మరో బిజినెస్లోకి ధోనీ, ఈ కార్ల సంస్థలో పెట్టుబడి
ముంబై: భారత క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ గురుగ్రామ్కు చెందిన CARS24 (కార్స్24)లో పెట్టుబడులు పెట్టారు. ఉపయోగించిన కార్ల విక్రయాల వ్యాపారంలో భారతదేశంలో వేగంగా వృద్ధి సాధిస్తున్న సంస్థ కార్స్24. అధిక బ్రాండ్ వ్యాల్యూ కలిగిన ప్రచారకర్తల్లో ధోనీ ముందు ఉంటారు. వ్యాపారాల్లోను ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా ఈ సంస్థలో పెట్టుబడి పెట్టారు.
టీవీ ఉచితం, ఈ ట్యాక్స్ అదనం: జియో గిగాఫైబర్ గురించి పూర్తిగా తెలుసుకోండి
ధోనీతో వ్యూహాత్మక ఒప్పందం
మహేంద్ర సింగ్ ధోనీతో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకున్నామని కార్స్24 వెల్లడించింది. తమ బ్రాండ్ వ్యాల్యూను పెంచుకొనేందుకు, దేశవ్యాప్తంగా కస్టమర్లకు మరింతగా చేరువయ్యేందుకు ఈ క్రికెట్ మాజీ సారథితో వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపింది. కార్స్24లో ధోనీ కొంతమేర వాటాను సొంతం చేసుకోవడంతో పాటు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తారు.
ఎందరికో రోల్ మోడల్
కార్స్24లో మహేంద్ర సింగ్ ధోనీ ఎంత పెట్టుబడి పెట్టారనే అంశాన్ని వెల్లడించలేదు. సిరీస్ డీ-రౌండ్ ఫండింగ్లో భాగంగా అతను ఇన్వెస్ట్ చేసినట్లు తెలిపింది. కార్స్24 కుటుంబంలోకి ధోనీని స్వాగతించేందుకు ఆతృతతో ఎదురు చూస్తున్నామని, ఆయన రాక చాలా ఆనందంగా ఉందని, ఎంతోమంది భారతీయులకు అతని రోల్ మోడల్ మరియు హీరో అని కార్స్24 సీఈవో కో ఫౌండర్ విక్రమ్ చోప్రా అన్నారు.
అందుకే ది బెస్ట్ కెప్టెన్
నిరంతరం ముందుకు సాగేందుకు, కొత్త మార్గాలు అన్వేషించేందుకు, సమస్య పరిష్కారానికి ధోనీ పెట్టింది పేరని, సృజనాత్మకత, నవకల్పనలు, సమస్యను ధీటుగా ఎదుర్కొనే అతని దృఢచిత్తాన్ని ఏళ్లుగా అందరం చూస్తున్నామని, అందుకే అతను ది బెస్ట్ కెప్టెన్గా నిలిచారని విక్రమ్ చోప్రా అన్నారు. కార్స్24 కూడా అలాంటిదేనని, అలాంటి విలువలే పాటిస్తామని, అందుకే తమ భాగస్వామ్యం సహజమైనది అన్నారు. కార్లు అంటే తమకు ఎంతో ఇష్టమన్నారు.
నావంతు సహాయం చేస్తా
కార్స్24 ప్రయాణంలో భాగమవుతున్నందుకు ఆనందంగా ఉందని, కార్ల విషయాన్ని పక్కన పెడితే సృజనాత్మక, నవ కల్పనలు చేసే కొత్తతరం సంస్థలను తాను ఎంతగానో ఇష్టపడతానని ధోనీ చెప్పారు. కార్స్24 అందులో ఒకటి అన్నారు. వారికి ఎన్నో భారీ లక్ష్యాలు ఉన్నాయని, వాటిని చేరుకునేందుకు తనవంతు కృషి, సాయం చేస్తానని చెప్పారు.
ధోనీతో ప్లస్
ప్రీ-ఓన్డ్ కార్ల కొనుగోలు, అమ్మకాలకు దేశంలోని అతిపెద్ద సంస్థల్లో కార్స్24 ఒకటి. ఈ ప్రక్రియను సరళీకృతం చేసేందుకు డేటా, సాంకేతిక పరిజ్ఞానంలో కార్స్24 ఇన్వెస్ట్ చేసింది. ధోనీకి ఉన్న గుర్తింపు, క్రేజ్ తమకు ప్లస్ అవుతుందని కార్స్24కు భావిస్తోంది. భారతదేశంలోని మోస్ట్ ట్రస్టెడ్ ప్రీ-ఓన్డ్ కార్ సేల్స్ కంపెనీగా అవతరించేందుకు ఇది ఉపయోగపడుతుందని భావిస్తోంది. కార్స్24ను 2015లో ప్రారంభించారు. సంస్థ ఇటీవలే ఫ్రాంచైజీ మోడల్లోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించింది. 2021 వరకు 300 + టైర్ 2, టైర్ 3 పట్టణాల్లో ఫ్రాంచైజీలు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.