మైక్రో ఫైనాన్స్ కంపెనీలో ఫ్లిప్కార్ట్ ఫౌండర్ సచిన్ బన్సల్ పెట్టుబడి
ఫైనాన్సియల్ సెక్టార్ స్టార్టుప్ కంపెనీల్లో ఫ్లిప్కార్ట్ కో-ఫౌండర్ సచిన్ బన్సల్ పెట్టుబడుల పరంపర కొనసాగుతోంది. తాజాగా ఆయన బెంగుళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఒక మైక్రో ఫైనాన్స్ కంపెనీలో పెట్టుబడి పెట్టారు. చైతన్య ఇండియా ఫైనాన్స్ అనే ఈ కంపెనీ లో సచిన్ బన్సల్ రూ 25 కోట్ల పెట్టుబడిని పెట్టారని సమాచారం. చైతన్య రూరల్ ఇంటర్మీడియేషన్ డెవలప్మెంట్స్ సర్వీసెస్ అనే కంపెనీ ఆధ్వర్యంలో ఇది నడుస్తోంది.
పేపర్ డాట్ వీసీ అనే బిజినెస్ ఇంటలిజెన్స్ సంస్థ రిజిస్ట్రార్ అఫ్ కంపెనీస్ నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా సచిన్ బన్సల్ ఈ మైక్రో ఫైనాన్స్ కంపెనీలో పెట్టుబడి పెట్టిన విషయం బహిర్గతం ఐంది. ఫ్లిప్కార్ట్ నుంచి వైదొలిగిన అనంతరం సచిన్ బన్సల్ అనేక స్టార్టుప్ కంపెనీల్లో పెట్టుబడి పెట్టిన విషయం తెలిసిందే. ఆయన ఎక్కువగా ఫైనాన్సియల్ సర్వీసెస్ సెక్టార్ లోని స్టార్టుప్ కంపెనీలను పెట్టుబడుల కోసం ఎంచుకొంటున్నారు.
బీమా
పాలసీని
ఆపేద్దామనుకుంటున్నారా..
అయితే
ఇలా
చేయొచ్చు..
ఎగ్జిక్యూటివ్ రోల్ ....
సచిన్ బన్సల్ చైతన్య ఫైనాన్స్ లో కేవలం పెట్టుబడికి పరిమితం కాబోవడం లేదని తెలిసింది. ఆయన ఈ కంపెనీలో ఎగ్జిక్యూటివ్ రోల్ ప్లే చేసే అవకాశం ఉన్నట్లు మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. సచిన్ బన్సల్... తన ఇన్వెస్ట్మెంట్ కంపెనీ బేసిక్ (బీఏసీక్యూ) ద్వారా రూ 25 కోట్ల నిధులను సమకూర్చారు. ఇందుకు ప్రతిఫలంగా రూ 10 లక్షల ముఖ విలువ కలిగిన 250 షేర్లు ఆయనకు జారీ చేసినట్లు తెలిసింది. వీటిని అన్ - రేటెడ్ నాన్ - కన్వెర్తబెల్ డిబెంచర్స్ గా పేర్కొన్నారు.
బ్యాంకింగ్ రంగ ప్రవేశం...
సచిన్ బన్సల్ కు బ్యాంకింగ్ రంగం పై అధిక ఆసక్తి ఉందని, ఆయన బ్యాంకింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. అందుకే ఆయన ఎక్కువగా ఆర్థిక రంగం లోని కంపెనీల్లో పెట్టుబడులు పెడుతున్నారని చెబుతున్నారు. అలాగే, కార్యనిర్వాహక పాత్రలో అయన సేవలు అందిస్తే... బ్యాంకింగ్ లైసెన్స్ కు అర్హుడు అవుతారని నిపుణులు పేర్కొంటున్నారు. బ్యాంకింగ్ రంగంలో సుదీర్ఘ అనుభవం ఉన్నవారికే లైసెన్స్ ఇవ్వడం ఆనవాయితీ. ఈ నేపథ్యం లోనే సచిన్ బన్సల్... తన పెట్టుబడి సంస్థలో భాగస్వామిగా బ్యాంకు అఫ్ అమెరికా ఉన్నతాధికారి అంకిత్ అగర్వాల్ ను చేర్చుకున్నారని అంటున్నారు. అంకిత్ కూడా నాన్ - బ్యాంకింగ్ కంపెనీల్లో చురుక్కా పెట్టుబడులు పెట్టిన అనుభవజ్ఞుడు అన్నది సమాచారం. అంకిత్ కు ఎలాగు బ్యాంకింగ్ రంగంలో అపార అనుభవం ఉంది. ఇది సచిన్ బన్సల్ భవిష్యత్ లో బ్యాంకింగ్ రంగంలోకి ప్రవేశించేందుకు దోహదపడుతుందని అంచనా వేస్తున్నారు.
మూడు రాష్ట్రాలు... రూ 600 కోట్లకు పైగా రుణాలు...
బెంగళూరు కేంద్రంగా ఏర్పడిన చైతన్య ఇండియా ఫైనాన్స్ ను 2009 లో నెలకొల్పారు. ప్రస్తుతం ఈ మైక్రో ఫైనాన్స్ కంపెనీ కర్ణాటక తో పాటు మహారాష్ట్ర, బీహార్ రాష్ట్రాల్లో కార్యకలాపాలు కొనసాగిస్తోంది. ఈ కంపెనీ స్థూల రుణాలు రూ 625 కోట్లుగా ఉన్నాయి. అంటే, అంత మేరకు సభ్యులకు ఈ సంస్థ రుణాలను మంజూరు చేసింది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు సంయుక్తంగా రుణాలను అందించటంలో చైతన్య ఫైనాన్స్ కు మంచి పట్టు ఉంది. అలాగే, గ్రామాల్లో ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఇప్పటి వరకు ఈ కంపెనీ రూ 80 కోట్ల వరకు నిధులను సమీకరించింది. షోర్- కాప్ అనే కంపెనీ చైతన్య ఫైనాన్స్ లో లీడ్ ఇన్వెస్టర్ గా కొనసాగుతోంది.