భారత స్టాక్ మార్కెట్లు కొన్ని నెలలుగా అత్యంత ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. ముఖ్యంగా బీజేపీ నేతృత్వం లో రెండో సారి అఖండ మెజారిటీ తో ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి రిటైల్ ఇన్వెస్టర్లు ఏకంగా రూ 13 లక్షల కోట్లకు పైగా నష్టపోయ్యారు. ఇదే సమయంలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు భారీగా వారి పెట్టుబడులను వెనక్కి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో సెన్సెక్స్, నిఫ్టీ ఊగిసలాడుతున్నాయి. వాటి సాంప్రదాయ మద్దతు స్థాయిలను కోల్పోతూ రోజు రోజుకూ ఇన్వెస్టర్లను బెంబేలెత్తిస్తున్నాయి. పదుల సంఖ్యలో తప్ప మిగితా కంపెనీల షేర్లు నేల చూపులు చూస్తున్నాయి. కానీ ఈ బేర్ మార్కెట్ లోనూ పాజిటివ్ గా ముందుకు వెళ్లే ఇన్వెస్టర్లు కొందరే కనిపిస్తారు. అందులో ఒకరే... మోతిలాల్ ఓస్వాల్ ఎండీ రాందేవ్ అగ్రవాల్. ప్రతి బేర్ మార్కెట్ లోనూ బుల్ లా ఇన్వెస్ట్ చేస్తానని ఈటీ నౌ వార్త ఛానల్ కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో వెల్లడించారు. ఈ ఇంటర్వ్యూ నుంచి స్టాక్ మార్కెట్ ప్రియుల కోసం కొన్ని విషయాల స్వేచ్చానువాదమే ప్రస్తుత ఆర్టికల్.

బేర్ తర్వాత బుల్ ట్రెండ్ వస్తుంది..
స్టాక్ మార్కెట్ బ్రోకరేజ్ తో పాటు అనేక ఆర్థిక సేవలను అందించే మోతిలాల్ ఓస్వాల్ కంపెనీ వ్యవస్థాపకుల్లో ఒకరు, దానికి ఎండీ కూడా ఐన రాందేవ్ అగ్రవాల్ .... ఏ బేర్ మార్కెట్ కూడా చెడ్డది కాదని అభిప్రాయపడ్డారు. 40 ఏళ్ళ తన స్టాక్ మార్కెట్ ప్రస్థానంలో అనేక ఒడిదుడుకులు చూశానని.... ప్రతిసారీ మరో మంచి అవకాశమే లభించిందన్నారు. తాను మార్కెట్ రంగ ప్రవేశం చేసినప్పుడు 1987, 88, 89 వరుసగా మూడేళ్లు అత్యంత భయంకరమైన మార్కెట్ ను చూశామని, కానీ 1991-92 ప్రాంతంలో మార్కెట్ ఉరకలు వేసి ఇన్వెస్టర్లకు అనేక రేట్ల ప్రయోజనాన్ని అందించిందన్నారు. హర్షద్ మెహతా ప్రేరేపిత బుల్ రన్ అన్న ఆరోపణలు ఉన్నప్పటికీ... ఈ సమయంలో సెన్సెక్స్ ఏకంగా 600-700 పాయింట్ల స్థాయి నుంచి 4,500 పాయింట్ల స్థాయికి ఎగబాకిందని చెప్పారు. అందుకే దానిని మదర్ అఫ్ బుల్ బుల్ రన్స్ అని పేర్కొంటారని వివరించారు.

ప్రతికూల ధోరణి ఎక్కువైంది....
రోజు కు కనీసం 200 మంది వ్యాపారాలు, పెట్టుబడిదారులు, నిపుణులను కలిసే అలవాటున్న తనకు ... ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే... వాస్తవిక ఇబ్బందుల కంటే అధికంగా ప్రజల్లో ప్రతికూల ధోరణి నెలకొందనిపిస్తోందని రాందేవ్ తెలిపారు. ఇందుకు అయన ఒక ఉదాహరణ కూడా ఇచ్చారు. జబల్పూర్ లో ఒక వర్తకుడిని కుశల ప్రశ్నలు అడిగితే ... ఏమీ బాగా లేదు అని చెప్పాడు. కానీ.. ఆయన వ్యాపారం ఎలా సాగుతోందో అడిగితె మాత్రం వృద్ధి చెందుతోందని బదులిచ్చారు. వెంటనే... ఇతర వ్యాపారులకు ఇబ్బందులున్నాయని పేర్కొన్నారు. అంటే, ఆయన బాగున్నారు కానీ ఇతరులు ఇబ్బంది పడుతున్నారని భావిస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే అసలు మనం అనుకొంటునట్లు పరిస్థితులు ఉన్నాయా... లేదంటే కేవలం మన ఆలోచన దృక్పథం ఆలా ఉందా అని అనుమానం కలుగుతోంది. అందుకే, ఎవరికీ వారు బాగుంటే వ్యవస్థ కూడా బాగుండాల్సిందే కదా అన్నది రాందేవ్ ఆలోచన.

ఎంత తగ్గితే అంత పెరిగే ఛాన్స్...
సెన్సెక్స్, నిఫ్టీ లు ఎంతగా పతనం అయితే... అంతగా మళ్ళీ పెరిగే అవకాశం లభిస్తుందని రాందేవ్ విశ్వాసం వ్యక్తం చేసారు. అందుకే బేర్ మార్కెట్ లో తాను పెట్టుబడులు పెడుతుంటారని వెల్లడించారు. సాఫ్ట్ వేర్ బూమ్ పడిపోయిన 2000-2001 లో, 2002-03 లో కూడా మార్కెట్లు తిరోగమనం చెందాయని గుర్తు చేసారు. అలాగే 2008 లో ఆర్థిక మాంద్యం నెలకొన్నపుడు కూడా భయంకరమైన మార్కెట్ ను చూశామని, ప్రతి సారీ మళ్ళీ పుంజుకొన్నామని చెప్పారు. అందుకే, షేర్లు పతనమైతే, పునాదులు పటిష్టంగా ఉన్న కంపెనీల్లో పెట్టుబడులు పెట్టొచ్చు అని ఆయన సలహా ఇచ్చారు.

లాభాలు వచ్చే వరకు వేచి చూడాలి....
స్టాక్ మార్కెట్లో పెట్టుబడి అంటే... దీర్ఘకాలిక పెట్టుబడా... లేదంటే స్పెక్యులేషనా అనేది చూడాలి. ఒకవేళ ఇన్వెస్టర్లు పెట్టుబడి పెట్టి కొన్నేళ్ళకు లాభాలు ఆర్జించాలంటే... లాభాలు వచ్చేంతవరకు పెట్టుబడి పెడుతూ ఓపికగా వేచి చూడాలి. తప్పనిసరిగా వారు లాభాలు గడిస్తారు. నా 40 ఏళ్ళ అనుభవం అదే చెబుతోందని రాందేవ్ అగ్రవాల్ పేర్కొన్నారు. సో, స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులకు ముందు ఎవరైనా నిపుణుడి సలహా తీసుకొని జాగ్రత్తగా ముందుకు వెళ్ళండి. ఏమో మీరూ ఒక రాకేష్ ఝణఝన్వాలా లేదంటే వారెన్ బఫెట్ అవుతారేమో! ఎవరికి తెలుసు?


Click it and Unblock the Notifications