మళ్లీ నష్టాల్లోనే ముగింపు ! నేలకూలిన ఇండిగో
స్టాక్ మార్కెట్ ఈ రోజు కూడా నష్టాల బాట పట్టింది. నిఫ్టీ కీలకమైన 11500 పాయింట్ల సెంటిమెంట్ మార్కుకు దిగువన ముగియడం మరింత ఆందోళనకు గురిచేస్తోంది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి నిరుత్సాహక సంకేతాలకు తోడు దేశీయంగా కూడా బడ్జెట్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కొనసాగుతూనే ఉన్నాయి. ఎఫ్పీఐలు, సూపర్ రిచ్ పై విధించిన పన్నుల అంశంపై కేద్రం ఇప్పటికీ ఎలాంటి స్పష్టమైన ప్రకటనా చేయకపోవడం టెన్షన్ను పెంచింది. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డ్ ఛైర్మన్ ఈ అంశంపై వివరణ ఇచ్చినప్పటికీ మార్కెట్లు పెద్దగా పట్టించుకోలేదు. ఆద్యంతం ఒడిదుడుకుల మధ్య కొట్టుమిట్టాడిన మార్కెట్లు చివరకు నష్టాల్లోనే ముగిశాయి. సెక్టోరల్ సూచీలన్నీ నష్టాల్లోనే ముగియడాన్ని బట్టి చేస్తేనే కరెక్షన్ తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. ఆటో, మెటల్, పీఎస్యూ బ్యాంక్స్, రియాల్టీ రంగ స్టాక్స్లో సెల్లింగ్ ఎక్కువగా నమోదైంది. చివరకు నిఫ్టీ 57 పాయింట్లు కోల్పోయి 11499 దగ్గర, సెన్సెక్స్ 174 పాయింట్లు కోల్పోయి 38557 దగ్గర, బ్యాంక్ నిఫ్టీ 47 పాయింట్లు నష్టపోయి 30522 వద్ధ స్థిరపడ్డాయి.
యెస్ బ్యాంక్, కోల్ ఇండియా, సన్ ఫార్మా, కోటక్ మహీంద్రా, ఐసిఐసిఐ బ్యాంక్ టాప్ ఫైవ్ గెయినర్స్గా నిలిచాయి. బజాజ్ ఫైనాన్స్, ఇండియాబుల్స్ హౌసింగ్ పైనాన్స్, బిపిసిఎల్, టాటా స్టీల్, జెఎస్డబ్ల్యు స్టీల్ స్టాక్స్ నష్టపోయిన షేర్ల జాబితాలో చేరాయి.
ఇండిగోలో సంక్షోభం
ఇద్దరు ప్రమోటర్ల మధ్యా తగవు చివరకు సెబీకి చేరడంతో ఇండిగో స్టాక్ భారీగా నష్టోయింది. సంస్థలో కార్పొరేట్ గవర్నెన్స్ కొరవడిందనే అనుమానాల నేపధ్యంలో ఇండిగో ఎయిర్లైన్స్ స్టాక్ ఏకంగా 15 శాతం వరకూ పడింది. చివరకు 11 శాతం నష్టంతో రూ.1398.05 దగ్గర స్టాక్ క్లోజైంది.
టాటాలకు జెఎల్ఆర్ సేల్స్ దెబ్బ
వార్షిక పరంగా చూస్తే జాగ్వర్ ల్యాండ్ రోవర్ సేల్స్ 9.6 శాతం క్షీణించింది. దీనికి తోడు 12 లక్షల షేర్లు బ్లాక్ డీల్ ద్వారా చేతులు మారాయి. ఈ నేపధ్యంలో స్టాక్ 3 శాతం వరకూ కోల్పోయింది. చివరకు రూ.151 దగ్గర స్టాక్ స్థిరపడింది.
బజాజ్ ఫైనాన్స్ మళ్లీ ప్చ్...
కన్స్యూమర్ ఫైనాన్స్ కంపెనీ అయిన బజాజ్ ఫైనాన్స్ మొన్న పడి.. నిన్న తేరుకున్నట్టు కనిపించినప్పటికీ ఈ రోజు మళ్లీ నీరసించింది. వాల్యూమ్స్తో సహా స్టాక్ 5 శాతానికి పైగా నష్టపోయింది. చివరకు 4.9 శాతం నష్టంతో రూ.3426.55 దగ్గర క్లోజైంది.
జెట్కు స్పైస్
ఇండిగోలో ప్రమోటర్ల మధ్య విబేధాలు, కార్పొరేట్ గవర్నెన్స్ అనుమానాల నేపధ్యంలో స్పైస్ జెట్ అనూహ్యంగా లాభపడింది. కాంపిటీటర్ అయిన ఈ కంపెనీ స్టాక్ 10 శాతం పెరిగింది. అయితే చివరి వరకూ లాభాలను నిలబెట్టుకోవడంతో విఫలమైంది. చివరకు 2 శాతం మాత్రమే లాభపడి రూ.120 దగ్గర స్టాక్ క్లోజైంది. ఇంట్రాడేలో స్టాక్ రూ.128.25 వరకూ వెళ్లింది.
ఆర్ఈసీకి ఫండింగ్ బూస్ట్
నిన్న భారీగా నష్టపోయిన రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ స్టాక్ ఈ రోజు కాస్త తేరుకుంది. బాండ్స్, డిబెంచర్స్ ద్వారా సుమారు రూ.75 వేల కోట్ల నిధులను సమీకరించేందుకు బోర్డ్ ఆమోదం తెలిపింది. దీంతో ఈ స్టాక్ 4.5 శాతం లాభపడి రూ.143 దగ్గర క్లోజైంది.
టీసీఎస్కు క్యూ1 రిజల్ట్స్ దెబ్బ
టీసీఎస్ రెవెన్యూ, నికర లాభంలో వృద్ధి అత్యల్పంగా ఉండడం మార్కెట్ వర్గాలను ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఇక మార్జిన్లు 3 శాతం క్షీణించడం కూడా నెగిటివ్ అంశంగా మారింది. దీంతో స్టాక్ ఈ రోజు 1.1 శాతం నష్టంతో రూ.2107.70 దగ్గర క్లోజైంది.