మార్కెట్లు ఎందుకు కుప్పకులాయి.. కారణాలివే, నష్టపోయిన-లాభపడిన షేర్లు...
ముంబై: ఇండియన్ స్టాక్ మార్కెట్లు గురువారం భారీ నష్టాలతో ముగిశాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టాల్లో కూరుకుపోయాయి. ప్రభుత్వరంగ బ్యాంకు ఎస్బీఐ షేర్లు 4.6 శాతం నష్టంతో క్లోజ్ అయ్యాయి. సెన్సెక్స్ 463 పాయింట్ల నష్టంతో 37,018 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 11,000 దిగువన అంటే 138 పాయింట్లు నష్టపోయి 10,980 వద్ద క్లోజ్ అయింది.
పెడ్ రేట్ కట్ తర్వాత భారీ నష్టాల్లో మార్కెట్లు ఎందుకు?
ఎన్ఎస్ఈలో వందలాది స్టాక్స్ రికార్డ్ కనిష్టానికి పడిపోయాయి. వేదాంత 50 వారాలకు పైగా కనిష్టానికి పడిపోయింది. మారుతీ, రిలయన్స్, పవర్ గ్రిడ్, బజాజ్ ఆటో, హీరోమోటోకో, హిందూ యూనిలీవర్,ఎన్టీపీసీ వంటి షేర్లు స్వల్భ లాభాల్లో కొనసాగటం లేదంటే పెద్దగా మార్పు లేదు.
నష్టపోయిన షేర్లు...
యాక్సిస్ బ్యాంకు, సన్ ఫార్మా, ఏషియన్ పెయింట్స్, ఎం అండ్ ఎం, ఐటీసీ, ఇండస్ ఇండ్ బ్యాంకు, బజాజ్ ఫైనాన్స్, కొటక్ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టీసీఎస్, హెచ్సీఎల్ టెక్, ఐసీఐసీఐ బ్యాంకు, ఓఎన్జీసీ, టెక్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ, ఎల్ అండ్ టీ, యస్ బ్యాంకు, టాటా స్టీల్, ఇన్ఫోసిస్, భారతీ ఎయిర్ టెల్, టాటా మోటార్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, వేదాంత.. ఇలా పలు షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. జీ ఎంటర్టైన్మెంట్ 10 శాతానికి పైగా నష్టపోయింది.
విదేశీ పెట్టుబడులు తరలిపోవడం
బొగ్గు, ముడిచమురు, సహజవాయువు, రిఫైనరీ ప్రాడక్ట్స్, ఎరువులు, ఉక్కు, సిమెంటు, పవర్ ఇలా ఎనిమిది కీలక మౌలిక రంగాల వృద్ధి ఏప్రిల్లో నెమ్మదించడం మార్కెట్పై ప్రతికూల ప్రభావం చూపింది. దీనికి తోడు విదేశీ పెట్టుబడులు భారీగా తరలిపోతుండటం, దీర్ఘకాల వడ్డీ రేట్ల కోతపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అమెరికా ఫెడ్ ఛైర్మన్ జెరోమ్ పోవెల్ చెప్పడం కూడా మార్కెట్ నష్టాలకు కారణం.
పడిపోయిన రూపాయి...
200 పాయింట్లకు పైగా నష్టంతో ట్రేడింగ్ను ఆరంభించిన సెన్సెక్స్ ఓ సమయంలో 600, 700కు దిగజారి, ఆ తర్వాత 463 పాయింట్ల నష్టంతో క్లోజ్ అయింది. అటు నిఫ్టీ కూడా 200 పాయింట్లకు పైగా దిగజారింది. చివరకు షార్ట్ కవరింగ్తో కాస్త కోలుకుంది. నిఫ్టీ 138 పాయింట్ల నష్టంతో క్లోజ్ అయింది. మరోవైపు డాలర్తో రూపాయి మారకం విలువ ఉదయం 69.20 వద్ద ట్రేడ్ అయింది.
మార్కెట్ నష్టానికి పలు కారణాలు
మార్కెట్లు నష్టపోవడానికి పలు కారణాలు ఉన్నాయి. యూఎస్ ఫెడరల్ బ్యాంకు వడ్డీ రేటు నిర్ణయం, ఆటో మొబైల్ అమ్మకాల తగ్గుదల, హెచ్డీఎఫ్సీ, ఇన్ఫోసిస్, ఎస్బీఐ వంటి కీలక కంపెనీలు నష్టం మార్కెట్లపై ఉంటుంది. వీటితో పాటు డాలర్ లాభపడటం వంటి ఎన్నో కారణాలు ఉన్నాయి.
రేట్ కట్స్....
యూఎస్ ఫెడరల్ బ్యాంకు బుధవారం సమావేశంలో వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. రేట్ కట్ సైకిల్కు తాజా నిర్ణయం ఆరంభం కాదని, ప్రస్తుత తగ్గింపు తర్వాత రేట్ కట్స్ కొనసాగకపోవచ్చునని ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ చెప్పారు. ఇది అంతర్జాతీయ మార్కెట్లను, తద్వారా భారతీయ మార్కెట్లను దెబ్బతీసింది.
ఆటో అమ్మకాలు...
ఆటో అమ్మకాల తగ్గుదల కూడా మార్కెట్లపై ప్రభావం చూపింది. పలు కంపెనీలు తమ అమ్మకాలు తగ్గాయని వెల్లడించాయి. కంపెనీలు ఉత్పత్తిని కూడా తగ్గించాయి. కీలక కంపెనీల షేర్లు నష్టపోతే ఆ ప్రభావం మార్కెట్ల పైన ఉంటుంది. గురువారం హెచ్డీఎఫ్సీ, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఎస్బీఐ వంటి షేర్లు నష్టపోవడం మార్కెట్లను దెబ్బతీశాయి. ఈ రోజు హెచ్డీఎప్సీ షేర్లు రెండు శాతం మేర పడిపోయాయి. వీటిలో ఎక్కువ షేర్లు FPIవే. ఇవి వెనక్కి తీసుకోవడం ఈ బ్యాంకు షేర్లపై ప్రభావం చూపింది.