంలో తొలిసారి గత నెలలో కీలక వడ్డీ రేట్లు తగ్గించింది. చైనా, ఇతర దేశాలు కూడా అదే మార్గంలో వెళ్లే అవకాశముంది. ఈ పరిణామాలు బంగారం ధర పెరిగేందుకు కారణం అవుతున్నాయి. ప్రముఖ కేంద్ర బ్యాంకులు ద్రవ్య విధానాల నేపథ్యంలో బంగారాన్ని కూడబెట్టుకోవడం దీర్ఘకాలికంగా ప్రతిఫలం ఇస్తుందని చెబుతన్నారు.
బంగారం వైపు ఇన్వెస్టర్ల చూపు..
బంగారం ఆధారిత ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ వైపు ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతున్నారు. దీంతో ఆర్థిక సంక్షోభ ఆందోళనలు కనిపిస్తున్నాయి. కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గిస్తున్నందున ఇన్వెస్ట్మెంట్లలో పది శాతాన్ని బంగారానికి కేటాయించాలని పేర్కొన్నారు. కాగా, బంగారం ధరలు రికార్డ్ హైకి చేరుకుంటున్నాయి. బంగారం ధరలు పెరుగుతుండటంతో కొనాలా వద్దా అనే డైలమాలో చాలామంది ఉన్నారు. అయితే దీర్ఘకాల ఆలోచనతో బంగారంపై ఇన్వెస్ట్ చేస్తే మాత్రం మంచిదని చెబుతున్నారు.