ఒక్కరోజులో రూ.80,000 కోట్లు పెరిగిన రిలయన్స్ మార్కెట్ వ్యాల్యూ
ముంబై: ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) షేర్లు మంగళవారం ఉదయం భారీగా పెరిగాయి. ఏకంగా 12 శాతం లాభాలు చూశాయి. దీంతో దశాబ్దకాలంలోనే ఒక్కో షేర్ వ్యాల్యూ రూ.1,302కు పెరిగి రూ.80,000 కోట్ల మార్కెట్ క్యాప్ను యాడ్ చేసింది. ముఖేష్ అంబానీ సోమవారం కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే.
రిలయన్స్ జియో గిగాబైట్ను సెప్టెంబర్ 5వ తేదీన లాంచ్ చేస్తామని వెల్లడించడంతో పాటు సౌదీ కంపెనీ ఆరామ్కో, BPతో ఒప్పందం కుదుర్చుకుంటామని తెలిపారు. భారతదేశంలోని ఓ కంపెనీకి విదేశాల నుంచి వస్తున్న అతిపెద్ద పెట్టుబడి ఇదే. ఈ నేపథ్యంలో రిలయన్స్ షేర్లు మంగళవారం పరుగు పెట్టాయి. సాయంత్రం మార్కెట్ క్లోజ్ అయ్యే సమయానికి దాదాపు 10 శాతం లేదా 114 పాయింట్ల లాభాలతో ముగిశాయి.
టీవీ ఉచితం, ఈ ట్యాక్స్ అదనం: జియో గిగాఫైబర్ గురించి పూర్తిగా తెలుసుకోండి
వాటాదారులకు డివిడెంట్ మరింత పెరిగే ఛాన్స్
రిలయన్స్ కంపెనీని రుణరహిత కంపెనీగా మార్చేందుకు ముఖేష్ అంబానీ ప్లాన్ చేస్తున్నారు. రానున్న పద్దెనిమిది నెలల కాలంలో ఈ లక్ష్యాన్ని చేరుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. గత ఏడాది ముగింపు నాటికి రిలయన్స్ కంపెనీకి రూ.1,54,478 కోట్ల రుణం ఉంది. ఈ చెల్లింపులకు నగదు సమీకరణ కోసం కొన్ని వ్యాపారాల్లో వాటాల విక్రయాన్ని వేగవంతం చేసింది. ఇది పూర్తయితే వాటాదారులకు డివిడెండ్ మరింత పెరిగే అవకాశముంది. దీంతోపాటు కంపెనీ విలువ కూడా భారీగా పెరుగుతుంది.
ప్రపంచంలోనే బలమైన బ్యాలెన్స్ షీట్ కలిగిన కంపెనీల్లో రిలయన్స్
ఇప్పటకే అరామ్కో, బీపీ కంపెనీలతో కలిసి నడవడం ద్వారా సుమారు రూ.1.15లక్షల కోట్ల నగదు రానుంది. ఇప్పటి వరకు విలువ కట్టని రిలయన్స్కు చెందిన రియల్ ఎస్టేట్, ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ వ్యాల్యూను కూడా జత చేయనున్నారు. ఇది జరిగితే ప్రపంచంలో అత్యంత బలమైన బ్యాలెన్స్ షీట్ ఉన్న కంపెనీల్లో రిలయన్స్ కూడా ఒకటి అవుతుందని ముఖేష్ అంబానీ చెబుతున్నారు.
అతిపెద్ద ఎఫ్డీఐ ప్రవాహం
రిలయన్స్లో సౌదీకి చెందిన ఆరామ్కో 20 శాతం పెట్టుబడులు పెట్టడం స్వాగతించదగ్గ పరిణామమని, అతిపెద్ద ఎఫ్డీఐ ప్రవాహం ఇదే అవుతుందని, ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఆందోళనను తొలగించేందుకు సహకరిస్తుందని, ఫైబర్, టవర్ వంటి వ్యాపారాలలో దూకుడు కొనసాగించేందుకు ఉపయోగపడుతుందని పీఎంఎస్ సీఈవో అజయ్ అన్నారు. రానున్న 18 నెలల్లో సున్నా రుణ సంస్థగా ఉద్బవించడం ఏకీకృత బ్యాలెన్స్ షీట్ను బలోపేతం చేస్తాయన్నారు.
నిధుల సేకరణ
ఆరామ్కోతో రిలయన్స్ 75 బిలియన్ డాలర్ల డీల్ కుదుర్చుకుంటోంది. అలాగే ఆరామ్కో రోజుకు 5,00,000 బ్యారెల్స్ ఇంధనాన్ని గుజరాత్ జామ్ నగర్లోని రిలయన్స్ రిఫైనరీకి విక్రయిస్తుంది. మరోవైపు బీపీతో ఒప్పందం ద్వారా మరో రూ.7,000 కోట్లు సమీకరించనుంది. కెనడా బ్రూక్ఫీల్డ్ అసెట్స్ మేనేజ్మెంట్కు టవర్స్ అమ్మకం ద్వారా రూ.25,000 కోట్లను సేకరిస్తుంది. కేవలం ఆరామ్ కో, BP ఇన్వెస్ట్మెంట్స్ ద్వారానే రూ.1.15 కోట్లకు పైగా రుణాలు తీరనున్నాయి.