టార్గెట్ బిట్కాయిన్, లిబ్రా ! ట్రంప్ డిజిటల్ వార్
క్రిప్టోకరెన్సీలన్నింటికీ ఒకే ఒక్క పోటులో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గట్టి దెబ్బవేసేట్టు కనిపిస్తోంది. ఇప్పటికే బాగా పాపులర్ అయిన బిట్ కాయిన్, ఫేస్ బుక్ త్వరలో తీసుకురావాలని అనుకుంటున్న లిబ్రా సహా ఇతర డిజిటల్ కరెన్సీలన్నీ తమ దేశ బ్యాంకింగ్ చట్టాలకు లోబడే నడుచుకోవాల్సి ఉంటుందని ట్రంప్ అల్టిమేటం ఇచ్చారు. అమెరికా బ్యాంకింగ్ నిబంధనలతో పాటు ప్రపంచంలోని ప్రముఖ నియంత్రణా సంస్థలకు లోబడే మీ వ్యాపారం కొనసాగించాల్సి ఉంటుందని ట్రంప్ తేల్చిపారేశారు. దీంతో వీటి మనుగడపై మరోసారి టెన్షన్ మొదలైంది.
మేడిన్ ఇండియా: వచ్చె నెలలో మార్కెట్లోకి భారత్లో తయారైన యాపిల్ ఐఫోన్లు
ఇంతకీ ఉంటాయా.. ? అవే భవిష్యత్తా ?
క్రిప్టోకరెన్సీలు లేదా డిజిటల్ కరెన్సీలు ఉండడానికి తాను వ్యతిరేకి కాను అని చెబ్తూనే.. అవి మనుగడ సాధించాలని బ్యాంకింగ్ లైసెన్స్ పొందాలని ట్రంప్ తేల్చిచెప్పారు. ఇలాంటి కరెన్సీలకి విలువ లేదు, వాళ్లు చెప్పేలెక్కల్లన్నీ గాల్లో మాత్రమే ఉంటాయంటూ ట్రంప్ ట్వీట్ చేశారు.
ఒక వేళ ఫేస్ బుక్ వంటి ప్రధాన సంస్థలు ఈ రంగంలోకి దిగాలని ఉవ్విళ్లూరుతుంటే వాళ్లు ఖచ్చితంగా బ్యాంక్లా మారి, అందుకు అవసరమైన బ్యాంకింగ్ నియంత్రణ పరిధిలోకి రావాలని ఆయన సూచించారు. అయితే అమెరికా పరిధిలోనే కాకుండా ప్రపంచంలోని ఇతర దేశాలకు కూడా ఆమోదయోగ్యమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు.
ఈ మధ్యే అమెరికల్ ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్ జెరోమ్ పోవెల్ కూడా ఫేస్ బుక్ లిబ్రాపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. భద్రత, డబ్బుల ఎగవేత, ప్రజల డబ్బుకు భరోసా, ఆర్థిక స్థిరత్వం వంటి అంశాలపై ఫేస్ బుక్ క్లారిటీ ఇచ్చేంత వరకూ లిబ్రా ముందుకు సాగదని ఆయన స్పష్టంగా చెప్పారు. ఇలాంటి డిజిటల్ కరెన్సీల మనుగడతో పాటు వాటి వల్ల వచ్చే ఇబ్బందులు, బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రభావం వంటి అంశాలన్నీ సమీక్షించేందుకు ఓ వర్కింగ్ గ్రూపును ఏర్పాటు చేశామని వెల్లడించారు.
డిజిటల్ విప్లవం
డిజిటల్ యుగంలో క్రిప్టోకరెన్సీలదే పాత్ర అంటూ ఇప్పటికే బిట్ కాయిన్, ఎథీరియం వంటి పేర్లతో అనేక కరెన్సీలు ప్రపంచంలో మనుగడ కొనసాగిస్తున్నాయి. రెండేళ్ల క్రితం విపరీతంగా క్రేజ్ సంపాదించిన బిట్ కాయిన్ ఒక దశలో 20 వేల డాలర్ల వరకూ పలికింది. అంటే మన కరెన్సీలో సుమారు రూ.14 లక్షల వరకూ పలికింది. అయితే వివిధ దేశాలు వీటిని వ్యతిరేకంచిన నేపధ్యంలో ఒక్కసారిగా దీని ధర 20 వేల డాలర్ల నుంచి 3500 డాలర్లకు పడిపోయింది. ఈ టైంలో చాలా మంది ఇన్వెస్టర్లు ఇరుక్కుపోయి చేతులు కాల్చుకున్నారు. అప్పుడు రూ.3 లక్షలకు ఓ బిట్ కాయిన్ దొరికింది. ఈ మధ్య మళ్లీ ఫేస్ బుక్ లిబ్రా ప్రకటనతో మూడున్నర, నాలుగు వేల డాలర్ల నుంచి ఒక్కో బిట్ కాయిన్ 11వేల డాలర్లకు ఎగబాకింది. ఇప్పుడు ఒక్కో బిట్ కాయిన్ కొనాలంటే సుమారు రూ.8 లక్షలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ట్రంప్ వ్యాఖ్యల నేపధ్యంలో కొద్ది రోజుల్లో బిట్ కాయిన్ విలువ 2 వేల డాలర్ల వరకూ పడింది. అంటే సుమారు లక్షన్నర తగ్గింది. ఇంతటి భారీ ఆటుపోట్లను ఎదుర్కొంటున్న నేపధ్యంలో వీటికి దూరంగా ఉండాలని వివిధ దేశాల ప్రధాన బ్యాంకులు తమ పౌరులను హెచ్చరిస్తూనే ఉన్నాయి.
మన దేశంలో కూడా నిషేధం
ఇన్నోవేటివ్ మైనింగ్ టెక్నాలజీతో రూపొందే బిట్ కాయిన్ను రాబోయే రోజుల్లో ప్రపంచమంతా ఎక్కడైనా చెల్లే విధంగా దీన్ని రూపొందించారు. ప్రపంచంలోని ఏ బ్యాంకుతో సంబంధం లేకుండా తనకు తాను డిమాండ్ - సప్లై ఆధారంగా దీని విలువలో మార్పులు ఉంటాయి. ప్రతీ ట్రాన్సాక్షన్ డిజిటల్గా రికార్డ్ అవుతుంది కాబట్టి ఎలాంటి హ్యాకింగ్కూ అవకాశం ఉండదని బిట్ కాయిన్ హోల్డింగ్ ఏజెన్సీలు చెబ్తాయి.
మన దేశంలో కూడా బిట్కాయిన్ పై నిషేధం అమల్లో ఉంది. దీని అమ్మకం, కొనుగోలును మన దేశం నిలిపివేసింది. ఆన్ లైన్లో బిట్ కాయిన్ కొనుగోలు చేసేందుకు మన బ్యాంకులు, క్రెడిట్ - డెబిట్ కార్డులు సహకరించవు. అంతేకాదు ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ (ఫెమా) నిబంధనల ప్రకారం బిట్ కాయిన్ను కలిగి ఉండడం కూడా నేరంగా పరిగణిస్తారు.