యెస్ బ్యాంక్లో స్టాక్లో రూ.7000 కోట్లు కోల్పోయిన ఓ వ్యక్తి
యెస్ బ్యాంక్.. ఏ మాత్రం పరిచయం అక్కర్లేని పేరు. స్టాక్ మార్కెట్లో బాగా యాక్టివ్గా ఉండే వాళ్లకు దీని గురించి ఇంకా బాగా తెలుసు. నెలల వ్యవధిలోనే స్టాక్ ఈ 80-90 శాతం విలువను కోల్పోవడం షాకింగ్ లాంటి నిజం. వేల సంఖ్యలో బ్యాంకింగ్ శాఖల నెట్వర్క్, భారీ స్థాయిలో ఉద్యోగులు, మంచి పేరు.. వంటివన్నీ ఒక్క దెబ్బకు ఊడ్చిపెట్టుకుపోయాయి. కుటుంబంలోని ఇద్దరు వ్యక్తుల మధ్య రచ్చ.. వేల కోట్ల రూపాయలను హారతి కర్పూరంలా ఆపేసింది.
ఈ మొత్తం ఎపిసోడ్లో యెస్ బ్యాంక్ మాజీ సీఈఓ, ప్రమోటర్ అయిన రాణా కపూర్ ఏకంగా రూ.7000 కోట్లను కోల్పోయారు. తాజాగా బ్యాంకు ప్రకటించిన ఆర్థిక త్రైమాసిక ఫలితాల్లో ఈ విషయం స్పష్టమైంది. ఆదాయం క్షీణించింది, మొండి బకాయిల భారం ఊహించిన దానికంటే ఎక్కువగా ముంచడంతో యెస్ బ్యాంక్ స్టాక్ ఒక్క రోజులోనే 20 శాతం పతనమైంది. వీటన్నింటి కారణాలతో ఈ మధ్య ఈ స్టాక్ కుప్పకూలింది. దీంతో కపూర్ నెట్వర్త్ 1.4 బిలియన్ డాలర్ల నుంచి 377 మిలియన్ డాలర్లకు దిగొచ్చింది. బ్లూమ్ బర్గ్ బిలయనీర్స్ ఇండెక్స్ ఈ విషయాన్ని వెల్లడించింది.
యస్ బ్యాంకు
61 ఏళ్ల కపూర్.. యెస్ బ్యాంక్ను చిన్న స్థాయి నుంచి దేశంలోనే నాలుగో అతి పెద్ద ప్రైవేట్ బ్యాంకుగా విస్తరింపజేశారు. 2004 నుంచి బ్యాంక్లో అహరాహం శ్రమించారు. చివరకు అనేక వివాదాల నడుమ ఆర్బీఐ ఇతన్ని తప్పించాల్సిన స్థితి వచ్చింది. ఇప్పటికిప్పుడు బ్యాంక్ను చక్కదిద్దాల్సిన అవసరం ఉందంటూ.. ఆయనను బలవంతంగా పక్కకు తప్పించింది. యెస్ బ్యాంక్ను ఒడ్డున పడేసేందుకు డాయిష్ బ్యాంక్ మాజీ హెడ్ రవ్నీత్ గిల్.. సీఈఓగా చేరారు. అప్పటి నుంచి ఆయన బ్యాంకును చక్కదిద్దే ప్రయత్నాలు చేస్తున్నారు కానీ.. ఇప్పటికే బలహీనపడిన వ్యవస్థను అంత త్వరగా చక్కదిద్దడం సాధ్యమయ్యే పనికాదని ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.
యస్ బ్యాంకు షేర్
ప్రస్తుతం రాణాకపూర్కు యెస్ బ్యాంకులో 10 శాతం వాటా ఉంది. యెస్ క్యాపిటల్, మోర్గాన్ క్రెడిట్స్ అనే సంస్థల ద్వారా రాణా.. ఈ షేర్స్ హోల్డ్ చేస్తున్నారు. తన తదనంతరం తన షేర్లు తన కూతూళ్లకు, ఆ తర్వాతి తరాలకూ వెళ్లాలి కానీ.. ఒక్క షేర్ కూడా అమ్మొద్దని తన వీలునామాలో రాస్తానంటూ గతేడాది అంత బలమైన స్టేట్మెంట్ ఇచ్చారు కపూర్.
మరింతగా పతనం
ప్రస్తుత పరిస్థితుల్లో యెస్ బ్యాంక్ టార్గెట్లను మరింతగా కుదించాయి రీసెర్చ్ ఏజెన్సీలు. ఇప్పటికీ నాలుగు వందల రూపాయల నుంచి రూ.85కి దిగిన స్టాక్ ఇంకో ముప్ఫై, నలభై శాతం వరకూ దిగిరావొచ్చని కూడా చెబ్తున్నాయి. ఈ నేపధ్యంలో రాణాకపూర్.. దగ్గర ఉన్న షేర్ల విలువ ఇంకా దిగొచ్చే ఆస్కారం ఉంది.
ఆసక్తికర విషయం ఏంటంటే.. రాణాకపూర్ ఆధ్వర్యంలో బ్యాంక్ పదేళ్ల పాటు ఏడాదికి 34 శాతం వృద్ధితో దూసుకుపోయి షేర్ హోల్డర్లకు అమితమైన సంపదను తెచ్చిపెట్టింది. అయితే ఇప్పుడు.. ఆ మేడలన్నీ పేకల్లా కూలిపోవడానికి కూడా ఆయనే కారణమయ్యారు.