జగన్ మార్క్: ఏపీలో పెట్టుబడులు పెట్టాలా.. ఇక చాలా సులభం!
డల్లాస్: ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఎన్నారైలు ముందుకు రావాలని, ఇందుకోసం ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఈ పోర్టల్ సీఎం కార్యాలయానికి అనుసంధానం చేస్తామని, అందులో వచ్చే అప్లికేషన్స్ పరిష్కారం కోసం ప్రత్యేక అధికారిని కూడా నియమిస్తామన్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని భావించినా లేదా గ్రామాలను దత్తత తీసుకొని సాయం చేయాలనుకున్నా అందులో ప్రతిపాదిస్తే చాలని, అధికారులే మిమ్మల్ని సంప్రదించి, అవసరమైన సహకారం అందిస్తారన్నారు.
నోట్లరద్దు టైమ్ అక్రమార్కులకు షాక్, ట్రేస్ చేసేందుకు చెక్లి
ఏడాదికి రెండుసార్లు రండి...
అమెరికాలోని ఎన్నారైలు ఏడాదికి ఒకటి రెండుసార్లైనా కుటుంబంతో సహా ఏపీకి రావాలని జగన్ విజ్ఞప్తి చేశారు. అమెరికన్లను మించి ఎదుగుతున్న మిమ్మల్ని చూసి గర్వపడుతున్నానని చెప్పారు. ఏపీలో ప్రతి ఒక్కరికి ఇల్లు, మద్యపాన నిషేధం.. ఏపీని ఆనందరాష్ట్రంగా మార్చడం తన కల అన్నారు. గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ కొనుగోలు ఒప్పందాల కారణంగా ప్రభుత్వంపై రూ.3వేల కోట్ల భారం పడిందని, అందుకే ఆ ఒప్పందాలను సమీక్షించాలని నిర్ణయించినట్లు చెప్పారు.
పెట్టుబడులకు ఇలా అవకాశాలు..
ఏపీకి 972 కిలో మీటర్ల సముద్ర తీరం ఉందని, నాలుగు ఓడ రేవులు, ఆరు ఎయిర్పోర్టులు ఉన్నాయని, రైలు మార్గం ఉందని జగన్ చెప్పారు. పెట్టుబడులతో ఏపీకి రావాలన్నారు. రానున్న అయిదేళ్లలో మరో ఐదు ఓడ రేవులు నిర్మిస్తామన్నారు. పెట్టుబడులకు సానుకూల వాతావరణం సృష్టిస్తున్నట్లు చెప్పారు. కరెంటును మన తక్కువ రేటుకు కొనుగోలు చేస్తే పరిశ్రమలకు కూడా తక్కువగే ఇవ్వగలుగుతామని, పారిశ్రామికవేత్తలను ఆకర్షించగలుగుతామన్నారు.
హైదరాబాద్ లాంటి నగరం లేదు..
రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ వంటి నగరం ఏపీకి లేకుండా పోయిందని, ఉద్యోగాల కోసం ఎక్కడకు వెళ్లాలో తెలియని పరిస్థితుల్లో మన పిల్లలు ఉన్నారని, అందుకే రెండు నెలల్లో లక్షలాది ఉద్యోగాలు ఇచ్చామని, 75 శాతం స్థానికులకే ఇచ్చేలా దేశంలో ఎక్కడా లేని విధంగా చట్టం తీసుకు వచ్చామని జగన్ చెప్పారు. ఎక్కడా అవినీతిలేకుండా పారదర్శకతతో ముందుకు సాగుతున్నామన్నారు. రూ.100 కోట్ల విలువ దాటే ఏ టెండర్ లేదా కాంట్రాక్ట్ అయినా ఓ జడ్జి దగ్గరకు పంపిస్తున్నామని, వారంలో వాటిని డొమైన్లో పెడతారన్నారు. ఎక్కడా లేనివిధంగా రివర్స్ టెండరింగ్ విధానా్నని తీసుకు వచ్చామన్నారు.
ప్రపంచబ్యాంకు ప్రతినిధులతో భేటీ
మరోవైపు, ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు, వివిధ కంపెనీలకు చెందిన ప్రతినిధులతో జగన్ భేటీ అయ్యారు. రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని కోరారు. అమెరికాలో భారత రాయబారి హర్షవర్ధన్ ముఖ్యమంత్రి జగన్కు విందు ఇచ్చారు. ఏపీలో వ్యాపారాలు, పెట్టుబడులకు అవకాశాలు ఉన్నాయని ఈ సందర్భంగా చెప్పారు.