బంగారం ధరలు భారీగా ఎందుకు పెరుగుతున్నాయి?
బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఎంసీఎక్స్లో బంగారం ధర 0.65 శాతం మేర పెరిగి, రూ.37,830 రికార్డ్ ధరకు చేరుకుంది. వెండి ధరలు కూడా పెరుగుతున్నాయి. అమెరికా-చైనా మధ్య కొనసాగుతున్న ట్రేడ్ వార్ నేపథ్యంలో పసిడి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని చెబుతున్నారు. డాలర్తో రూపాయి మారకం విలువ పడిపోవడం కూడా బంగారం ధరలు పెరగడానికి కారణంగా చెబుతున్నారు. ఎంసీఎక్స్లో వెండి ధర 1.5 శాతం మేర పెరిగి రూ.43,260కు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లోను బంగారం ధర 1.2 శాతం పెరిగి, ఔన్సుకు 1,500 డాలర్లు దాటింది. 6 ఏళ్ల హైకి చేరుకుంది. కామెక్స్లో గోల్డ్ ధర 17ఏళ్ల తర్వాత ఇలా పెరిగింది. బంగారం ధరలు పెరగడానికి పలు కారణాలు ఉన్నాయి.
అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం
అమెరికా - చైనా ట్రేడ్ వార్ నేపథ్యంలో బంగారానికి డిమాండ్ రోజు రోజుకు పెరుగుతోంది. గత వారం నుంచి ఆర్థికంగా బలమైన ఈ రెండు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం మరోసారి ముదురుతోంది. చైనా ఉత్పత్తులపై టారిఫ్ విధిస్తామని అమెరికా ప్రకటించింది. దీంతో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలో బంగారం, వెండి వంటి మెటల్ ధరలు పెరుగుతున్నాయి.
ఐదు ట్రేడింగ్ సెషన్లలో నష్టాలు..
గత ఐదు ట్రేడింగ్ సెషన్లలో డోజోన్స్, నాస్దక్ మార్కెట్లు దాదాపు 4 శాతం నష్టపోయాయి. యూరో స్టాక్స్ 4.9 శాతం, ఎఫ్టీఎస్ఈ 100 6 శాతం, నిక్కీ 5 శాతం మేర నష్టపోయాయి. హాంగ్శెంగ్ 7 శాతం నష్టపోయింది. షాంఘై మార్కెట్ 5 శాతం పడిపోయాయి. ఈ పరిస్థితుల్లో ఈక్విటీల కంటే బంగారం వైపు దృష్టి సారిస్తున్నారు.
రూపాయి రూపంలో ఎక్కువ లాభాలు తెచ్చిన బంగారం
ఇయర్ టు డేట్ లెక్కన నిఫ్టీ 1 శాతం పెరిగింది. సెన్సెక్స్ 2.5 శాతం పెరిగింది. అదే సమయంలో బంగారం మాత్రం రూపాయి రూపంలో 15 శాతం (డాలర్ రూపంలో 14 శాతం) లాభాలు తెచ్చిపెట్టిందని చెబుతున్నారు. అంతర్జాతీయస్థాయిలో వాణిజ్య టెన్షన్స్ ఇలాగే కొనసాగితే పసిడి ధరలు మరింతగా పెరుగుతాయని చెబుతున్నారు.
బంగారంపై పెట్టుబడులు
2013లో బంగారం ధరలు ఔన్సుకు 1696 డాలర్లుగా ఉంది. అప్పటి ధర కంటే తక్కువే ఉంది. ఇటీవల ఫెడ్ చైర్మన్ జెరోమ్ పోవెల్ రేట్ కట్ పైన చేసిన వ్యాఖ్యల వల్ల మార్కెట్లు నష్టపోయాయి. బంగారానికి డిమాండ్ పెరిగింది. దానికి తోడు అమెరికా - చైనా మధ్య టెన్షన్. దీంతో బంగారంపై పెట్టుబడులు మరింత పెరగవచ్చునని చెబుతున్నారు.
భారత్, చైనా మార్కెట్లలో డిమాండ్
గత కొద్ది నెలలుగా భారత్, చైనా దేశాల్లోని ఆభరణాల మార్కెట్లలో డిమాండ్ కారణంగా బంగారం ధరలు పెరుగుతున్నాయి. Q2లో బంగారం డిమాండ్ 8 శాతం పెరిగి 1123 టన్నులకు చేరుకుంది. సెంట్రల్ బ్యాంకులు 2019 ఏప్రిల్ - జూన్ మధ్య 224.4 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేశాయి. మొత్తంగా మొదటి అర్ధ ఏడాదిలో సెంట్రల్ బ్యాంకులు కొనుగోలు చేసిన బంగారం 374.1 టన్నులకు పెరిగింది.
మరిన్ని కారణాలు...
ఇదిలా ఉండగా, అమెరికా-చైనాల మధ్య జరుగుతున్న వాణిజ్య యుద్ధంతో సంబంధం లేకుండా పసిడి ధరలు పెరుగుతున్నాయనే మరో వాదన ఉంది. చైనా కరెన్సీ యాన్ పడిపోవడంతో ఆ ప్రభావం బంగారు ధరలపై పడినట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూడా మందగించడంతో ధరలు పెరుగుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పలు దేశాల సెంట్రల్ బ్యాంకులు ప్రకటించిన మోనిటరీ పాలసీలు కూడా ఎఫెక్ట్ చూపుతున్నాయి.