ఆకాశానికి బంగారం ధరలు, ఇలా రూ.3,000 ఆదా చేయండి
బంగారం ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. అమెరికా - చైనా వాణిజ్య యుద్ధం నేపథ్యంలో ఇన్వెస్టర్లు సురక్షిత, అతివిలువైన లోపాలపై ఇన్వెస్ట్ చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. దేశీయంగా ఆభరణాల వర్తకులు కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నారు. దీంతో బంగారం ధర రూ.38వేల మార్క్ దాటింది. ఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధర రూ.550 పెరిగి రూ.38,470కి చేరుకుంది. అంతకుముందు బుధవారం ఒక్కరోజే రూ.1,113 పెరిగింది. రెండ్రోజుల్లో రూ.1,663 పెరిగింది. బంగారంతో పాటు వెండి ధర కూడా పెరిగింది. వెండి రూ.630 పెరిగి రూ44,300కు చేరుకుంది.
అంతర్జాతీయ మార్కెట్లో ధర
ఇంటర్నేషనల్ మార్కెట్లో గోల్డ్ ధర ఔన్సు 1,500 డాలర్లకు చేరుకుంది. దీంతో పాటు అమెరికా-చైనా ట్రేడ్ వార్, దేశీయ ఆర్థిక పరిస్థితులు నిరాశజనకంగా ఉండటం, ఆర్బీఐ వృద్ధిరేటును ఏడు శాతం నుంచి 6.9 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడం వంటివి పెట్టుబడిదారుల్లో ఆందోళనను కలిగించిందని చెబుతున్నారు. న్యూయార్క్ బులియన్ స్పాట్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 1,497.40 డాలర్లకు పెరగగా, వెండి 17.16 డాలర్ల వద్దకు పెరిగింది.
ఆభరమాలతో పాటు ఇన్వెస్ట్మెంట్ కోసం కూడా..
బంగారం అంటే భారతీయులకు మోజు. చాలామంది బంగారు ఆభరణాలను అందం, హోదా కోసం ధరిస్తారు. కొంతమంది తమకు ఆర్థిక రక్షణగా ఉంటుందని కొనుగోలు చేసి, దాస్తుంటారు. ఫలితంగా బంగారం ధరలు పెరుగుతున్నాయి. పెళ్లిళ్లు వంటి శుభసందర్భాల్లో ఆభరణాలకు డిమాండ్ మరింత ఎక్కువగా ఉంటుంది. ఇది ధరల పెరుగుదలకు కారణమవుతోంది. బంగారం వినియోగం అత్యధికంగా ఉన్న దేశాల్లో భారత్ అగ్రస్థానంలో ఉంది. ఆభరణాల కోసం కొనుగోలు చేసే పసిడే మన దగ్గర ఎక్కువ. అయితే పెట్టుబడుల కోసం కొనుగోలు చేస్తున్న వారు కూడా పెరుగుతున్నారు.
ఫండ్స్, బాండ్స్ల్లో పెట్టుబడి
గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్, సావరిన్ బాండ్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిని కొనుగోలు చేస్తున్నారు. ఇవి కూడా ధరల్ని ప్రభావితం చేస్తున్నాయి. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేవారు మార్కెట్లో ఒడుదొడుకులు ఉన్న సమయంలో రక్షణ కోసం బంగారం వైపు చూస్తున్నారు. ఏడాదికి మన దేశం 800 నుంచి 850 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటుంది.
పంటలు బాగా పండితే బంగారానికి డిమాండ్
వర్షాలు బాగా కురిసి, పంటలు బాగా పండితే బంగారానికి డిమాండ్ మరింత పెరుగుతుంది. చేతిలో డబ్బులు ఉండటంతో రైతులు బంగారం వైపు మొగ్గు చూపుతారు. దేశీయ బంగారం డిమాండ్లో గ్రామీణ భారతం వాటా 60 శాతం వరకు ఉంటుంది. బంగారం ధర పెరిగితే డిమాండ్ తగ్గే అవకాశముందని బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అధిక ధరల వల్ల కొనుగోలు అంశంపై ఆచితూచి నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు.
ఆగస్ట్ 14వ తేదీ వరకు బంగారంపై ఈ ఆఫర్
ప్రస్తుతం బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బంగారం కొనచ్చా అంటే నిపుణులు సరైన సమయం కాకపోవచ్చునని చెబుతున్నారు. లాభనష్టాలతో పని లేకుండా బంగారం కొనాలని భావిస్తే ఆర్బీఐ అందిస్తున్న సావరీన్ గోల్డ్ బాండ్ 2019-20 సిరీస్ 3లో ఇన్వెస్ట్ చేయాలి. ఆర్బీఐ గ్రాముకు రూ.3,499 ధరతో వీటిని అందిస్తోంది. ఆగస్ట్ 5వ తేదీన ఓపెన్ అయిన బాండ్స్ ఆగస్ట్ 14 వరకు కొనుగోలు చేయవచ్చు.
రూ.3,000కు పైగా ఆదా
ప్రస్తుతం పది గ్రాముల బంగారం 39,000 మార్క్కు చేరుకుంది. అయితే పది యూనిట్ల ఎస్బీఐ బాండ్స్ కొనుగోలు చేస్తే రూ.3,000 వరకు ఆదా చేయవచ్చు. ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసి, డిజిటల్ మోడ్లో చెల్లింపులు చేసినవారికి రూ.50 డిస్కౌంట్ ఇవ్వాలని ఆర్బీఐ నిర్ణయించింది. రూ.3,449కి గోల్డ్ బాండ్ ఇష్యూ చేస్తారు. ప్రస్తుతం 38 వేల నుంచి 39వేల మధ్య ఉంది. అంటే గ్రామ్ బంగారంపై రూ.300 లేదా అంతకంటే ఎక్కువ డిస్కౌంట్ వస్తుంది. అంటే రూ.3,000కు పైగా లబ్ధి చేకూరుతుంది.
ధరలు ఇలా...
సావరీన్ బాండ్ యూనిట్ ధర (ఆఫర్) రూ.3499.
10 యూనిట్ల సావరీన్ బాండ్స్ ధర= 10 x3499 = రూ.34,990.
ప్రస్తుతం మార్కెట్లో బంగారం ధర= రూ.38,000 నంచి రూ.39,000
మీరు ఆదా చేసేది= రూ.38,000 - రూ.34,990 = రూ.3,010